ట్విటర్-ఎలాన్ మస్క్: బ్లూ బర్డ్ లోగోను తీసేసి ఎక్స్ గుర్తును ఎందుకు పెట్టారు?

    • రచయిత, నటాలీ షెర్మాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇంటర్నెట్‌లో అత్యంత గుర్తించదగిన లోగోలలో ఒకటైన ట్విటర్ 'బ్లూ బర్డ్' ఇపుడు లేదు. తెలుపు, నలుపు రంగులో కనిపించే ఎక్స్‌ గుర్తును దాని స్థానాన్ని ఆక్రమించింది. అయితే ఇది ఎలాన్ మాస్టర్‌స్ట్రోకా, లేక బ్రాండింగ్ డిజాస్టరా?

బ్లూ బర్డ్‌కు బదులుగా ఆర్ట్ డెకో-స్టైల్ X కు ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగోను పెట్టబోతున్నారనే వార్తను జీన్-పియర్ డ్యూబ్ చూసి, అదొక జోక్‌గా అభివర్ణించారు.

‘‘గుర్తింపు ఉన్న బ్రాండ్‌ను ఎందుకు తీసేయాలి? దాన్ని చుట్టూ ఎంతో పెట్టుబడి, డబ్బు ఉన్నప్పుడు , దాన్ని తీసేసి మళ్లీ అన్నీ కొత్తగా మొదలు పెట్టడం ఎందుకు?

‘‘చుట్టూ బోలెడంత డబ్బు, పెట్టుబడి ఉన్న బ్రాండ్‌ను తీసుకోవడం ఎందుకు, దాన్ని మళ్లీ పూర్తిగా మార్చేసి కొత్తగా ప్రారంభించడం ఎందుకు? ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మరీ విచిత్రం’’ అని చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో పాఠాలు బోధించే ప్రొఫెసర్ డ్యూబ్ అన్నారు.

అయితే ఎలాన్ మస్క్ నిర్ణయాన్ని సమర్థించే వాళ్లూ ఉన్నారు.

ఈ నిర్ణయం పని చేస్తుందా?

గత ఏడాది ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ప్రకటనల ఆదాయం సగానికి పడిపోయిందని మస్క్​ ఈనెలలో తెలిపారు. పెద్ద బ్రాండ్‌లు వెనక్కి తగ్గినందున చాలా మార్పులు చేశారు మస్క్. వెరిఫైడ్ అకౌంట్, మోడరేట్ కంటెంట్ వంటివి ఇందులో ఉన్నాయి. అయితే, ఉద్యోగులను తొలగించడం, అప్పులు చెల్లించకపోవడం వంటివి కోర్టు కేసుల వరకూ వెళ్లాయి.

ట్విటర్ కోసం 44 బిలియన్ డాలర్లు చెల్లించారు మస్క్ . అయితే ఇపుడు కేవలం మూడింట ఒక వంతు మాత్రమే దాని విలువ ఉందని ఫిడిలిటీ అంచనా.

ట్విటర్ సంస్థ బ్రాండ్ విలువ దాదాపు 4 బిలియన్లుగా కన్సల్టెన్సీ బ్రాండ్ ఫైనాన్స్ అంచనా వేసింది. గత సంవత్సరం నుంచి 32 శాతానికి దాని విలువ దిగజారినట్లు ఇది చెబుతోంది. ఇది మస్క్ దూకుడు వ్యాపార విధానాల కారణంగా పతనమైందని వాదన.

‘‘రీ బ్రాండింగ్‌ వల్ల ఉపయోగాలుంటాయి’’

ఒక సంస్థ ఇబ్బందుల్లో ఉంటే, దాని రూపు రేఖలను పూర్తిగా మార్చేయాలనుకుంటే రీబ్రాండింగ్ చేయడం వల్ల ఫలితం ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయని నెబ్రాస్కా ఒమాహా విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్ ప్రొఫెసర్ యాన్హుయ్ జావో అన్నారు.

పబ్లిక్‌గా లిస్టెడ్ కంపెనీల ద్వారా 215 రీబ్రాండింగ్ నిర్ణయాలను ఆయన సమీక్షించారు. వాటిలో సగం కంటే ఎక్కువ బిజినెస్‌లు రీబ్రాండ్ చేసిన తర్వాత మంచి లాభాలను సాధించాయని ఆయన అన్నారు.

అంటే మస్క్ నిర్ణయాలు సమయానుకూలంగా ఉండవచ్చని, చైనా వీచాట్ మాదిరిగానే ట్విట్టర్‌ను "ఎవ్రీతింగ్ యాప్"గా మార్చాలనే ఆశయం ఆయనకుఉండవచ్చన్నారు ప్రొఫెసర్ యాన్హుయ్ జావో.

వీచాట్‌తో వినియోగదారులు డబ్బులు పంపుకోవచ్చు, టాక్సీలను బుక్ చేసుకోవచ్చు, గేమ్‌లు ఆడవచ్చు.

