You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే: రాణి ముఖర్జీ సినిమా పై 'నార్వే' ఎందుకు నిరసన వ్యక్తం చేస్తోంది?
- రచయిత, శుభజ్యోతి ఘోష్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మార్చి 17న విడుదలైన బాలీవుడ్ చిత్రం 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' పై వివాదం తలెత్తింది. ఈ సినిమాను నార్వే రాయబారి వ్యతిరేకించారు.
ఈ బాలీవుడ్ చిత్రంలో ప్రముఖ నటి రాణి ముఖర్జీ నటించారు.
దాదాపు 12 ఏళ్ల క్రితం నార్వేలో ఓ భారత సంతతి తల్లిదండ్రులకు జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
అయితే ఈ చిత్రంలో నార్వేకు సంబంధించిన అనేక అంశాల్లో వైరుధ్యాలు ఉన్నాయని భారత్లోని నార్వే రాయబారి హన్స్ జాకబ్ ఫ్రైడెన్లండ్ అసంతృప్తి వ్యక్తంచేశారు.
చిత్రంలో చూపిన అంశాలు పూర్తిగా అవాస్తవమని ఒక వార్తాపత్రికకు రాసిన కథనంలో ఆయన తెలిపారు.
ఫ్రైడెన్లండ్ మార్చి 17న దీనికి సంబంధించిన ట్వీట్ను పోస్టు చేశారు.
'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' సాగరిక చక్రవర్తి అనే మహిళ జీవితంలో నార్వేలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా రూపొందించారు.
మరోవైపు నార్వే ప్రభుత్వం నిజం చెప్పడం లేదని, ఈ సంఘటనపై అవాస్తవాలు వ్యాప్తి చేస్తోందని ఆమె వాదిస్తున్నారు.
ఈ సినిమాకు, నార్వేకు సంబంధం ఏంటి?
సుమారు 12 ఏళ్ల క్రితం నార్వేలోని స్టావాంగా నగరంలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన సాగరిక, చక్రవర్తిల ఇద్దరు పిల్లలను నార్వేజియన్ చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్ (ఎన్సీడబ్ల్యూఎస్) ఆధీనంలోకి తీసుకుంది.
ఇది అప్పట్లో పెద్ద వివాదానికి దారి తీసింది. దీనిపై భారత ప్రభుత్వం కూడా దౌత్యపరమైన జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
నార్వే కోర్టులో సుదీర్ఘ విచారణ తర్వాత పిల్లలిద్దరినీ సాగరిక కుటుంబానికి అప్పగించారు. ఆ తర్వాత పిల్లలు సాగరిక చక్రవర్తితో భారత్లో పెరిగారు.
అయితే తన పిల్లలను ఒడిలో నుంచి అన్యాయంగా లాక్కున్నందుకు నార్వే ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదని సాగరిక అంటున్నారు.
ఆ నార్వే ఘటనపై భారత్లో చాలా నెలల పాటు చర్చ నడిచింది. నార్వే తీరుపై భారత్లోని సామాన్య ప్రజలూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
భారత పార్లమెంటు దృష్టికి కూడా ఈ విషయం వచ్చింది. ఈ అంశంపై అప్పటి విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ కూడా పార్లమెంట్లో ప్రకటన చేశారు.
ఆ సంఘటన ఆధారంగా రూపొందిందే ఈ 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' చిత్రం.
నార్వే రాయబారి ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు?
ఈ చిత్రం విడుదలైన తర్వాత భారతదేశంలోని నార్వే రాయబారి దీనిని ఖండించారు.
నార్వేలో తల్లిదండ్రుల సంప్రదాయం భారతదేశానికి భిన్నంగా ఉండవచ్చని, కానీ ఇది హ్యూమన్ ఫీలింగ్స్పై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
తల్లి ప్రేమలో ఎలాంటి తేడా ఉండదన్నారు.
పిల్లలను తమతో పడుకోబెట్టుకోవడం లేదా ఆహారం తినిపించడం నార్వేజియన్ సంస్కృతిలో అంగీకరించరనే అభిప్రాయాన్ని 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' చిత్రంలో సృష్టించారని ఫ్రైడెన్లండ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
"ఈ సంఘటనకు సాంస్కృతిక భేదాలే ప్రధాన కారణమని చిత్రంలో చూపించారు. ఇది పూర్తిగా తప్పు. నేను ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్లకూడదనుకుంటున్నా,
కానీ, నార్వేలో పిల్లలను తమతో పడుకోబెట్టుకోవడం, ఆహారం తినిపించడమనేవి వారిని ప్రత్యామ్నాయ సంరక్షణకు అప్పగించడానికి కారణాలు కాదని నొక్కి చెప్పాలనుకుంటున్నా.
