కరోనావైరస్ లాక్‌డౌన్: ముంబయి బాంద్రా రైల్వే స్టేషన్ వద్ద వేల సంఖ్యలో గుమిగూడిన వలస కార్మికులు

ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్‌లో వేలాది మంది వలస కూలీలు గుమిగూడారు. లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన రైళ్ళు మళ్లీ నడుస్తాయనే నమ్మకంతో వలస కూలీలు వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

వేల మంది వలస కూలీలు తమ సొంత ఊళ్ళకు వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారని, స్వస్థలాలకు వెళ్ళేందుకు తమను అనుమంతిచాలని వారు కోరారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

దీనిపై మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మహాణలే మాట్లాడుతూ, "వీళ్లంతా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు, ఈరోజు లాక్‌డౌన్ ముగిసిపోయింది కదా అని సొంత ఊళ్ళకు వెళ్లవచ్చని ఇలా వచ్చారు" అని చెప్పారు.

"ఇక్కడున్న చిన్న చిన్న కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులే వీళ్లంతా. ఇప్పుడు ఆ కర్మాగారాలను మూసేశారు. దాంతో, వారు ఎంతో ఆందోళన చెందుతున్నారు. వారి పరిస్థితిని మేం అర్థం చేసుకున్నాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది" అని బాంద్రాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ చెప్పారు.

రైల్వే స్టేషన్ వద్ద జనం భారీ సంఖ్యలో గుమిగూడినట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారందరినీ అక్కడి నుంచి పంపించారు. ప్రజలను తరిమేయడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు.

మార్చి 24న ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశం అంతటా లాక్‌డౌన్ ప్రకటించారు. అప్పుడు ప్రకటించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగిసింది. దాంతో, ఈ వలస కార్మికులు సొంత గ్రామాలకు వెళ్ళవచ్చనే ఆశతో రైల్వే స్టేషన్‌కు తరలివచ్చారు.

మంగళవారం ఉదయం మోదీ మళ్లీ వీడియో సందేశాన్నిస్తూ, లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రజలు మరికొంత కాలం ఇంటిలోపలే ఉండాలని కోరారు.

పరిస్థితి అదుపులో ఉందన్న ఆదిత్య ఠాక్రే

మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ఈ విషయం మీద ట్వీట్ ద్వారా స్పందించారు. బాంద్రా స్టేషన్ వద్ద ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని అన్నారు. సూరత్‌లో మాత్రం కొన్ని చోట్ల దాడులు జరిగాయన్నారు. వలస కార్మికులను సొంత ఊళ్ళకు పంపించే విషయంలో కేంద్ర ప్రబుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు.

కరోనావైరస్ మహారాష్ట్రను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 2,300కు పైగా కేసులు నమోదయ్యాయి. 160 మందికి పైగా ప్రజలు కోవిడ్ బారిన పడి చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 10 వేలకు మించిపోయాయి. 350కి పైగా మంది చనిపోయారు.

తొలిదశ లాక్‌డౌన్ ప్రకటించినప్పుడు దిల్లీలోని ఆనంద్ విహార్ వద్ద ఇలాగే వేలాది మంది వలస కార్మికులు గుమిగూడారు. దిల్లీ, ఉత్తర ప్రదేశ్ సరిహద్దుకు జనం భారీ సంఖ్యంలో తరలి వచ్చారు. ఆ సమయంలో రెండు రాష్ట్రాలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. చివరకు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం వలసదారులను రప్పించడానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)