You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మథురలో ఘోర రోడ్డు ప్రమాదం.. 'పొగమంచులో కనిపించక 7 బస్సులు, 3 కార్లు ఒకదానికొకటి ఢీకొని చెలరేగిన మంటలు'
మథురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంచులో సరిగ్గా కనిపించక బస్సులు, కార్లు ఒకదానికి మరోటి వరుసగా ఢీకొనడంతో మంటలు చెలరేగినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
దిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది.
"యమునా ఎక్స్ప్రెస్వేలోని 127వ మైలురాయి వద్ద ప్రమాదం జరిగింది. మంచుకు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. 7 బస్సులు, 3 కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి, దీంతో వాహనాల్లో మంటలు చెలరేగాయి. సహాయక చర్యలు దాదాపు పూర్తయ్యాయి" అని మథుర ఎస్ఎస్పీ శ్లోక్ కుమార్ మీడియాతో చెప్పారు.
"ఈ ప్రమాదంలో ఇప్పటివరకు నలుగురు మరణించారు. 25 మందిని ఆసుపత్రికి తరలించాం.వారి పరిస్థితి నిలకడగానే ఉంది" అని ఆయన చెప్పారు.
"బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలియజేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత శాఖలను ముఖ్యమంత్రి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు" అని యూపీ సీఎంవోను ఉటంకిస్తూ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
'వెనకనుంచి చాలా బస్సులు వచ్చి ఢీకొన్నాయి, వాటికి మంటలు అంటుకున్నాయి'
"మేం దిల్లీకి వెళ్తున్నాం. దారంతా పొగమంచు ఉంది. సరిగ్గా కనిపించడం లేదు. పెద్ద శబ్దం వచ్చింది. బస్సు సడెన్గా ఆగిపోయింది. మేం బస్సు దిగగానే వెనకనుంచి చాలా బస్సులు వచ్చి ఢీకొన్నాయి. వాటికి మంటలంటుకున్నాయి. మేం అరుస్తూ పరిగెత్తాం. అద్దాలు పగలకొట్టి కొంతమంది దూకడానికి ప్రయత్నించారు. మా కుటుంబంలో ఒకరు మరణించారు" అని సునీల్ కుమార్ అనే ప్రయాణికుడు ఏఎన్ఐతో చెప్పారు.
"ప్రమాదం జరగ్గానే దాదాపు 3-4 బస్సులకు మంటలు అంటుకున్నాయి. అప్పుడు నేను నిద్రపోతున్నా. బస్సునిండా జనం ఉన్నారు. ఈ ప్రమాదం సుమారు ఉదయం 4 గంటలకు జరిగింది" అని మరో ప్రత్యక్షసాక్షి తెలిపారు.
కలెక్టర్ ఏం చెప్పారంటే..
"పొగమంచు కారణంగా దిల్లీ–ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై వాహనాలు ఢీకొని, మంటలు చెలరేగాయి. పొగమంచు, సరిగ్గా కనిపించపోవడం వల్ల ఉదయం సుమారు 4 గంటల…4:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. చనిపోయనవారికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించారు.
గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. 20 ఫైర్ బ్రిగేడ్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చాం. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి " అని కలెక్టర్ చంద్రప్రకాశ్ సింగ్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)