Fact Check: కుంభమేళా జరిగే ప్రాంతం ఇదేనా?

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఈ ఫోటో చక్కర్లు కొడుతోంది. ఇది ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా జరిగే ప్రాంతమంటూ క్యాప్షన్లు పెట్టి షేర్ చేస్తున్నారు.

"కుంభ మేళా కోసం ఆ ప్రాంతాన్ని యోగి ఆదిత్యనాథ్ ‌నేతృత్వంలోని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిందో చూడండి" అంటున్నారు.

అయితే, ఆ ఫొటో కుంభ మేళా ఏర్పాట్లకు సంబంధించింది కాదని... అది సౌదీ అరేబియాలో తీసిస ఫొటో అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

అప్పటికీ ఆ ఫొటోను షేర్ చేసినవారు వెనక్కి తగ్గలేదు. "అది సౌదీ అరేబియాకు చెందింది కాదు, కుంభమేళా కోసం జరుగుతున్న ఏర్పాట్లే’’ అంటూ బలంగా వాదించారు.

మరి ఏ వాదనలో నిజముంది?

ఇటీవల బీబీసీ జరిపిన పరిశీలనలో 'కుంభ మేళా' పేరుతో షేర్ అవుతున్న ఆ ఫొటో నకిలీదని తేలింది.

అది సౌదీ అరేబియాలోని హజ్ (మక్కా మదీనా)లో యాత్రికుల కోసం గుడారాలు ఏర్పాటు చేసిన ప్రాంతం.

ఈ ఫొటోలో ఉన్న ప్రాంతాన్ని 'మీనా వాలే' అని 'టెంట్ సిటీ' అని పిలుస్తారు.

కింగ్ ఖాలిద్ వంతెన పరిసర ప్రాంతాల్లో పది వేలకు పైగా గుడారాలు ఏర్పాటు చేశారు.

ఈ ఫొటోను 2018 ఆగస్టులో సౌదీ అరేబియాకు చెందిన న్యూస్ వెబ్‌సైట్లు తమ కథనాల్లో పోస్ట్ చేశాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన తూర్పు మెడిటేరియన్ ప్రాంతీయ కార్యాలయం అధికారిక ట్విటర్ హాండిల్ కూడా ఆ ఫొటోను 2018 ఆగస్టు 21న షేర్ చేసింది.

"ఇది ప్రపంచంలోనే అదిపెద్ద క్యాంపు సిటీ. యాత్రికులకు సౌకర్యవంతంగా ఉంది. వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి" అని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)