‘జస్టిస్ లోయా మృతి కేసు ఏ ఒక్క కుటుంబానికి చెందిందో కాదు’

ఫొటో సోర్స్, CARAVAN MAGAZINE
- రచయిత, అభిమన్యు కుమార్ సాహా
- హోదా, బీబీసీ ప్రతినిధి
దేశంలోనే మొట్టమొదటిసారిగా నలుగురు సీనియర్ సుప్రీంకోర్టు జడ్జీలు దేశ అత్యున్నత న్యాయస్థానంలో అంతా సక్రమంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసారు.
ఈ సమావేశంలో మీడియా ప్రతినిధులు వారు ప్రస్తావిస్తున్న సున్నితమైన అంశాలలో జస్టిస్ లోయా కేసు ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా జస్టిస్ గొగోయ్ 'అవును' అని సమాధానమిచ్చారు.
జస్టిస్ లోయా మృతిపై విచారణ కోరుతూ బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.
వాటిలో ఒకటి బాంబే లాయర్స్ అసోసియేషన్ తరపున బాంబే హైకోర్టులో దాఖలు కాగా, సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.
సుప్రీంకోర్టులో ఒక కేసు కాంగ్రెస్ నేత తహసీన్ పూనావాలా దాఖలు చేయగా, మరో కేసు మహారాష్ట్ర జర్నలిస్టు బంధు రాజ్లోనే దాఖలు చేసారు.

ఫొటో సోర్స్, SUPREME COURT OF INDIA
లోయా కేసు హియరింగ్
బంధు రాజ్లోనే తరపున సుప్రీంకోర్టులో ఈ కేసును వాదిస్తున్న ఇందిరా జైసింగ్, ఇది కేవలం ఒక కుటుంబానికి చెందిన కేసు కాదన్నారు.
ఒక జడ్జి మృతి చెందినపుడు దానిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపై ఉందని ఆమె బీబీసీతో అన్నారు.
గత శుక్రవారం సుప్రీంకోర్టు జస్టిస్ లోయా పోస్ట్ మార్టం రిపోర్టును అందజేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
లోయా మృతిపై ఉన్న అన్ని అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉందని ఇందిరా జైసింగ్ డిమాండ్ చేస్తున్నారు.
''జస్టిస్ లోయాను ఎవరో చంపారని మనం చెప్పలేము. కానీ పరిస్థితిని చూస్తే మాత్రం అది సహజమైన మృతిలా అనిపించడం లేదు'' అని ఆమె అన్నారు.
లోయా కుమారుడు అనూజ్ ప్రెస్ కాన్ఫరెన్స్పై.. ''లోయా సోదరి తన సోదరుని మృతి సహజంగా లేదని అంటారు. అదే సమయంలో 20 ఏళ్ల కుమారుడు, తమకు ఎలాంటి సందేహాలు లేవంటారు'' అని ప్రతిస్పందించారు.
ఆయన మృతిపై కుటుంబంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అందువల్ల ఆయన మృతిపై విచారణ జరిపించాల్సిన అవసరం ఇంకా ఎక్కువగా ఉందన్నారు.

ఫొటో సోర్స్, TWITTER/INDIRAJAISING
కుటుంబసభ్యుల్లోనే భిన్నాభిప్రాయాలు
''అనూజ్ బాడీ లాంగ్వేజ్ను, అతని చుట్టూ ఉన్న వ్యక్తులను చూడండి. అతను ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. అందువల్ల విషయం ఇప్పుడు మరింత సీరియస్గా మారినట్లు కనిపిస్తోంది'' అని ఆమె అన్నారు.
బాంబే హైకోర్టులో బాంబే లాయర్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 23న విచారణ జరుగుతుంది.
అయితే దీనిపై బాంబే హైకోర్టులో విచారణ జరుగుతుండగా, దానిపై మళ్లీ సుప్రీంకోర్టులో విచారణ జరగరాదని ఇందిరా జైసింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
''ప్రతి కేసుపై మొదట హైకోర్టులో విచారణ జరగాలనేది చట్టం. ఆ తర్వాతే అది సుప్రీంకోర్టుకు రావాలి'' అన్నారామె.
''సుప్రీంకోర్టుకు ఈ కేసు విషయంలో అంత తొందరెందుకు? కోర్టుకు నిజంగా ఈ కేసుపై అంత ఆసక్తి ఉంటే, జస్టిస్ కర్ణన్ కేసు విషయంలో మాదిరిగా జస్టిస్ లోయా మృతి చెందినప్పుడే ఎందుకు విచారణ చేపట్టలేదు '' అని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
'అనుమానాలు తొలగించాలి'
సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కాంగ్రెస్ నేత తహసీన్ పూనావాలా, జర్నలిస్టు బంధు రాజ్లోనే దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరుగుతోంది.
ఈ కేసును జస్టిస్ అరుణ్ మిశ్రా విచారిస్తున్నారు.
అయితే ఈ కేసుపై విచారణ నిలిపివేయాలంటూ ఇందిరా జైసింగ్ సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పూనావాలా ఆరోపిస్తున్నారు.
''బాంబే హైకోర్టులో పిటిషన్ జనవరి 4న దాఖలైంది. కానీ నేను డిసెంబర్ 12 నే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను'' అని ఆయన బీబీసీకి తెలిపారు.
''నేను కేవలం ఒక వ్యక్తి మరణం గురించి మాట్లాడ్డం లేదు. ఒక జడ్జి మృతి గురించి మాట్లాడుతున్నాను. దానిపై ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేయాల్సిన అవసరముంది'' అని పూనావాలా అన్నారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








