టీ20 వరల్డ్ కప్ సూపర్ 12: బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో శ్రీలంక విజయం

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మూడో మ్యాచ్‌లో శ్రీలంక బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

5 సిక్సర్లు, 5 ఫోర్లతో చెలరేగిపోయిన చరిత్ అసలంక 80 పరుగులు చేయడంతో ఇంకా 7 బంతులు మిగిలుండగానే శ్రీలంక 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భానుక రాజపక్ష 53, పథుమ్ నిసంక 24 పరుగులు చేశారు.

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 12 మూడో మ్యాచ్‌లో ఆదివారం (అక్టోబర్ 24) శ్రీలంక-బంగ్లాదేశ్ తలపడ్డాయి.

టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్ ఓపెనర్లు జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. మొహమ్మద్ నయీమ్, లిటన్ దాస్ 40 పరుగుల భాగస్వామ్యం అందించారు. జట్టు స్కోర్ 40 దగ్గర లిటన్ దాస్(16) మొదటి వికెట్‌గా అవుట్ అయ్యాడు.

తర్వాత వచ్చిన షాకిబ్ అల్ హసన్(10) జట్టు స్కోర్ 56 పరుగుల దగ్గర అవుటవడంతో మొహమ్మద్ నయీమ్ ముష్ఫికర్ రహీమ్‌తో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు.

14వ ఓవర్లో ఫోర్ కొట్టిన నయీమ్ తన అర్థ సెంచరీ పూర్తి చేసుకోవడంతోపాటూ జట్టును వంద పరుగులు కూడా దాటించాడు.

129 స్కోర్ దగ్గర బంగ్లాదేశ్ మూడో వికెట్ పడింది. ముష్ఫికర్ రహీమ్‌తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం అందించిన మొహమ్మద్ నయీమ్ చివరికి బినూరా ఫెర్నాండో బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చాడు.

మొహమ్మద్ నయీమ్ 52 బంతుల్లో 6 ఫోర్లతో 62 పరుగులు చేశాడు.

ఆ తర్వాత ముష్ఫికర్ రహీమ్ కూడా 32 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 150 దగ్గర బంగ్లాదేశ్ 4వ వికెట్ పడింది. అఫీఫ్ హుస్సేన్(7) రనౌట్ అయ్యాడు.

తర్వాత ముష్ఫికర్ రహీమ్, కెప్టెన్ మహ్మదుల్లా మరో వికెట్ పడకుండా జట్టు స్కోరును 171 వరకూ తీసుకెళ్లారు.

ముష్ఫికర్ రహీమ్ 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 37 బంతుల్లో 57 పరుగులు చేశాడు. మహ్మదుల్లా 10 పరుగులు చేశాడు.

బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్లను అవుట్ చేయడానికి శ్రీలంక బౌలర్లు నానా తంటాలూ పడ్డారు. కెప్టెన్ డసున్ శంకర ఏకంగా ఏడుగురితో బౌలింగ్ చేయించాడు.

చమిర కరుణరత్నె, బినుర ఫెర్నాండో, లహిరు కుమారలకు తలో వికెట్ పడగొట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)