కశ్మీర్: నియంత్రణ రేఖ పరిసరాల్లో జీవితం ఎలా ఉంటుందంటే..

    • రచయిత, రియాజ్ మస్రూర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో ఒక గ్రామమైన చురాందాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామం భారత్-పాకిస్తాన్‌ల మధ్యనుండే నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ)కి అనుకొని కొండపై ఉంటుంది.

ఇక్కడ రెండు దేశాల సైన్యం కాల్పుల మోత సర్వసాధారణం. దీంతో రెండు వైపులా ప్రజలు మృత్యువాత పడుతుంటారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు బాధితులైన వారిలో తాజాగా 63ఏళ్ల జహూర్ అహ్మద్ కూడా చేరారు.

గత నెలలో ఆయన తన భార్యను పోగొట్టుకున్నారు. వారి ఇంటిపై మోర్టార్లతో దాడి జరగడంతో ఆమె కన్నుమూశారు.

''అక్కడ కనిపిస్తున్న ప్రాంతం పాకిస్తాన్‌ నియంత్రణలోని కశ్మీర్‌ది. ఆ ఊరి పేరు ఖ్వాజా బందీ. మేమంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తుంటాం''అని ఇంటి తలుపు దగ్గర నిలబడి ఎదురుగా కనిపిస్తున్న అటవీ ప్రాంతాన్ని చూపిస్తూ ఆయన చెప్పారు.

కోళ్లకు తన భార్య మేత తినిపిస్తుండగా ఓ మోర్టారుతో దాడి జరిగిందని ఆయన వివరించారు.

''మేం ఆసుపత్రికి తీసుకెళ్లాలని అనుకున్నాం. అయితే, అంతలోనే ఆమె చనిపోయింది''అని ఆయన వివరించారు.

క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా కష్టమని ఆయన వివరించారు. ''ఇక్కడి నుంచి కిందకువెళ్తే ఉబడ్‌కాబడ్ పేరుతో 20 మైళ్లు పొడవైన రహదారి ఉంటుంది. దానిపై ఏ వాహనాలూ ప్రయాణించలేవు. దీంతో క్షతగాత్రులను దానిపై నుంచి తీసుకెళ్లడం అంత తేలికకాదు''

''ఇక్కడ ఎప్పుడూ రోడ్డు వేయలేదు. ఇది కొండల మధ్య దారిలా ఉంటుంది. మంచంపై గాయపడినవారిని పడుకోబెట్టి.. అడవి గుండా మోసుకుంటూ తీసుకెళ్లాలి''.

బంకర్ల నిర్మాణానికి ఆదేశాలు

ఇక్కడ చాలా పెద్ద సైనిక శిబిరం ఉండేదని చురాందా గ్రామ వాసులు, పరిసరాల్లోని భట్‌గ్రాన్ ప్రాంత వాసులు తెలిపారు.

''పాకిస్తాన్ సైన్యం ఎప్పటి నుంచో ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటోంది. ఇక్కడ శిబిరం ఉందని భావిస్తూ వారు దాడులు చేస్తున్నారు. కానీ ఎప్పుడో భారత సైన్యం ఇక్కడి శిబిరాన్ని వదిలి వెళ్లిపోయింది. దీంతో అటువైపు నుంచి జరిపే కాల్పులకు మేం బాధితులుగా మారుతున్నాం''అని గ్రామానికి చెందిన సజ్జద్ హుస్సేన్ తెలిపారు.

తాజాగా ఒక మహిళ మరణించడంతో సరిహద్దుకు పరిసరాల్లోని రెండు గ్రామాలవాసుల్లో ఆందోళన మరింత ఎక్కువైంది.

ఇదివరకు ఇక్కడి గ్రామవాసుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కొందరు వృద్ధులు ప్రభుత్వాన్ని కోరారు.

దీంతో స్థానిక ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామంలో బంకర్లు నిర్మించాలని ఆదేశాలు ఇచ్చింది.

మంజూర్ అహ్మద్ ఒక స్థానిక కార్యకర్త. ఆయన డ్యూటీ మెజిస్ట్రేట్‌గానూ పనిచేస్తున్నారు.

''బంకర్లు నిర్మిస్తున్నారని తెలియగానే గ్రామ ప్రజలు చాలా సంతోషపడ్డారు. కానీ ఈ ప్రాజెక్టులో కొన్ని సమస్యలున్నాయి. పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయి. మరోవైపు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి''అని ఆయన వివరించారు.

ఇక్కడ కొన్నిచోట్ల బంకర్లు నిర్మిస్తున్నారు. అయితే పనులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి.

ఆలస్యం ఎందుకు?

జహూర్ కుమారుడు జావెద్ అహ్మద్ సైన్యంలో పనిచేస్తున్నారు.

''ఇక్కడి సైన్యాధికారులు మాపై చాలా దయగా ఉంటారు. మాకు వారు రూ.50,000 ఇచ్చారు. మా ఇంటి బయట బంకర్ నిర్మాణం పని కూడా మొదలుపెట్టారు. అయితే పనికి చాలా సమయం పడుతోంది. ఏదేమైనా మాకు ప్రభుత్వం తక్షణమే సాయం చేయడంతో సంతోషంగా అనిపిస్తోంది''అని జావెద్ చెప్పారు.

బంకర్ల నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతోందని ఉరీ జిల్లా డిప్యూటీ మెజిస్ట్రేట్ రియాజ్ మలిక్‌ను బీబీసీ ప్రశ్నించింది. అయితే ఇక్కడ బంకర్ల నిర్మాణం చాలా కష్టమని, అందుకే కాంట్రాక్టర్లు ఆసక్తి చూపించడంలేదని ఆయన చెప్పారు.

మరోవైపు రెండు వైపుల నుంచీ కాల్పుల ముప్పు ఈ గ్రామ వాసులకు ఉంటుందని అన్నారు.

''ప్రస్తుతం బంకర్ల నిర్మాణానికి స్థానికుల సాయం తీసుకుంటున్నాం. దీంతో పనులు జరుగుతున్నాయి''అని రియాజ్ వ్యాఖ్యానించారు.

భయం గుప్పిట్లో

మ్యాప్‌లో కనిపించేంత చిన్నగా ఈ నియంత్రణ రేఖ ఉండదు. దీని పొడవు 650 మైళ్లు. కొన్నిచోట్ల వెడల్పు 25 మైళ్ల వరకు ఉంటుంది. ఇక్కడ రెండు వైపులా ప్రజలు నివసిస్తుంటారు. వీరు ఎప్పుడూ భయం గుప్పిట్లోనే బతుకుతుంటారు.

2003లో భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయి. అయితే ఇప్పటికీ ఇక్కడ కాల్పులు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం మీరంటే మీరని రెండు దేశాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటుంటాయి.

ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్తాన్ 3000 కంటే ఎక్కువసార్లే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడించిందని భారత పార్లమెంటుకు కేంద్ర హోం మంత్రి తెలిపారు.

పూంచ్, రాజౌరీ, సంబా, ఆర్‌ఎస్ పురా, కథువా జిల్లాల్లోని సరిహద్దు ప్రాంతాల వాసుల కోసం రెండేళ్ల క్రితమే బంకర్లు నిర్మించి ఇచ్చారు.

బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోనూ బంకర్లు నిర్మించేందుకు గత వేసవిలో పనులు మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)