పాకిస్తాన్: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకున్న MQM-P

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందు ఎంక్యూఎం-పీ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, వరికూటి రామకృష్ణ

  1. యుక్రెయిన్: ఇప్పటివరకు ఏం జరిగింది?

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, EPA

    రష్యా, యుక్రెయిన్‌ల మధ్య జరుగుతున్న శాంతి చర్చల నుంచి ఇప్పట్లో పరిష్కారం లభించకపోవచ్చనే సంకేతాలను రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెక్సోవ్ ఇచ్చారు.

    ఇప్పటివరకు తమకు ఎలాంటి పరిష్కారమూ కనిపించలేదని మీడియాతో ఆయన చెప్పారు. అయితే, ఈ విషయంపై రష్యా తరఫున చర్చలు జరుపుతున్న ప్రతినిధులు ప్రకటన చేస్తారని అన్నారు.

    మరోవైపు రష్యా, యుక్రెయిన్‌లను విభజించే సరిహద్దుల వెంబడి ఉన్న యుక్రెయిన్‌లోని ప్రాంతాలపై రష్యా వైపు నుంచి కాల్పులు జరుగుతున్నట్లు దోన్సస్క్‌లోని యుక్రేనియన్ గవర్నర్ వెల్లడించారు.

    లూహాన్స్క్‌లో కూడా కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో 35 దాడులు జరిగాయని చెప్పారు.

    రాజధాని కీయెవ్ సిటీ సెంటర్ నుంచి కూడా బుధవారం ఉదయం కాల్పుల శబ్దాలు వినిపించాయి.

    ఇప్పటివరకు 40 లక్షల మందికిపైగా ప్రజలు యుక్రెయిన్‌ను విడిచి వెళ్లిపోయినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల సంస్థ తెలిపింది.

    యుక్రెయిన్ నుంచి బ్రిటన్‌కు వచ్చిన 2700 మంది శరణార్థులకు వీసాలు ఇచ్చినట్లు బ్రిటన్ తెలిపింది.తాజా సమాచారం కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీ చూడండి. ధన్యవాదాలు.

  2. రష్యా సైన్యం మళ్లీ దాడులకు సిద్ధమవుతోంది – యుక్రెయిన్

    "రష్యా సైన్యం మళ్లీ దాడులు చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి" అని యుక్రెయిన్ రక్షణ శాఖ ప్రతినిధి అలెగ్జాండర్ మోతుజ్యానిక్ రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.

    మరియుపూల్‌తో పాటు పొపాస్నా, లుహాన్స్క్‌లోని రుబిన్ పట్టణాలను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. రష్యన్ సేనలు ప్రధానంగా తూర్పు యుక్రెయిన్‌లో ఉన్న యుక్రెయిన్ సేనలను చుట్టుముట్టే దిశగా లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు.

    రష్యన్ సేనలు కీయెవ్, చెర్నిహియెవ్ ప్రాంతాల నుంచి దూరంగా వెళుతున్నట్లు గమనించినట్లు చెప్పారు. కానీ, దీనిని సేనలు పూర్తిగా వైదొలుగుతున్నట్లు పరిగణించలేమని యుక్రెయిన్ మిలిటరీ భావిస్తోందని మోతుజ్యానిక్ అన్నారు.

    యుక్రెయిన్ రాజధానితో పాటు, చెర్నిహియెవ్ నుంచి కూడా రష్యన్ సేనలను వెనక్కి పిలుస్తామని రష్యా మంగళవారం చెప్పింది.

  3. పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రసంగం వాయిదా

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Getty Images

    జాతిని ఉద్దేశించి పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇవ్వబోయే ప్రసంగం వాయిదా పడినట్లు ఆయన పార్టీకి చెందిన ఎంపీ ఫైజల్ జావెద్ ఖాన్ వెల్లడించారు.

