ఐఎన్‌‌ఎస్ విశాఖపట్నం: 22 మంది భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై హుతీల క్షిపణి దాడి, స్పందించిన భారత నౌకాదళం

హూతీలు చేసిన క్షిపణి దాడిలో మంటల్లో చిక్కుకున్న ఎంవీ మార్లిన్ లువాండా వాణిజ్య నౌకకు సహాయకంగా భారత నౌకాదళానికి చెందిన క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్‌ఎస్ విశాఖపట్నం గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌కు వెళ్లింది.

శుక్రవారం రాత్రి గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో మార్లిన్ లువాండా నౌక మీద హుతీలు క్షిపణి దాడి చేయడంతో మంటలు చెలరేగాయి. గంటల పాటు నౌక మంటల్లో చిక్కుకుంది.

సహాయం కోసం ఎంవీ నౌక విజ్ఞప్తి చేయగా భారత నౌకాదళం స్పందించింది. ఈ విషయాన్ని భారత నౌకాదళ అధికార ప్రతినిధి ట్వీట్ ద్వారా తెలిపారు.

ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌకకు చెందిన ఎన్‌బీసీడీ బృందం మంటల్ని చల్లార్చే పనిలో ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

‘‘ఎంవీ మార్లిన్ లువాండా వాణిజ్య నౌకలో 22 మంది భారతీయులతో పాటు ఒక బంగ్లాదేశీ సిబ్బంది ఉన్నారు. ఎంవీ నౌకకు రక్షణ కల్పించడం, సముద్రంలో సిబ్బంది ప్రాణాలను కాపాడే పనికి భారత నౌకాదళం కట్టుబడి ఉంది’’ అని ట్వీట్‌లో రాశారు.

ఏం జరిగింది?

గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో యూకే ట్యాంకర్‌ గంటల పాటు మంటల్లో చిక్కుకుంది. హుతీలు ఆ ట్యాంకర్ నౌక మీద క్షిపణితో దాడి చేశారు.

ప్రమాదానికి గురైన ఈ నౌకకు ఫ్రెంచ్, భారత్, అమెరికా నావికా దళాలు సహాయం అందించాయి.

అమెరికా-బ్రిటన్‌ల దూకుడుకు ప్రతిస్పందనగా మార్లిన్ లువాండాను శుక్రవారం లక్ష్యంగా చేసుకున్నట్లు యెమెన్‌కు చెందిన హుతీలు ప్రకటించారు.

ఎర్ర సముద్ర ప్రాంతంలో నౌకలపై హుతీలు చేస్తోన్న దాడులకు ప్రతిచర్యగా అమెరికా, యూకేలు హుతీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ వైమానిక దాడులు చేశాయి.

మార్లిన్ లువాండా నౌక యూకే రిజిస్టర్డ్ కంపెనీ ‘ఓసియానిక్స్ సర్వీసెస్ లిమిటెడ్’ పేరిట నమోదై ఉంది.

బహుళజాతి ట్రేడింగ్ కంపెనీ ట్రాఫిగురా తరఫున ఈ ట్యాంకర్ విధులు నిర్వహిస్తోంది.

సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని, నౌకలోని ఒక కార్గో ట్యాంక్‌లో మంటలు చెలరేగాయని శనివారం ట్రాఫిగురా కంపెనీ తెలిపింది.

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హుతీ తిరుగుబాటుదారులు చేసిన తాజా దాడి ఇది.

పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు ప్రతీకారంగా కొంత కాలంగా ఎర్ర సముద్రంలో ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలపై దాడులు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మార్లిన్ లువాండా షిప్‌పై దాడి చేసినట్లు హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.

ట్యాంకర్‌పై 'యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణి' దాడి జరిగిందని అమెరికా తెలిపింది.

ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

ఏడెన్‌కు ఆగ్నేయంగా 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగిందని యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)