‘అమ్మ కావాలనే నా కల చెదిరిపోయింది’

    • రచయిత, ఈథర్ షాలబీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"నా నరాలు తెగిపోయాయి... ఇక నాకేమీ మిగల్లేదు" అని 26 ఏళ్ల పాలస్తీనా మహిళ నౌరా చెప్పారు.

కొన్నేళ్లపాటు ఐవీఎఫ్ చికిత్స తీసుకున్న తర్వాత, ఆమె జూలై 2023లో గర్భం దాల్చారు.

గర్భ నిర్థరణ పరీక్ష పాజిటివ్ వచ్చినప్పుడు తనకు పట్టలేనంత సంతోషం కలిగిందంటూ.. అప్పటి క్షణాలను ఆమె గుర్తు చేసుకున్నారు.

భవిష్యత్తులో ఇంకొంతమంది పిల్లలు కలగాలనే ఆశతో నౌరా, ఆమె భర్త మొహమ్మద్.. గాజా నగరంలోని అల్-బస్మా ఫెర్టిలిటీ సెంటర్‌లో మరో రెండు పిండాలను భద్రపరుచుకోవాలని నిర్ణయించుకున్నారు.

"చివరికి నా కల నిజమైందనుకున్నా, కానీ ఇజ్రాయెలీలు వచ్చినరోజే అంతా ముగిసిపోయిందనిపించింది" అని ఆమె అన్నారు.

హమాస్ 2023 అక్టోబర్ 7న సరిహద్దు దాటి చేసిన దాడిలో 1200మంది మరణించారు. 251మందిని బందీలుగా తీసుకువెళ్లారు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది.

అప్పటి నుంచి గాజాలో కనీసం 54,000 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

వేలాది మంది గాజా నివాసితుల్లానే, నౌరా, మొహమ్మద్ కూడా పదే పదే ఒకచోటునుంచి మరోచోటుకి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆరోగ్యకరమైన గర్భధారణకు అవసరమైన ఆహారం, విటమిన్లు, మందులు వారికి అందుబాటులో లేవు.

"భయంకరమైన బాంబు దాడుల మధ్యే గంటలపాటు నడిచి మేం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేవాళ్ళం" అని మొహమ్మద్ చెప్పారు.

నౌరాకు ఏడోనెలలో తీవ్ర రక్తస్రావం అయింది.

"రక్తస్రావం అవుతున్నప్పుడు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఒక్క వాహనం కూడా కనిపించలేదు. చివరికి చెత్త ట్రక్కులో ఆమెను ఆస్పత్రికి తరలించాం" అని మొహమ్మద్ తెలిపారు.

"మేం ఆస్పత్రికి వెళ్లేసరికే ఆమెకు గర్భస్రావం మొదలైపోయింది."

నౌరాకి కవలలు... కానీ ఒకరు ప్రాణంలేకుండా పుట్టగా... మరొకరు పుట్టిన కొన్ని గంటల తర్వాత మరణించారు.

నెలలు నిండని పిల్లలకోసం ఇంక్యుబేటర్లు అందుబాటులో లేవని మొహమ్మద్ చెప్పారు.

‘‘ అంతా నిమిషంలో ముగిసిపోయింది" అని నౌరా అన్నారు.

కవలలను కోల్పోవడమేకాకుండా..వారు ఐవీఎఫ్ కేంద్రంలో భద్రపరుచుకున్న పిండాలు కూడా ధ్వంసమయ్యాయి.

‘‘అవి అంకెలు కాదు, తల్లుల కలలు’’

అల్-బస్మా ఫెర్టిలిటీ సెంటర్‌పై 2023 డిసెంబర్ ప్రారంభంలో కాల్పులు జరిగాయని, అది ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బహా ఘలాయిని విచారం వ్యక్తం చేశారు. అయితే ఈ కాల్పులు ఎప్పుడు జరిగాయనే కచ్చితమైన తేదీని, సమయాన్ని ఆయన చెప్పలేకపోయారు. కానీ ఆయన చెప్పిన అంచనాను ఆధారంగా చేసుకుని ఆ సమయంలో ఫెర్టిలిటీ సెంటర్ పనిచేస్తున్నట్టు అక్కడి సిబ్బంది ఒకరు తెలిపారు.