    మరోవైపు పెషావర్‌లో ఓ సైన్యాధికారి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావెద్ భజ్వాను ఇమ్రాన్ ఖాన్ కలిసినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయని బీబీసీ ఉర్దూ తెలిపింది.

    మధ్యాహ్నం ఇమ్రాన్ ఖాన్ తన క్యాబినెట్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయబోరని పాక్ కేంద్ర మంత్రి షేక్ రషీద్ వ్యాఖ్యానించారు.

    మరోవైపు పాకిస్తాన్ సమాచార, ప్రసార శాఖా మంత్రి ఫవాద్ చౌధరి కూడా ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయబోరని చెప్పారు.

  4. బ్రేకింగ్ న్యూస్, షాబాజ్ షరీఫే పాకిస్తాన్ తదుపరి ప్రధాని – బిలావల్ భుట్టో

    షాబాజ్ షరీఫ్

    ఫొటో సోర్స్, Getty Images

    పాకిస్తాన్ తదుపరి ప్రధాన మంత్రిగా షాబాజ్ షరీఫ్‌ను ఎన్నుకోబోతున్నట్లు పాకిస్తాన్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో వ్యాఖ్యానించారు.

    బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భుట్టో మాట్లాడారు.‘‘ఇమ్రాన్ ఖాన్ మెజారిటీని కోల్పోయారు. ఇప్పుడు ఎంక్యూఎం-పీ కూడా మాతో కలిసింది’’ అని ఆయన చెప్పారు. తమ ప్రతిపక్ష కూటమిలోనున్న పార్టీల జాబితాను ఆయన వెల్లడించారు.

    ఈ సమావేశంలో బిలావల్ భుట్టో పక్కనే షాబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు.

    ‘‘రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్‌ను పట్టుబట్టే అధికారం షాబాజ్ షరీఫ్‌కు ఉంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌కు వేరే ప్రత్యామ్నాయం లేదు’’ అని భుట్టో అన్నారు.

    ‘‘అప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కూలదోయడానికి మేం చేతులు కలిపాం. త్వరలో పాకిస్తాన్ ప్రజలు శుభవార్త వింటారు. కరాచీ, సింధ్‌లతోపాటు పాకిస్తానీ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంక్యూఎం-పీ మాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఆయన వివరించారు.

    అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 3న ఓటింగ్ జరుగనుంది. అయితే, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నుంచి కొన్ని పార్టీలు బయటకు వచ్చేయడంతో ప్రభుత్వం రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

  5. బ్రేకింగ్ న్యూస్, పాకిస్తాన్: ఇబ్బందుల్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం.. తెగదెంపులు చేసుకున్న ఎంక్యూఎం-పీ

    ఇమ్రాన్ ఖాన్

    ఫొటో సోర్స్, Imran Khan

    పాకిస్తాన్‌లోని ముత్తహిదా ఖౌమీ మూవ్‌మెంట్ – పాకిస్తాన్ (ఎంక్యూఎం-పీ) పార్టీ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంతో తెగదెంపులు చేసుకుంది.

    అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందుగా ఎంక్యూఎం-పీ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఎదురుదెబ్బగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

    ఎంక్యూఎం-పీ కన్వీనర్ ఖాలిద్ మఖ్బూల్ సిద్దిఖీ బుధవారం పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటుచేసి వివరాలు వెల్లడించారు. ఆయన వెంట ప్రతిపక్ష నాయకులు షాబాజ్ షరీఫ్, బిలావల్ భుట్టో కూడా ఉన్నారు.

    తమ వ్యక్తిగత ప్రయోజనాల కంటే పాకిస్తాన్ ప్రయోజనాలకే తాము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతూ ఖాలిద్ వివరాలు వెల్లడించారు.

    ఇది చరిత్రాత్మక రోజని పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకుడు, పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్)కు చెందిన షాబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయక తప్పదు అని ఆయన అన్నారు. మరోవైపు బిలావల్ భుట్టో కూడా ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలని పట్టుబట్టారు.

