జైర్ బోల్సోనారో: కరోనా అరికట్టడంలో విఫలమయ్యారంటూ దేశాధ్య‌క్షుడిపై క్రిమినల్‌ కేసు నమోదుకు బ్రెజిలియన్ సెనేటర్ల సిఫార్సు - BBC Newsreel

కోవిడ్ మహమ్మారిని అరికట్టడంలో విఫలమయ్యారంటూ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోపై క్రిమినల్‌ అభియోగాలు మోపాలని బ్రెజిలియన్ సెనేటర్లు ఓటు వేశారు.

కరోనా వైరస్‌తో దాదాపు ఆరు లక్షల మంది మరణించిన నేపథ్యంలో మహమ్మారి కట్టడిలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై బ్రెజిల్‌ సెనేట్‌ కమిటీ ఆరునెలలుగా విచారణ జరిపింది. ఈ క్ర‌మంలోనే అధ్యక్షుడిపై క్రిమినల్‌ అభియోగాలు మోపాలని కమిటీ సిఫార్సు చేసింది. ఇందులో మానవ జాతిపై బోల్సోనారో నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ నివేదికను బోల్సోనారో నియమించిన చీఫ్ ప్రాసిక్యూటర్‌కు సెనేట్ ప్యానెల్ సభ్యులు అందజేశారు.

"కచ్చితంగా నేను ఏ నేరాన్ని చేయలేదు" అని అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పేర్కొన్నారు. కానీ కరోనా సంక్షోభం ఆయన ప్రజాదరణను దెబ్బతీసింది.

అమెరికా తర్వాత, కోవిడ్ మరణాలలో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. 20.8 కోట్ల జనాభా ఉన్న బ్రెజిల్‌లో కనీసం 6,06,000 కరోనా మరణాలు, 2.17 కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయని జాన్ హాప్‌కిన్స్ విశ్వవిద్యాలయం నివేదించింది.

ఈ నివేదిక సిఫార్సులను తొలుత ప్రాసిక్యూటర్-జనరల్ అగస్టో అరస్ అధ్యయనం చేయాలి. ఆయన ఖచ్చితంగా అధ్యక్షుడిని కాపాడతారని భావిస్తున్నారు.

హెర్డ్ ఇమ్యూనిటీని సాధిస్తామనే ఆశతో కరోనా వైరస్ వ్యాప్తిని పెంచే విధానాన్ని బోల్సోనారో ప్రభుత్వం అనుసరించిందని నివేదిక ఆరోపించింది.

''కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం చేసిన తప్పులకు బాధ్యత వహించే ప్రధాన వ్యక్తి అధ్యక్షుడు'' అని ఈ నివేదిక పేర్కొంది.

నిధుల దుర్వినియోగంతో పాటూ కరోనా వ్యాప్తిపై అధ్యక్షుడు తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

అధ్యక్షుడు బోల్సోనారో మానవజాతికి వ్యతిరేకంగా చేసిన నేరాలపై ప్యానెల్ సిఫార్సులను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)కి సమర్పించాలని నివేదిక ప్రధాన రచయిత అయిన సెనేటర్ రెనాన్ కాల్హీరోస్ పిలుపునిచ్చారు.

"ఇది పూర్తిగా రాజకీయ నివేదిక, ఎటువంటి చట్టపరమైన ఆధారం లేకుండా ఉంది" అని అధ్యక్షుడు బోల్సోనారో కుమారుడు ఫ్లావియో బోల్సోనారో అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)