" ట్విటర్‌ రూపురేఖలు మార్చాలనుకున్నప్పుడు రీబ్రాండింగ్ అనేది సరైన నిర్ణయం’’ అని ప్రొఫెసర్ బీబీసీతో చెప్పారు.

అయితే, కంపెనీ గందరగోళంలో ఉన్నప్పుడు సక్సెస్ తక్కువగా ఉంటుందని బోస్టన్ యూనివర్సిటీ క్వెస్ట్రామ్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో మార్కెటింగ్ ప్రొఫెసర్ శుభా శ్రీనివాసన్ హెచ్చరించారు.

ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంలా కనిపిస్తున్న థ్రెడ్‌ వంటి సోషల్ మీడియా పోటీదారులు వస్తున్న సమయంలో ఇది చాలా ప్రమాదకర నిర్ణయం కావచ్చని ఆమె అన్నారు.

"మస్క్ ట్విటర్‌ను కొనడమే దాని కథ ముగిసిందనడానికి సంకేతమని యూజర్లు అనుకున్నారు. ఇపుడు రీబ్రాండింగ్ వారిలో ఈ భయం నిజమయ్యే అవకాశం ఉంది" అని ఆమె చెప్పారు.

నాయకత్వ సమస్య ఉన్నంతగా బ్రాండ్ సమస్య, బ్రాండ్ ఐడెంటిటీ సమస్య ఉందని తాను అనుకోలేదని ప్రొఫెసర్ డ్యూబ్ తెలిపారు.

‘ఎక్స్‌ను యాప్‌గా మార్చాలన్నది మస్క్ కోరిక’

మే నెలలో ‘ది బేబీలాన్ బీ’కి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఎలాన్ మస్క్ ఈ మార్పును ప్రస్తావించారు.

చిన్న టెక్ట్స్‌లకు బాగా ప్రాచుర్యం పొందిన కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లి, విజయవంతం చేసేందుకు ఉపయోగపడేలా ట్విటర్ బ్రాండింగ్‌ను విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

‘‘సూపర్ యాప్ విండో క్లోజ్ అయింది’’ అనే పేరుతో జూన్‌లో అడ్వయిజరీ సంస్థ ఫోర్రెస్టర్ రీసెర్చ్ ఒక నివేదిక ప్రచురించింది.

ఆ నివేదికలో అమెరికా, యూరప్‌లలో కోట్లాది యూజర్లకు సూపర్ యాప్ లాంటి ఫంక్షన్లను గూగుల్, ఆపిల్ లాంటి టెక్ దిగ్గజాలు అందిస్తున్నాయని, కానీ క్లిష్టమైన నియంత్రణ సవాళ్లు, తీవ్రమైన పోటీతో ఇతరులకు అవకాశాలు పరిమితమవుతున్నాయని తెలిపింది.

ఇతర పేమెంట్ సర్వీసులున్నప్పటికీ వీచాట్‌ చైనాలో ఎలా ఆధిపత్య స్థానానికి వెళ్లిందో తెలుపుతూ ఎలన్ మస్క్ వివరించారు.

పరిమిత ఫోన్ మెమరీ లాంటి టెక్నికల్ సమస్యల ఫలితంగా మల్టిపుల్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం కుదరడం లేదన్నారు.

‘‘ఎక్స్‌ను ఎవ్రీతింగ్ యాప్‌గా మార్చాలన్నది మస్క్ కోరిక. దీనికి సమయం, డబ్బు, ప్రజలు కావాల్సి ఉంది. ఈ మూడు ప్రస్తుతం కంపెనీ వద్ద లేవు’’ అని ఎలన్ మస్క్ ప్రకటన తర్వాత ఫోర్రెస్టర్ రీసెర్చ్ డైరెక్టర్ మైక్ ఫ్రోల్క్స్ అన్నారు.

గతంలో మాదిరి మీడియా, రాజకీయ వ్యక్తులు, ఫైనాన్స్ ట్విటర్‌కి ప్రధాన యూజర్లులాగా ఉన్నప్పటికీ, ఎక్స్‌ను విజయవంతం చేయడానికి విస్తృతమైన యూజర్ బేస్ కావాల్సి ఉందని, ఇదంత చిన్న విషయం కాదని హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ ఆండీ వూ చెప్పారు.

మస్క్ టేకోవర్ ముందు కూడా ట్విటర్ పలు సవాళ్లను ఎదుర్కొందనీ, కొంత రిస్క్ తీసుకోవడం వల్ల ప్రయోజనముంటుందన్నారు ఆండీ వూ.

‘‘ఈ మార్పులు సరైన దిశగా వెళ్తాయా లేదా అన్నది తర్వాత సంగతి, కానీ ట్విటర్‌కు మార్పులు మాత్రం అవసరమే’’ అన్నారాయన.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)