క్లినిక్‌లో రెండు ట్యాంకులు ఉన్నాయని, వాటిలో దాదాపు 4,000 పిండాలు, వెయ్యి కంటే ఎక్కువ వీర్యం, అండం శాంపిల్స్‌ భద్రపరిచినట్టు డాక్టర్ ఘలాయిని చెప్పారు.

"శాంపిల్స్‌ని భద్రపరిచే లిక్విడ్ నైట్రోజన్ (ద్రవ నత్రజని)తో నిండి ఉన్న రెండు ఇంక్యుబేటర్లు ధ్వంసమయ్యాయి, అవి10,000 డాలర్ల కంటే ఎక్కువ ఖరీదైనవని"ఆయన చెప్పారు.

ఆ ట్యాంకులను తరచుగా నైట్రోజన్‌తో నింపాలని... షెల్లింగ్‌కి రెండు వారాల ముందే ట్యాంకుల్లో నైట్రోజన్ స్థాయి తగ్గడం మొదలైందని ఆయన అన్నారు.

"అల్-నుసీరాత్‌లోని నైట్రోజన్ గిడ్డంగికి చేరుకుని, రెండు ట్యాంకులను తీసుకున్నాను", కానీ దాడుల తీవ్రత కారణంగా దాదాపు 12 కి.మీ దూరంలో ఉన్న క్లినిక్‌కు వాటిని తీసుకెళ్లలేకపోయాను.. ఆలోపే షెల్లింగ్ జరిగింది...ఇక ఆ ట్యాంకులతో పనిలేకుండాపోయింది" అని లాబొరేటరీ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అజ్జూర్ చెప్పారు. షెల్లింగ్ తర్వాత ఆయన దక్షిణ గాజాకు వెళ్లిపోయారు.

డాక్టర్ ఘలాయిని మాట్లాడుతూ, ఈ లాబొరేటరీలో మా సొంత క్లినిక్‌లతో పాటు ఇతర క్లినిక్‌లలో చికిత్స పొందుతున్నవారి కోసం కూడా పిండాలను భద్రపరిచాం. నేను 4,000 పిండాల గురించి మాట్లాడుతున్నాను. ఇవి కేవలం అంకెలు కాదు...ప్రజల కలలు. ఏళ్లతరబడి ఎదురుచూసి, బాధాకరమైన చికిత్సలు చేయించుకుని, వీటిపై తల్లులు పెట్టుకున్నఆశలు...కానీ చివరికి అన్నీ చెదిరిపోయాయి."

వంద నుంచి నూటయాభై మంది మహిళలు పిల్లలు పుట్టేందుకు తమకున్న చివరి అవకాశాన్ని కోల్పోయారని ఆయన అన్నారు. చాలామంది ఈ ప్రక్రియను మళ్ళీ చేయించుకోలేరు. "కొందరికి వయసు పెరుగుతోంది, మరికొందరు క్యాన్సర్ రోగులు, ఇంకొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. చాలామందికి ఒకసారి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. మళ్లీ ఈ ప్రక్రియనంతా మొదటినుంచి ప్రారంభించడం అంత సులభం కాదు’’ అన్నారు.

దీనిపై స్పందించాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలను సంప్రదించినప్పుడు, "దాడి ఎప్పుడు జరిగిందో కచ్చితమైన సమయం చెబితే, సరిగ్గా స్పందించగలమని " వారు బీబీసీతో చెప్పారు.

"మేం అంతర్జాతీయ చట్టాల ప్రకారం పనిచేస్తాం, పౌర హానిని తగ్గించడానికి జాగ్రత్తలు తీసుకుంటాం" అని కూడా వారు చెప్పారు.

‘‘గాజాలో పాలస్తీనియన్ల జననాలను నిరోధించడానికి , ఉద్దేశపూర్వకంగానే ఇజ్రాయెల్ ఐవీఎఫ్ క్లినిక్‌పై దాడి చేసి కూల్చేసిందని"... ఈ ఏడాది మార్చిలో, ఆక్రమిత పాలస్తీనా భూభాగంపై విచారణకు నియమించిన ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్ ఆరోపించింది.