    పాకిస్తాన్‌లో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై మార్చి 31 చర్చ జరగనుంది. ఏప్రిల్ 3న ఓటింగ్ నిర్వహిస్తారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. ఈస్టిండియా కంపెనీ సేనలపై విజయాన్ని వర్ణించే పెయింటింగ్ వేలం

    పెయింటింగ్

    ఫొటో సోర్స్, SOTHEBY'S

    భారత స్వతంత్ర పోరాటంలో ప్రసిద్ధ ఘట్టాన్ని వర్ణించే పెయింటింగ్‌ను లండన్‌లో వేలానికి పెట్టారు.

    1780లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ సేనలపై భారత పాలకులు సాధించిన విజయాన్ని వర్ణించే చిత్రాన్ని సదబీస్ సంస్థ సేల్‌కు పెట్టింది.

    వేలంపాటలో దీని ధర 370,000 పౌండ్ల (సుమారు రూ.3.7 కోట్లు) దగ్గర మొదలవుతుంది.

    పొల్లిలూర్ యుద్ధంలో మైసూర్ సుల్తాన్ హైదర్ అలీ, ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ ఈస్టిండియా కంపెనీ దళాలను మట్టికరిపించిన ఘట్టాన్ని తెలుపుతుందీ పెయింటింగ్.వివరాలు ఈ కథనంలో..

  7. ఆదిత్య పురి: ‘కస్టమర్లకు క్యాష్ బ్యాక్ ఇస్తూ పోతే... పేటీఎంకు లాభం ఎలా వస్తుంది?’

    హెచ్‌డీఎఫ్‌సీ మాజీ సీఈఓ ఆదిత్య పురి

    ఫొటో సోర్స్, Getty Images

    పేటీఎం బిజినెస్ మోడల్‌ సరైనది కాదని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాజీ సీఈఓ ఆదిత్య పురి అన్నారు.

    కస్టమర్లకు సేవలు అందించడం కన్నా వారికి క్యాష్ బ్యాక్‌లు ఇవ్వడంపైనే పేటీఎం ఎక్కువగా దృష్టిపెడుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

    భారీ సంఖ్యలో పేటీఎం ద్వారా పేమెంట్ చేస్తున్నట్లయితే మరి లాభాలు ఎందుకు రావడం లేదని ఆదిత్య పురి ప్రశ్నించారు.

    ముంబయి యూనివర్సిటీలో జరిగిన ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ‘కస్టమర్లకు పేమెంట్స్ చేస్తూ పోతే... పేటీఎంకు లాభాలు ఎలా వస్తాయని?’ అన్నారు.

    ‘బ్యాంకులు కస్టమర్లకు సేవలు అందించడం ద్వారా ఆదాయాన్ని సంపాదించి లాభాలు గడిస్తాయి. కానీ పేటీఎం ఇందుకు భిన్నంగా లక్షలాది కస్టమర్లకు క్యాష్ బ్యాక్‌లు ఇస్తోంది.’ అని ఆదిత్య పురి చెప్పుకొచ్చారు.

    స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన నాటి నుంచి నేటి వరకు పేటీఎం షేరు ధర సుమారు 65శాతం పడిపోయింది.

    పేటీఎం పేరెంట్ కంపెనీ ఒన్97కమ్యూనికేషన్స్ పోయిన ఏడాది నవంబరులో ఐపీఓకు వచ్చింది. రూ.2,080-2,150 మధ్య ధరను నిర్ణయించారు.

    కానీ పేటీఎం ఐపీఓకు పెద్దగా స్పందన రాలేదు. నవంబరు 18న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదు అయినప్పుడు పేటీఎం షేరు ధర 9.3శాతం నష్టపోయింది. అంటే ఎన్‌ఎస్‌ఈలో రూ.1,950 వద్ద లిస్ట్ అయింది.

