ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్ ఎన్నికలు: సోనూ సూద్ చెల్లెలు మోగా నుంచి పోటీ.. యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పుర్ అర్బన్ నుంచి

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు తమ తొలి విడత జాబితాను ప్రకటించింది.

తాజాగా ఆ పార్టీ పంజాబ్ ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి విడత జాబితా విడుదల చేసింది.

మరోవైపు బీజేపీ కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు తమ తొలి విడత జాబితాను శనివారం మధ్యాహ్నం ప్రకటించింది.

కాంగ్రెస్ పంజాబ్ తొలి జాబితాలో 86 మంది

పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శనివారం ప్రకటించిన తొలి విడత అభ్యర్థుల జాబితాలో 86 మంది పేర్లు ప్రకటించింది.

పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ ఈసారి కూడా 'రామ్కోర్ సాహెబ్' నుంచి పోటీ చేస్తున్నారు.

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ అమృతసర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.

ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన సినీ నటుడు సోనూసూద్ సోదరి మాళవిక సూద్‌ మోగ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు.

117 సీట్లు గల పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 1 ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడవుతాయి.

ఉత్తర్ ‌ప్రదేశ్‌లో బీజేపీ టికెట్లు సగం సిట్టింగ్‌లకే

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపు విషయంలో బీజేపీ కసరత్తు పూర్తి చేసి తొలి జాబితా ప్రకటించింది. ఇందులో మొదటి దశలో పోలింగ్ జరిగే 58 సీట్లలో 57 స్థానాలకు... రెండో విడత పోలింగ్ జరిగే 55 స్థానాల్లో 38 నియోజకవర్గాలుక అభ్యర్థులను ప్రకటించారు.

తొలి జాబితాలో ప్రకటించిన 102 మంది అభ్యర్థులలో 63 మంది సిటింగ్ ఎమ్మెల్యేలే.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు.

యోగి అయోధ్య నుంచి కానీ మథుర నుంచి కానీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయనకు గోరఖ్‌పూర్ అర్బన్ సీటు ఖరారు చేశారు.

యోగి అసెంబ్లీకి పోటీ చేయడం ఇదే తొలిసారి. 1998 నుంచి గోరఖ్‌పుర్ పార్లమెంటు స్థానంలో ఆయన అయిదు సార్లు గెలిచారు. ఎంపీగా ఉండగానే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

అనంతరం శాసనమండలికి ఎన్నికై ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆయన ఈ ఎన్నికలలో అసెంబ్లీకి తలపడనున్నారు.

గోరఖ్‌పూర్ అర్బన్ స్థానానికి మార్చి 3న పోలింగ్ జరగనుంది.

మరో కీలక నేత, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సిరాథూ నుంచి పోటీలో నిలుస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు 7 దశల్లో పోలింగ్ జరగనుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)