సురక్షితమైన గర్భధారణ, ప్రసవం, నవజాత శిశువుల సంరక్షణకు అవసరమైన మందులు సహా ఎటువంటి సహాయం అక్కడి మహిళలకు చేరకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోందని ఆరోపించింది.

ఇజ్రాయెల్ అధికారులు "గాజాలోని పాలస్తీనియన్ల పునరుత్పత్తి సామర్థ్యాన్ని నాశనం చేశారని... ఇది జాతి విధ్వంసక చర్య" అని కమిషన్ పేర్కొంది.

అయితే "ఈ నిరాధారమైన ఆరోపణలను తిరస్కరిస్తున్నాం" అని ఇజ్రాయెల్ పర్మినెంట్ మిషన్ పేర్కొంది.

దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆగ్రహంగా స్పందించారు. నివేదిక రూపొందించిన మానవ హక్కుల మండలిని ‘యూదువ్యతిరేక, ఉగ్రవాద మద్దతుగల అసంబద్ధమైన సంస్థ’’ అని అభివర్ణించారు.

హమాస్ చేసిన యుద్ధ నేరాలపై దృష్టి పెట్టడానికి బదులుగా.. మానవ హక్కుల మండలి..ఇజ్రాయెల్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన అన్నారు.

ఐడీఎఫ్ ప్రతినిధి బీబీసీతో మాట్లాడుతూ.. "ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా సంతానోత్పత్తి క్లినిక్‌లను లక్ష్యంగా చేసుకోలేదు, గాజాలో జనన రేటును తగ్గించడానికి ప్రయత్నించడం లేదు" అని అన్నారు.

"ఐడీఎఫ్ ఉద్దేశపూర్వకంగా అటువంటి స్థలాలపై దాడి చేస్తుందనే వాదన నిరాధారమైనది, గాజాలో ఐడీఎఫ్ కార్యకలాపాల గురించి ప్రజలు అపార్థం చేసుకునేలా మానవ హక్కుల మండలి మాట్లాడుతోందని" అన్నారు.

"కళ్లముందే అంతా నాశనమైపోయింది"

గాజాలోని తొమ్మిది ఫెర్టిలిటీ క్లినిక్‌లలో కొన్ని ధ్వంసమవడంతోపాటు,మరికొన్ని నిరుపయోగంగా మారాయని డాక్టర్ ఘలాయిని చెప్పారు.

దీని వల్ల తనతోపాటు మరికొంతమందికి కూడా సంతానం కలిగే అవకాశం చాలా తక్కువగా ఉందని నౌరా చెప్పారు.

సారా ఖుదారి 2020లో సంతానోత్పత్తి చికిత్స తీసుకోవడం మొదలుపెట్టారు. సరిగ్గా అక్టోబరు 2023 అక్టోబరులో యుద్ధం మొదలయినప్పుడు పిండాన్ని ఆమె గర్భంలోకి ప్రవేశపెట్టాల్సి ఉంది. కానీ అది జరగనేలేదు..నా కళ్లముందే అంతా నాశనమైపోయింది" అని ఆమె చెప్పారు.

యుద్ధం మొదలవడానికి కొన్ని నెలల ముందు, 2023లో ఇస్లాం లుబ్బాద్ గర్భం దాల్చడానికి అల్-బస్మా క్లినిక్‌లోనే చికిత్స పొందారు. కానీ యుద్ధం మొదలైన నెల తర్వాత, ఆమె కూడా నౌరాలానే తన బిడ్డను కూడా కోల్పోయారు.

"మేం ఒక్క చోట స్థిరంగా ఉండే పరిస్థితి లేదు.ఒకచోటు నుంచి మరోచోటుకి వెళుతూనే ఉన్నాం. అప్పటికే నా శరీరం అలసిపోయింది" అని ఆమె గర్భస్రావం నాటి రోజులను గుర్తుచేసుకున్నారు.

ఇస్లాం అల్-బస్మా ఫెర్టిలిటీ సెంటర్‌లో కొన్ని పిండాలను భద్రపరిచారు . కానీ ఇప్పుడు అవి కూడా పోయాయి. ఆమె మళ్ళీ గర్భం దాల్చేందుకు చికిత్స తీసుకోవాలన్నా ఐవీఎఫ్ క్లినిక్‌లు కూడా లేవు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)