You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
థాయ్లాండ్: మోసగాడికి 6,637 సంవత్సరాల జైలు శిక్ష
థాయ్లాండ్లోని ఒక న్యాయస్థానం ఓ మోసగాడికి 13 వేల ఏళ్లకు పైగా కారాగారవాసాన్ని శిక్షగా విధించింది. ఆయన నేరాన్ని ఒప్పుకోవడంతో దీనిని 6,637 సంవత్సరాల ఆరు నెలలకు కుదించింది.
అయితే ఆయన 20 ఏళ్లకు మించి జైలు శిక్షను అనుభవించే పరిస్థితి ఉండకపోవచ్చు.
థాయ్లాండ్ చట్టం ప్రకారం- ఆయనపై నేర నిర్ధరణ జరిగిన రెండు కేసుల్లో ఒక్కోదానికి గరిష్ఠంగా పదేళ్ల శిక్ష ఉంది.
దోషి పుడిట్ కిట్టిత్రదిలోక్కు 34 ఏళ్లు.
ఆయన దాదాపు 40 వేల మందికి అధిక లాభాల ఆశ చూపి తన సంస్థల్లో సుమారు రూ.1,021 కోట్లు (16 కోట్ల డాలర్లు) పెట్టుబడి పెట్టేలా చేశారని నిర్ధరణ అయ్యింది.
ఇదొక 'పొంజీ స్కీమ్' అని ఆయన అంగీకరించారు.
పుడిట్ అక్రమ పద్ధతుల్లో రుణాలు ఇచ్చినట్లు కోర్టు గుర్తించింది. మొత్తం 2,653 మోసాల్లో(కౌంట్స్ ఆఫ్ ఫ్రాడ్) ఆయనకు ప్రమేయమున్నట్లు తేల్చి, శిక్ష వేసింది.
పుడిట్ సెమినార్లు నిర్వహించి, ఎగుమతులు, స్థిరాస్తి వ్యాపారం, వాడిన కార్లకు సంబంధించిన వ్యాపారాలు, ఇతర వ్యాపారాలు తనకు ఉన్నాయని, వీటిలో పెట్టుబడులు పెట్టాలని చెప్పేవారని ప్రాసిక్యూషన్ పేర్కొంది.
మంచి లాభాలు వస్తాయని పెట్టుబడి పెట్టేవారితో పుడిట్ నమ్మబలికారని బ్యాంకాక్ పోస్ట్ పత్రిక తెలిపింది. కొత్తవారిని వ్యాపారంలోకి తీసుకొస్తే ప్రోత్సాహకాలు అందిస్తామని కూడా చెప్పేవారని పేర్కొంది.
పుడిట్ను ఆగస్టులో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన బ్యాంకాక్ రిమాండ్ జైల్లో ఉన్నారు.
ఆయన రెండు సంస్థలకు దాదాపు రూ.128 కోట్ల చొప్పున న్యాయస్థానం జరిమానా విధించింది.
బాధితులుగా గుర్తించిన 2,653 మందికి సుమారు రూ.109 కోట్ల సొమ్మును 7.5 శాతం వార్షిక వడ్డీతో పరిహారంగా చెల్లించాలని పుడిట్ను, ఆయన సంస్థలను కోర్టు ఆదేశించింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)