You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఐఫోన్ హ్యాకింగ్ ఆరోపణలు: యాపిల్ వివరణపై కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏమన్నారు?
తమ ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని, దీనిపై యాపిల్ కంపెనీ నుంచి అలెర్ట్స్ వచ్చాయని ఇండియాలోని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.
ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ నేతలు మహువా మొయిత్రా, శశి థరూర్, ప్రియాంక చతుర్వేదీ, తెలంగాణ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారకరామారావు తదితరులు తమకు 'యాపిల్ ఈమెయిల్స్' వచ్చాయంటూ సోషల్ మీడియాలో పెట్టారు.
హ్యాకింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో దీనిపై యాపిల్ సంస్థ కూడా స్పందించింది.
అనంతరం కేంద్ర ప్రభుత్వం, పలువురు బీజేపీ నేతలు దీనిపై ప్రకటన విడుదల చేశారు.
అసలేం జరిగింది?
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన (ఉద్ధవ్ బాలా సాహెబ్ థాకరే) నాయకురాలు ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్కు చెందిన శశి థరూర్, పవన్ ఖేరాలు తమ ఫోన్లను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని, దీనిపై యాపిల్ కంపెనీ నుంచి అలెర్ట్స్ వచ్చాయని స్క్రీన్షాట్లను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో పంచుకున్నారు.
"ప్రభుత్వం నా ఫోన్, ఈమెయిల్ను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తోందని యాపిల్ నుంచి హెచ్చరికతో కూడిన సందేశం, ఈ మెయిల్ వచ్చాయి. మీ భయం చూస్తే నాకు జాలేస్తోంది" అని ట్విటర్లో తెలిపారు మహువా మొయిత్రా.
“నేను కాకుండా ఇండియా కూటమి నాయకులైన అఖిలేష్ యాదవ్, రాఘవ్ చద్దా, శశి థరూర్, ప్రియాంక చతుర్వేది, సీతారాం ఏచూరి, పవన్ ఖేరా, రాహుల్ గాంధీ కార్యాలయంలో కొద్ది మందికి సంబంధించిన వ్యక్తుల ఫోన్లపై హ్యాకింగ్కు ప్రయత్నించారు. ఇది ఎమర్జెన్సీ కంటే దారుణం'' అని ఆరోపించారామె.
ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా 'హ్యాకింగ్ స్క్రీన్షాట్'ను పంచుకున్నారు. యాపిల్ నుంచి తనకు ఈ సందేశం అందిందని చతుర్వేది తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తారా? అని హోం మంత్రిత్వ శాఖను ఆమె ప్రశ్నించారు.
నా ఫోన్ తీసుకోండి: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని, బీజేపీపై విమర్శలు చేశారు. అదానీని తాకగానే నిఘా సంస్థలు గూఢచర్యం ప్రారంభిస్తాయని ఆరోపించారు.
“నా కార్యాలయంలో చాలామందికి ఈ సందేశం వచ్చింది. వీరిలో కేసీ వేణుగోపాల్, పవన్ ఖేడా ఉన్నారు. మీరు ఎన్ని ఫోన్లైనా ట్యాప్ చేసుకోండి. నాకు పట్టింపు లేదు. నా ఫోన్ కూడా తీసుకోండి. నాకు భయం లేదు'' అని అన్నారు రాహుల్.
కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, అబద్ధమని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. ఈ అంశంపై యాపిల్ స్పందించాలని కోరింది.
ప్రభుత్వాన్ని నిందించే బదులు, ప్రతిపక్ష నాయకులు యాపిల్ వద్ద ఈ అంశాన్ని లేవనెత్తాలని, కేసు నమోదు చేయాలని, వారిని ఎవరు ఆపుతున్నారని కేంద్ర మాజీ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా 'స్టేట్-స్పాన్సర్డ్ అటాకర్స్' తన ఫోన్ను టార్గెట్ చేస్తున్నట్లు మెసేజ్ వచ్చిందని ఎక్స్లో పోస్ట్ షేర్ చేశారు.
ప్రతిపక్ష నాయకులపై దాడి చేయడానికి బీజేపీ ఎంతకైనా దిగజారుతుందని మనకు తెలుసు కాబట్టి, ఇదేమంత ఆశ్చర్యం కలిగించలేదు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
యాపిల్ కంపెనీ ఏమంది?
ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంపై యాపిల్ సంస్థ స్పందించింది. సదరు నేతలకు వచ్చిన మెయిల్స్ 'నకిలీ అలెర్ట్స్' కూడా అయి ఉండొచ్చని, ఇలాంటివి 150 దేశాల్లోని పలువురికి వెళ్లినట్లు తెలిపింది.
