You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉత్తర కొరియా: రైలులో కిమ్ చైనా యాత్ర... జిన్పింగ్తో భేటీ
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చైనా పర్యటన నిజమేనని చైనా అధికారిక మీడియా సంస్థ ధృవీకరించింది. ప్రత్యేక రైలులో కిమ్ చైనాలో అడుగుపెట్టారని జిన్హువా వెల్లడించింది.
"ఉన్నత స్థాయి వ్యక్తి ఒకరు ప్రత్యేక రైలులో చైనా వచ్చారు" అంటూ వారం రోజులుగా మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఆ ప్రత్యేక వ్యక్తి కిమ్ అంటూ జపాన్ మీడియా తొలిసారి వెల్లడించింది.
కిమ్ 2011లో ఉత్తర కొరియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే.
జిన్హువా వార్తా సంస్థ కథనం ప్రకారం.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆహ్వానం మేరకు కిమ్ మార్చి 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ ‘అనధికారిక పర్యటన’కు వచ్చారు.
కిమ్తో పాటు ఆయన భార్య లి షూ, కొరియన్ వర్కర్స్ పార్టీ కేంద్ర కమిటీ వైస్ చైర్మన్ చోయిలతో పాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కిమ్ సమావేశమయ్యారని, వీరి మధ్య చర్చలు అర్థవంతంగా జరిగాయని జిన్హువా పేర్కొంది.
దక్షిణ కొరియా, అమెరికాలతో చర్చలకు తాము సిద్ధమని కిమ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
కిమ్తో సమావేశం కావడానికి తాను సిద్ధంగానే ఉన్నానని గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
ఉత్తర కొరియాకు చైనా ప్రధాన ఆర్థిక భాగస్వామి. అందువల్ల ట్రంప్తో సమావేశానికి ముందుగా కచ్చితంగా కిమ్ చైనా నాయకత్వంతో సమావేశం జరుపుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు.
అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా కట్టుబడి ఉందని జిన్పింగ్తో సమావేశంలో కిమ్ వెల్లడించినట్లు జిన్హువా పేర్కొంది.
ఈ పర్యటన చైనా - ఉత్తర కొరియాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే చర్యగా ఉత్తర కొరియా న్యూస్ ఏజెన్సీ కేసీఎన్ఏ వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)