    ఇక నాటి నుంచి ఈ నాలుగు నెలల్లో పేటీఎం 65శాతం నష్టపోయింది. నేడు పేటీఎం షేరు ధర 2.69శాతం పెరిగి రూ.539 వద్ద ముగిసింది.

  8. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటిని చుట్టుముట్టిన బీజేపీ కార్యకర్తలు

    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం

    ఫొటో సోర్స్, Twitter/Sanjay Singh AAP

    ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నివాసాన్ని చుట్టుముట్టేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు.

    వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నివాసం ముందు ఉండే బారికేడ్లను వారు ధ్వంసం చేశారు.

    ‘ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించలేని భారతీయ జనతా పార్టీ, ఆయనను చంపాలని కుట్ర చేస్తోంద’ని ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోదియా ఆరోపించారు.

    ‘బీజేపీ గూండాలకు పోలీసులే సహకరించార’ని సిసోదియా విమర్శించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. ఏప్రిల్ 4న ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి

    ఫొటో సోర్స్, Facebook/YSRCP

    ఏప్రిల్ 4న ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు.

    కొత్త జిల్లాలకు సంబంధించి ప్రజల నుంచి 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని అధికారులు తెలిపారు. అందుకు అనుగుణంగా చేయాల్సిన మార్పులు, చేర్పులు చేశామని వెల్లడించారు.

    సిబ్బంది విభజన, పోస్టింగుల్లో సిక్స్ పాయింట్ ఫార్ములా, రాష్ట్రపతి ఉత్తర్వులు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొన్నట్లు అధికారులు వివరించారు.

  10. కశ్మీర్ పండిత్ హత్య కేసును మళ్లీ తెరచిన శ్రీనగర్ కోర్టు

    ఆందోళన చేస్తున్న కశ్మీరీ పండితులు

    ఫొటో సోర్స్, Getty Images

    కశ్మీర్ పండిత్ అయిన సతీశ్ టిక్కూ హత్య కేసుకు సంబంధించి 31 ఏళ్ల తరువాత మళ్లీ శ్రీనగర్ సెషన్ కోర్టు విచారణ ప్రారంభించింది.

    సతీశ్ టిక్కూ కుటుంబ సభ్యులు వేసిన పిటీషన్‌ను ఈమేరకు కోర్టు స్వీకరించింది.

    అలాగే ఈ హత్యకేసులో నిందితుడైన బిట్టా కరాటే మీద నమోదైన ఎఫ్‌ఐఆర్ మీద కూడా కోర్టు నివేదిక కోరింది.

    ఇంతవరకు బిట్టా కరాటే మీద ఎందుకు చార్జ్ షీట్ దాఖలు చేయలేదంటూ జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని కోర్టు అడిగినట్లు సతీశ్ టిక్కూ కుటుంబ న్యాయవాది ఉత్సవ్ బయాన్స్ తెలిపారు.

    ఫరూక్ అహ్మద్ దర్ అలియాస్ బిట్టా కరాటే చాలా మంది కశ్మీరీ పండితులను చంపినట్లు ఆరోపణలున్నాయి. బాలీవుడ్ చిత్రం ‘కశ్మీరీ ఫైల్స్’ విడుదల అయిన తరువాత బిట్టా కరాటే మీద చర్చ మళ్లీ మొదలైంది.

    గతంలో చాలా సార్లు బిట్టా కరాటే అరెస్ట్ అయినా, సరైన సాక్ష్యాలు లేవనే కారణంతో ప్రతిసారి విడుదల అవుతూ వచ్చాడు.

    గతంలో ఒక ఇంటర్వ్యూలో సతీశ్ టిక్కూను చంపినట్లు బిట్టా కరాటే ఒప్పుకున్నాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. బ్రేకింగ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీల పెంపు

    ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ చార్జీలు పెరిగాయి. శ్లాబుల ఆధారంగా 45 పైసల నుంచి రూ.1.57 వరకు పెంచారు. ఈమేరకు కొత్త ధరలను ఏపీఈఆర్సీ ఆమోదించింది. త్వరలోనే ఈ ధరలు అమల్లోకి రానున్నాయి.