నేను కూడా పడుకునే ముందు నా పిల్లలకు కథలు చెప్పేవాడిని, వారిని కౌగిలించుకుని లాలించేవాడిని. వారు కూడా నా మంచంపై పడుకునేవారు" అని ఫ్రైడెన్లండ్ తెలిపారు.
తల్లిదండ్రులు పిల్లలను కొట్టారనే (అప్పుడప్పుడు చెంపదెబ్బ) కారణంతో బిడ్డను వారి నుంచి తీసుకోరని ఆయన చెప్పారు.
అలాంటి సందర్భాలలో చైల్డ్ వెల్ఫేర్ సర్వీస్ తల్లిదండ్రులకు సలహాలు ఇచ్చి సహాయం చేస్తుందని తెలిపారు.
నార్వేలో 20 వేల మందికి పైగా ఎన్నారైలు నివసిస్తున్నారని ఆయన చెప్పారు. నార్వేకు రావాలనుకునే భారతీయులను ఈ చిత్రం ఆపబోదనుకుంటున్నానని ఫ్రైడెన్లండ్ ఆశాభావం వ్యక్తంచేశారు.
చిత్ర నిర్మాతలు ఏం అంటున్నారు?
భారత్లో నిర్మించిన సినిమాపై విదేశీ రాయబారి అసంతృప్తి వ్యక్తం చేసిన ఘటనలు అరుదు.
నార్వే రాయబారి 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' చిత్రాన్ని వ్యతిరేకించినప్పటికీ నిర్మాతలు వెనక్కి తగ్గడం లేదు.
నార్వేలోని పిల్లల రక్షణ వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ సినిమాలో ఎలాంటి కల్పితాలను చూపించలేదని చిత్ర నిర్మాత నిఖిల్ అద్వానీ స్పష్టంచేశారు.
నార్వే రాయబారి విమర్శలకు సమాధానంగా నిఖిల్ అద్వానీ ట్వీట్ చేశారు.
భారతదేశంలో అతిథులను సత్కరించే సంప్రదాయాన్ని అనుసరించి, సినిమా విడుదలకు ఒక రోజు ముందు నార్వే రాయబారి కోసం ప్రత్యేక ప్రదర్శన కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
అయితే సినిమా పూర్తయిన తర్వాత మూవీకి సంబంధించిన ఇద్దరు మహిళలతో నార్వే రాయబారి బెదిరింపు ధోరణిలో మాట్లాడారని నిఖిల్ ఆరోపించారు.
నిఖిల్ తన ట్వీట్లో సాగరిక చక్రవర్తి పోస్ట్ చేసిన వీడియోను కూడా పంచుకున్నారు. దీనిలో నార్వే ప్రభుత్వం స్పందనను సాగరిక ఖండించారు.
ఇదిలావుండగా నార్వేతో పాటు అనేక పాశ్చాత్య దేశాల్లో పిల్లల సంరక్షణ వ్యవస్థలో అనేక లోపాలున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత, ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి మణిశంకర్ అయ్యర్ ఆరోపించారు.
కుటుంబాల మధ్య పెరిగే పిల్లల కంటే ఫోస్టర్ కేర్లో పెరిగే పిల్లలు పలు రకాలైన మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని శాస్త్రీయ పరీక్షలు రుజువు చేశాయని ఆయన గుర్తుచేశారు.
మరోవైపు ఈ వివాదం నేపథ్యంలో 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే' చిత్రానికి భారత్లోనే కాకుండా విదేశాల్లో కూడా థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు.
సినిమా విడుదలైన రెండు వారాల్లోనే రూ. 17 కోట్లకు పైగా వసూలు చేసిందని సినీ విమర్శకుడు తరుణ్ ఆదర్శ్ తెలిపారు.
ఈ చిత్రంలో రాణి ముఖర్జీతో పాటు అనిర్బన్ భట్టాచార్య, జిమ్ సర్భ్, బాలాజీ గౌరీ, నీనా గుప్తా తదితరులు నటించారు.
ఇవి కూడా చదవండి
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)