భారత్‌కు 5 పతకాలు తెచ్చిన జూనియర్ షూటర్లు

వీడియో క్యాప్షన్, భారత్‌కు 5 పతకాలు తెచ్చిన జూనియర్ షూటర్లు

జర్మనీలోని సుహల్‌లో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్ రైఫిల్/పిస్టల్ అండ్ షాట్‌గన్ పోటీల్లో పంజాబ్‌లోని ఫరీద్‌కోట్ జిల్లాకు చెందిన ఇద్దరు బాలికలు విజేతలుగా నిలిచారు.

50 మీటర్ల రైఫిల్ ఈవెంట్‌లో సిఫత్ కౌర్ రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో సహా 5 పతకాలు సాధించారు. భారత్‌లో జూనియర్‌ షూటింగ్‌లో పతకం సాధించిన తొలి జూనియర్‌ షూటర్‌గా సిఫత్‌ కౌర్‌ సమ్రా రికార్డు సృష్టించారు.

''నేను సుహాల్‌లో జరిగిన 0.2 టు 50 మీటర్ల పోటీల్లో రైఫిల్ షూటింగ్‌లో పాల్గొన్నాను. ఇది నేను సాధించిన మొదటి అంతర్జాతీయ పతకం. ఐదు ఈవెంట్లలో పాల్గొని ఐదింటిలోనూ పతకాలు సాధించాను. 50 మీటర్ల రైఫిల్ లో 3 స్థానాల్లో నేను రెండు బంగారు పతకాలను గెలుచుకున్నాను. 50 మీటర్ల మిక్స్‌ డ్ టీమ్‌, అండ్ ప్రోన్ మిక్స్‌ డ్ టీమ్ పోటీలో రెండు రజత పతకాలు సాధించాను. 3P థీమ్‌లో నాకు కాంస్యం వచ్చింది. ఈ పోటీల్లో అమ్మాయిలే ఎక్కువ పతకాలు సాధించారు. ఆడపిల్లలు ఈ గేమ్ లో ఎక్కువ ఆడలేరని అంటారు. కానీ, అది నిజం కాదు'' అని సిఫత్ కౌర్ సమ్రా చెప్పారు.

సిఫత్ కౌర్ సమ్రా తండ్రి పవన్‌దీప్ సింగ్ సమ్రా రైతు. కూతురు సాధించిన విజయాలను చూసి కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు.

''మాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు బాగా రాణిస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారు. మా ఫరీద్‌కోట్ ఒక చిన్న పట్టణం. ఆమె సాధించిన విజయాన్ని చూసి టౌన్ మొత్తం సంబరాలు చేసుకుంది. దేవుడి ఆశీర్వాదం ఆమెకు ఉంది. 50 మీటర్ల ఈవెంట్ లో ఆమె సాధించిన స్వర్ణం భారతదేశానికి వ్యక్తిగత విభాగంలో సాధించిన తొలి బంగారు పతకం. ఈ విభాగంలో భారత్ ఇంతకు ముందు ఒక్క స్వర్ణం గెలవలేదు. మా అమ్మాయి బాగా చదవాలనుకున్నాం. ఇప్పుడామె క్రీడల్లో రాణిస్తోంది. మేం ఆమెకు మా సహకారం అందిస్తున్నాం. దేవుడి దీవెనలు ఉన్నాయి'' అని పవన్ దీప్ సింగ్ సమ్రా తెలిపారు.

ఈ స్పోర్ట్స్ లో రాణించిన మరో అమ్మాయిది కూడా ఫరీద్ కోట్ జిల్లాకు చెందిన అమ్మాయే. ఆమె ఫరీద్ కోట్ లోని న్యూ రాజింద్ర నగర్ నివాసి షమీందర్ సింగ్ బ్రార్ కుమార్తె. 18 ఏళ్ల సిమ్రాన్‌ ప్రీత్ కౌర్ బ్రార్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు.

''సెకండ్ ట్రయల్ లో నేను సెలెక్ట్ అయ్యాను. నా దేశం తరఫున ఆడి పతకం సాధించినందుకు గర్వంగా ఫీలయ్యాను. మొదట్లో పతకం గెలుస్తాననే నమ్మకం అస్సలు లేదు. మా ఈవెంట్ మొదలైన తర్వాత మొదటి దశ... తర్వాత రెండో దశల్లో మొదటి రెండు బంగారు పతకాలతో పాటు రజతాన్ని కూడా భారత్ గెలుచుకుంది. ఈ విజయం చూసిన తర్వాత నాకు గర్వంగా అనిపించింది. దేశం కోసం ఆడి గెలవడమే నా లక్ష్యం'' అని సిమ్రాన్‌ప్రీత్ కౌర్ బ్రార్ చెప్పారు.

''నా కూతురు మా పట్టణానికి, మా రాష్ట్రానికి , మా దేశానికి అవార్డులు తెచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. ఆమె పుట్టినప్పటి నుంచే క్రీడాకారిణిగా మార్చాలని అనుకున్నాను. నా ఆలోచనకు దేవుడు కూడా సహకరించాడు. ఆమె ఆట పై దృష్టి పెట్టి, రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసింది. అంచెలంచెలుగా ఎదిగి, ఈ రోజు ఈ స్థానాన్ని సాధించింది.'ఇండియా షూటింగ్ టీమ్' అని ముద్రించిన టీ-షర్ట్‌ వేసుకోవాలని మేమిద్దరం కలలుగనేవాళ్లం'' అని సిమ్రాన్ ప్రీత్ కౌర్ తండ్రి షమిందర్ సింగ్ బ్రార్ చెప్పారు.

సిమ్రాన్‌ప్రీత్ కౌర్ 12వ తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. తమ కూతురు ఒలింపిక్ పతకం గెలిచి రోల్ మోడల్ కావాలనేది వారి కోరిక.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)