    కొత్త టారిఫ్స్ ఇలా...

    0-30 శ్లాబులో యూనిట్ ధర రూ.1.45 నుంచి రూ.1.90కి పెరిగింది.

    31-75 కేటగిరిలో యూనిట్ ధర రూ.2.09 నుంచి రూ.3.00కు పెరిగింది.

    76-125 కేటగిరిలో యూనిట్ ధర రూ.3.10 నుంచి రూ.4.50కు చేరింది.

    126-225 కేటగిరిలో యూనిట్ ధర రూ.4.43 నుంచి రూ.6.00కు పెరిగింది.

    226-400 విభాగంలో యూనిట్ ధర రూ.7.59 నుంచి రూ.8.75కు చేరింది.

    400 యూనిట్లకు పైన చార్జీలను రూ.9.20 నుంచి రూ.9.75కు పెంచారు.

  12. బ్రిటన్ రక్షణశాఖ: ‘బలం పుంజుకునేందుకు బెలారుస్ మళ్లుతున్న రష్యా సైన్యం’

    యుక్రెయిన్ మీద దాడుల్లో బాగా నష్టపోయిన రష్యా బలగాలు సాయం కోసం బెలారుస్ వెళ్తున్నట్లు బ్రిటన్ రక్షణశాఖ వెల్లడించింది.

    బాగా నష్టపోయిన రష్యా సైన్యం తిరిగి బలాన్ని పుంజుకునేందుకు రష్యా, బెలారుస్ వైపు మళ్లుతున్నాయని తెలిపింది.

  13. ఆస్ట్రేలియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్న జెలియెన్‌స్కీ

    యుక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, Getty Images

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ, నేడు ఆస్ట్రేలియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

    రష్యా దాడులను యుక్రెయిన్ బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని, ఆస్ట్రేలియా ఎంప్లాయిమెంట్ మినిస్టర్ స్టూవర్ట్ రాబర్ట్ తెలిపారు.

    సుమారు 65 మిలియన్ డాలర్ల విలువైన మానవీయ సాయాన్ని యుక్రెయిన్‌కు అందించిది ఆస్ట్రేలియా. 91 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధసంపత్తిని కూడా ఇస్తామని హామీ ఇచ్చింది.

  14. వంద శాతం విద్యుదీకరణ సాధించిన కొంకణ్ రైల్వేకు ప్రధాని ప్రశంసలు

    కొంకణ్ రైల్వే లైన్

    ఫొటో సోర్స్, ANI

    వందశాతం విద్యుదీకరణ సాధించినందుకు కొంకణ్ రైల్వేను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

    పర్యావరణ పరిరక్షణలో సరికొత్త ప్రమాణాలను నెలకొలిపారంటూ ప్రశంసించారు.

    సుమారు రూ.1,287 కోట్లతో 741 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను పూర్తిగా విద్యుదీకరించారు. దేశంలోని బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్ మొత్తాన్ని పూర్తిగా విద్యుదీకరించాలని ఇండియన్ రైల్వేస్ భావిస్తోంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. జెలియెన్‌స్కీ: ‘యుక్రెయిన్ ప్రజలు పిచ్చోళ్లు కాదు’

    యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ

    ఫొటో సోర్స్, EPA

    కీయెవ్, చెర్నిహివ్ నగరాల నుంచి తమ బలగాలను వెనక్కి మళ్లిస్తామని రష్యా చేసిన ప్రకటన మీద యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియన్‌స్కీ స్పందించారు.

    యుక్రెయిన్ ప్రజలు, రష్యా మాటలను నమ్మేంత పిచ్చోళ్లు కాదని ఆయన అన్నారు.

