గొర్రెలతో ‘గుండె’ బొమ్మ గీసి ఆంటీపై ప్రేమను చాటుకున్న రైతు - వీడియో

వీడియో క్యాప్షన్, గొర్రెలతో ‘గుండె’ బొమ్మ గీసి ఆంటీపై ప్రేమను చాటుకున్న ఇచ్చిన రైతు

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఎంతో మంది తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు దూరంగా గడపాల్సి వచ్చింది. మరెంతో మంది తమవాళ్ల అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేకపోయారు.

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌కు చెందిన రైతు బెన్ జాక్సన్‌ కూడా.. తన ఆంటీకి తుది వీడ్కోలు చెప్పలేకపోయారు.

క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన డెబ్బీ గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు.

బ్రిస్బేన్‌లో జరిగిన ఆమె అంత్యక్రియల్లో పాల్గొనాలంటే బెన్ జాక్సన్.. తాను ఉండే ప్రాంతం నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కానీ, కరోనా లాక్‌డౌన్ వల్ల ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో వెళ్లలేకపోయారు.

దీంతో ఆంటీపై తనకు ఉన్న ప్రేమకు ఇలా వీడియో రూపం ఇచ్చారు.

ఒక పొలంలో హృదయం ఆకారాన్ని గీసి, ఆ ఆకారంలో ఆహారం వేసి.. గొర్రెలను వదిలారు.

పలుమార్లు ప్రయత్నించిన తర్వాత గొర్రెలు ఇలా హృదయాకారంలోకి వెళ్లాయి.

దీన్నంతా డ్రోన్ సహాయంతో చిత్రీకరించారు. తన ఆంటీకి ఇష్టమైన పాటను జతచేసి, సోషల్ మీడియాలో పెట్టారు. దీనిని చాలామంది మెచ్చుకున్నారు.

''నేను ఆమె అంత్యక్రియలకు వెళ్లలేకపోయాను. దీంతో ఏం చేయాలో నాకు తెలియలేదు. అందుకే ఈ వీడియో రూపొందించాను'' అని జాక్సన్ చెప్పారు.

సోమవారం తన ఆంటీ అంత్యక్రియలకు ముందు ఈ వీడియోను తన బంధువులతో షేర్ చేసుకున్నారు.

ఇప్పుడు ఈ వీడియోను ఆస్ట్రేలియా టీవీ చానెళ్లు కూడా ప్రసారం చేశాయి.

అందరితో కలసి ఉండేందుకు, ఇతరులతో పంచుకునేందుకు ఆమె ఎంతో ఇష్టపడేవారని జాక్సన్ చెప్పారు. ఎంతో మంది ఈ వీడియోను చూసి సంతోషిస్తున్నారని, తన ఆంటీ కూడా ఈ వీడియోను చూస్తే సంతోషించేవారని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)