ఓవల్ టెస్టులో ఇంగ్లండ్‌పై 157 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టును 157 పరుగుల తేడాతో ఓడించింది.

ఒకానొక దశలో 141 పరుగులకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ జట్టు 210 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత బౌలర్లు బ్యాట్స్‌మెన్లకు స్వర్గధామంలా కనిపించిన పిచ్‌పై ఇంగ్లండ్ టీమ్ భరతం పట్టారు.

చివరి మూడు వికెట్లు ఉమేష్ యాదవ్ పడగొట్టగా, బుమ్రా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీశారు.

ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. చివరి మ్యాచ్ సెప్టెంబర్ 10 నుంచి మాంచెస్టర్‌లో జరగనుంది.

భారత్ ఓవల్ టెస్ట్‌లో విజయం కోసం ఇంగ్లండ్ ఎదుట 368 పరుగుల లక్ష్యం ఉంచింది. కానీ ఇంగ్లండ్ టీమ్ 210 పరుగులే చేయగలిగింది.

మొదటి ఇన్నింగ్స్‌లో 99 పరుగుల ఆధిక్యం సాధించిన ఇంగ్లండ్ ఓపెనర్లు, రెండో ఇన్నింగ్స్‌లో కూడా మంచి ప్రారంభం ఇచ్చారు.

రోరీ బర్న్స్, హసీబ్ హమీద్ మొదటి వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యం అందించారు. వీటిలో 77 పరుగులు నాలుగో రోజే వచ్చాయి.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు మొదటి వికెట్ శార్దూల్ ఠాకూర్ అందించాడు. బర్న్స్ ను 50 పరుగుల దగ్గర అవుట్ చేశాడు. మూడో స్థానంలో వచ్చిన మలాన్ కేవలం ఐదు పరుగులే చేసి రనవుట్ అయ్యాడు. కానీ లంచ్ వరకూ రెండు టీములూ సమానంగా కనిపించాయి. లంచ్ సమయంలో ఇంగ్లండ్ స్కోర్ 2 వికెట్లకు 131.

సెకండ్ సెషన్‌లో అద్భుతం

భారత బౌలర్లు లంచ్, టీ బ్రేక్ మధ్య అంటే చివరి రోజు రెండో సెషన్‌లో మ్యాచ్ గతినే మార్చేశారు. భారత్ ఈ సెషన్‌లో మొత్తం ఆరు వికెట్లు పడగొట్టింది. రవీంద్ర జడేజా వికెట్ తీయడంతో ఈ వికెట్ల వరద మొదలయ్యింది. అతడు ఓపెనర్ హమీద్‌ను బోల్డ్ చేశాడు. హమీద్ 63 పరుగులు చేశాడు.

ఓలీ పోప్‌‌ను అవుట్ చేసిన బుమ్రా ఇంగ్లండ్‌కు మరో షాక్ ఇచ్చాడు. ఈ వికెట్‌తో టెస్ట్ క్రికెట్‌లో బుమ్రాకు వంద వికెట్లు పూర్తయ్యాయి. 24వ టెస్టులో వంద వికెట్లు పూర్తి చేసిన బుమ్రా కొత్త భారత రికార్డ్ సెట్ చేశారు. భారత ఫాస్ట్ బౌలర్లలో అతడు అతి తక్కువ మ్యాచుల్లో వంద వికెట్లు పూర్తి చేసిన బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా కంటే ముందు కపిల్ దేవ్ 25 టెస్ట్ మ్యాచుల్లో వంద వికెట్లు పూర్తి చేశారు.

జానీ బెయిర్ స్టోను ఖాతా తెరవకుండానే అవుట్ చేసిన బుమ్రా తన వంద వికెట్ల రికార్డుకు సంబరాలు జరుపుకున్నాడు.

ఇంగ్లండ్ ఆరోవికెట్ రవీంద్ర జడేజా పడగొట్టాడు. మొయిన్ అలీని సున్నా పరుగులకే పెవిలియన్ పంపించాడు.

ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు ఒత్తిడిలో పడిపోయింది. ఆ పరిస్థితిని చక్కగా ఉపయోగించుకున్న శార్దూల్ ఠాకూర్ కెప్టెన్ జో రూట్‌ను అవుట్ చేశాడు. రూట్ 36 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ ఉమేష్ యాదవ్ పడగొట్టాడు.

అతడు సరిగ్గా టీ బ్రేక్ ముందు క్రిస్ వోక్స్‌ను అవుట్ చేశాడు. 9, 10 వికెట్లు కూడా ఉమేష్ యాదవ్‌కే దక్కాయి.

పుంజుకున్న భారత్

భారత్ అద్భుతంగా పుంజుకున్న ఓవల్ టెస్టు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్‍ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

భారత బ్యాట్స్‌మెన్లు తొలి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యారు. 191 పరుగులకు ఆలౌట్ అయ్యారు.

కానీ, రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్న భారత బ్యాట్స్‌మెన్ 466 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 127, శార్దూల్ ఠాకూర్ 60 పరుగులు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)