You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'పిల్లల్ని కనని మహిళలు ప్రభుత్వానికి భారం': జపాన్ ఎంపీ
జపాన్లో అధికార పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడొకరు మహిళల విషయంలో చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆయన వ్యాఖ్యలు లైంగిక వేధింపుల లాంటివేనని మహిళా ఎంపీలు విమర్శించారు.
వివాదం నేపథ్యంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) ఎంపీ కాంజీ కాతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ఇంతకూ కాంజీ కాతో చేసిన వ్యాఖ్య ఏంటంటే - జపాన్లోని మహిళలంతా ఎక్కువ మంది పిల్లలను కనాలి. లేదంటే వారిని ప్రభుత్వానికి భారంగానే చూడాల్సి ఉంటుంది.
మే 10న హొసోడాలో జరిగిన తమ పార్టీ సమావేశంలో ప్రసంగిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
తానెప్పుడు వివాహ వేడుకల్లో ప్రసంగాలు చేసినా, కనీసం ముగ్గురు పిల్లలలైనా కనాలని వధూవరులకు చెబుతుంటానని కాతో అన్నారు.
"దంపతులు అన్నప్పుడు ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలను కనాల్సిందే. వారెలాంటి పని చేసేవారైనా సరే" అన్న కాంతో వ్యాఖ్యలు వివాదానికి తెరలేపాయి.
ప్రజలు చెల్లించే పన్నులతో నడిచే ఆసుపత్రుల్లో పిల్లలను కనని మహిళలు వైద్య చికిత్స పొందడం అన్యాయం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 72 ఏళ్ల కాతో స్వయంగా ఏడుగురు పిల్లల తండ్రి.
ఆయన ప్రసంగాన్ని చాలా మంది మహిళా పార్లమెంటేరియన్లు తప్పు పట్టారు. ఈ వ్యాఖ్యలు "లైంగిక వేధింపులతో సమానం" అంటూ ఒక మహిళా ఎంపీ విమర్శించినట్టు ఒక పత్రిక రాసింది.
మొదట కాతో తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవడానికి నిరాకరించారు. కానీ ఆ తర్వాత, "ఒకవేళ నా మాటలకు పొరపాటుగా అర్థం వస్తున్నట్టయితే నేను క్షమాపణలు కోరుకుంటున్నా" అంటూ వివరణ ఇచ్చారు.
జపాన్లో గత సంవత్సరం 9.41 లక్షల మంది పిల్లలు జన్మించారు. జపాన్ జనాభాలో పిల్లల శాతం గత వందేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయింది.
పెద్ద కుటుంబాలకు ఆర్థిక మద్దతు, ఇతర ప్రయోజనాలు కల్పించే పథకాలు చేపడుతున్నప్పటికీ దాని ప్రభావం పెద్దగా కనిపించడం లేదు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)