''ఈ అలెర్ట్స్ని హ్యాకర్స్ పనిగా ఆపాదించలేం, ఎందుకంటే వాళ్లు అధునాతన టెక్నాలజీ వాడతారు, దీనికి అవసరమైన నిధులు, టెక్నాలజీ వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. యాపిల్ ఫోన్లకు వచ్చే నోటిఫికేషన్లు ఒక్కోసారి నకిలీ కూడా అయిండొచ్చు'' అని ప్రకటించింది.
రాహుల్ విమర్శలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అమిత్ మాల్వియా స్పందించారు.
''రాహుల్ గాంధీ జోక్ తర్వాత నిమిషాల వ్యవధిలోనే యాపిల్ ప్రకటన విడుదల చేసింది. విదేశీ ఏజెన్సీలు స్పాన్సర్ చేసిన కథనాలను హైలైట్ చేయడానికి ఆయనను నడిపించేది ఏమిటి? సోరోస్? చివరిసారి కూడా ఆయన తన ఫోన్ను విచారణకు సమర్పించలేదు. పనికిమాలిన ఆరోపణలు చేస్తూ దేశం సమయాన్ని వృథా చేయడం ఎందుకు?'' అని ట్విటర్లో తెలిపారు.
కేంద్రం ఏం చెప్పింది?
ప్రతిపక్ష నేతల ఆరోపణలపై కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుంటోందని, దీనిపై మంత్రిత్వ శాఖ దర్యాప్తు ప్రారంభించిందని ఆయన చెప్పారు.
అదే సమయంలో ఈ విషయంలో యాపిల్ ఇచ్చిన సమాచారం అస్పష్టంగా ఉందని ఆరోపించారు మంత్రి.
"యాపిల్ నుంచి 'స్టేట్ స్పాన్సర్డ్ ఎటాక్స్' అలెర్ట్ వచ్చిందని కొందరు గౌరవనీయులైన ఎంపీలు, పౌరులు లేవనెత్తిన సమస్యపై ప్రభుత్వం చాలా ఆందోళన చెందుతోంది. మేం ఈ సమస్య లోతుకు వెళతాం. మేం ఇప్పటికే దీనిపై విచారణకు ఆదేశించాం" అని ట్విటర్లో తెలిపారు.
''ఈ సమస్యపై యాపిల్ అందించిన సమాచారం చాలావరకు అస్పష్టంగా ఉంది. ఈ నోటిఫికేషన్లు అసంపూర్ణ సమాచారం ఆధారంగా ఉండవచ్చని యాపిల్ ప్రకటించింది. 'ఈ నోటిఫికేషన్లు' నకిలీ అలారాలు కావచ్చు లేదా కొన్ని దాడులను గుర్తించలేకపోవచ్చని కూడా చెప్పింది ఆ సంస్థ" అని మంత్రి తెలిపారు.
యాపిల్ ఐడీలు సురక్షితంగా ఎన్క్రిప్ట్ అవుతాయని, యూజర్ అనుమతి లేకుండా వాటిని యాక్సెస్ చేయడం లేదా గుర్తించడం చాలా కష్టమని యాపిల్ కూడా క్లెయిమ్ చేసిందని అశ్విని వైష్ణవ్ గుర్తుచేశారు
ఈ ఎన్క్రిప్షన్ వినియోగదారుల యాపిల్ ఐడీలను రక్షిస్తుంది, అవి ప్రైవేట్గా, సురక్షితంగా ఉండేలా చూస్తుందని చెప్పారు.
పౌరులందరి గోప్యత, భద్రతను పరిరక్షించడంలో భారత ప్రభుత్వం తన పాత్రను చాలా సీరియస్గా తీసుకుంటుందని మంత్రి తెలిపారు.
ఈ దర్యాప్తులో సహకరించవలసిందిగా యాపిల్ని కూడా కోరామని చెప్పారు అశ్విని వైష్ణవ్.
ఇవి కూడా చదవండి
- జెహోవా విట్నెస్: ఇంగ్లిష్ టీచర్ ఎందుకు బాంబులు పెట్టారు?
- రఫా క్రాసింగ్ ఓపెన్: 20 లక్షలమందికి 20 లారీల సాయం సరిపోతుందా?
- వేడి వేడి చికెన్ సూప్ తాగితే జలుబు తగ్గుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారు
- నవాజ్ షరీఫ్: పాకిస్తాన్లో దిగిన మాజీ ప్రధాని... ఆర్మీ ఆటలో ఈసారి ఏం జరుగుతుందో?
- గోల్కొండ వజ్రాలతో ఆ యూదుల దశ ఎలా తిరిగింది?
- టైగర్ నాగేశ్వరరావు రివ్యూ: ఆంధ్రా రాబిన్ హుడ్గా రవితేజ అలరించాడా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)