    టర్కీలో జరుగుతున్న శాంతి చర్చల్లో భాగంగా కీయెవ్, చెర్నిహివ్‌లలో దాడులు ఆపుతామని రష్యా హామీ ఇచ్చింది.

    రష్యా చెప్పింది చేసే వరకు తాను వారి మాటలు నమ్మనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

  16. బ్రేకింగ్ న్యూస్, రష్యా నుంచి వెంటనే వెళ్లిపోండి... తమ పౌరులను హెచ్చరించిన అమెరికా

    వెంటనే రష్యాను వీడి వెళ్లిపోవాలని తమ పౌరులను అమెరికా హెచ్చరించింది. రష్యాలోని అమెరికన్లను వెతికి పట్టుకొని నిర్బంధించే అవకాశం ఉందని, వేధింపులకు గురి చేస్తారని సూచించింది.

    రష్యాను వదలి వెళ్లాలనుకునే వాళ్లు సొంతంగానే ప్రయాణ ఏర్పాటు చేసుకోవాలని అమెరికా జారీ చేసిన ప్రకటన పేర్కొంది.

  17. యుక్రెయిన్: శాంతి చర్చలు నడుస్తున్నా రష్యా దాడులు కొనసాగుతున్నాయ్

    ఒకవైపు శాంతి చర్చలు నడుస్తుంటే మరొకవైపు యుక్రెయిన్ మీద రష్యా దాడులు జరుగుతూనే ఉన్నాయి.

    దక్షిణ యుక్రెయిన్‌లోని మైకొలయివ్‌లో గల పాలనా భవనాల మీద రష్యా మిసైల్స్ దాడి చేసిన దృశ్యాలు నిఘా కెమెరాలకు చిక్కాయి.

    ఈ దాడుల్లో సుమారు ఏడుగురు చనిపోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

  18. ఇజ్రాయెల్: కాల్పుల్లో అయిదుగురు మృతి

    ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో దాడి జరిగిన ప్రాంతం

    ఫొటో సోర్స్, Reuters

    ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ శివార్లలో ఒక సాయుధుడు జరిపిన కాల్పుల్లో అయిదుగురు మరణించారు.

    ఆర్థోడాక్స్ యూదులు ఎక్కువగా ఉండే బెనీ బ్రాక్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

    పోలీసుల కాల్పుల్లో సాయుధుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ రైఫిల్‌తో వచ్చిన ఒక ఆగంతకుడు దారిపోయే వారి మీద కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.

    ఒక వారం వ్యవధిలో జరిగిన దాడుల్లో ఇది మూడోది అని అధికారులు తెలిపారు. మంగళవారం, ఆదివారం ఇజ్రాయెల్ అరబ్‌లు దాడులు చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.

  19. ‘మమ్మల్ని గందరగోళ పరచడానికే రష్యా ఎత్తుగడలు’

    యుక్రెయిన్ సైనికులు

    ఫొటో సోర్స్, Getty Images

    సైన్యాన్ని వెనక్కి తరలిస్తామన్న మాటలు తమను తప్పుదారి పట్టించడానికి రష్యా వేస్తున్న ఎత్తుల్లో భాగమని యుక్రెయిన్ సైన్యం తెలిపింది.

    కీయెవ్, చెర్నిహివ్ నుంచి తన బలగాలను రష్యా వెనక్కి తరలిస్తోందని తెలిపిన సైన్యం, రష్యా ఎత్తుగడలు తమను గందరగోళ పరచడానికేనని వెల్లడించింది.

    రష్యా బలగాలు దూరంగా పోతున్నప్పటికీ కీయెవ్‌కు ఇంకా ప్రమాదం పొంచే ఉందని అమెరికా రక్షణశాఖ అధికారప్రతినిధి జాన్ కిర్బీ అన్నారు.

  20. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    హోల్ ఆల్, గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.