అమెరికాలోని బోస్టన్‌లో గ్యాస్ పేలుళ్లు, 39 ఇళ్లు దగ్ధం

మసాచుసెట్స్‌లోని బోస్టన్‌కు సమీపంలోని మూడు పట్టణాల్లో దాదాపు 43 కిలోమీటర్ల వరకూ సంభవించిన వరుస పేలుళ్లలో 39 భవనాలు దగ్ధమయ్యాయి. వీటిని గ్యాస్ పేలుళ్లుగా అనుమానిస్తున్నారు.

లారెన్స్, అండోవర్, ఉత్తర అండోవర్‌లో ఈ పేలుళ్లు సంభవించాయి. ఈ పట్టణాలన్నీ బోస్టన్‌కు 43 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

పేలుళ్ల ఘటనలో చాలా మంది గాయపడ్డారని, కొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయని స్థానిక మీడియా పేర్కొంది. మిగతా భవనాల్లో వారిని కూడా ఖాళీ చేయించినట్టు పేర్కొంది. పోలీసులు వారందరినీ స్థానిక స్కూళ్లకు తరలిస్తున్నారు.

గ్యాస్ ఒత్తిడే కారణమా?

కొలంబియా గ్యాస్ లైన్లలో ఒత్తిడి వల్లే పేలుళ్లు జరిగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో గ్యాస్, విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కానీ, ఇప్పటివరకూ ఇవి గ్యాస్ పేలుళ్లే అని ఎవరూ ధ్రువీకరించలేదు.

దాదాపు 70 ప్రాంతాల్లో గ్యాస్ లీక్, మంటలు, పేలుళ్లు సంభవించాయని రాష్ట్ర పోలీసులు ట్వీట్ చేశారు. గ్యాస్ లైన్లలో ఒత్తిడి తగ్గిస్తున్నామని, కానీ దానికి సమయం పడుతుందని అంటున్నారు. ఎవరికైనా ఇంట్లో గ్యాస్ వాసన వస్తే, వెంటనే ఖాళీ చేయాలని సూచించారు.

పేలుళ్ల తర్వాత వచ్చిన మంటలు, పొగలతో ఆకాశం కూడా కనిపిచలేదని సహాయక కార్యక్రామాల్లో పాల్గొన్న ఒక పోలీస్ తెలిపారు.

కొలంబియా గ్యాస్ కనెక్షన్లు లేకున్నప్పటికీ, ఇళ్లు ఖాళీ చేయాలని, విద్యుత్ ఆపేయాలని లారెన్స్ మేయర్ పట్టణ ప్రజలను కోరారు.

అగ్నిమాపక అధికారులు ఈ పేలుళ్లను సామూహిక ప్రమాద ఘటనగా చెప్పారని 'ద సన్' తెలిపింది. ఎంతమంది గాయపడి ఉంటారనేది మాత్రం ఎవరూ చెప్పడంలేదు.

పేలుళ్ల ఘటనపై స్థానిక అధికారులతో మాట్లాడుతున్నామని మసాచుసెట్స్ గవర్నర్ చార్లీ బాకెర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎఫ్‌బీఐ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)