You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TrumpInIndiaBBC: 'వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతికి ప్రతీక తాజ్మహల్' - డోనల్డ్ ట్రంప్
అహ్మదాబాద్ పర్యటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ప్రసిద్ధ పర్యటక కేంద్రం ఆగ్రా చేరుకున్నారు. భార్య మెలానియాతో కలిసి తాజ్మహల్ సందర్శించారు.
తాజ్మహల్ సుసంపన్నమైన, వైవిధ్యమైన భారతీయ సాంస్కృతిక సౌందర్యానికి కాలాతీతమైన చిహ్నమని సందర్శకుల పుస్తకంలో ట్రంప్ రాశారు.
అహ్మదాబాద్ నుంచి ఆగ్రాకు వెళ్తున్నప్పుడు ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ బీబీసీ ప్రతినిధి అలీమ్ మక్బూల్తో మాట్లాడుతూ, "క్రికెట్ స్టేడియంలో స్వాగతం ఎంతో ఘనంగా ఉంది. వాణిజ్య ఒప్పందాలకు విషయంలో మేమేమీ తొందరపడడం లేదు. తాజ్మహల్ గురించి విన్నాను. కానీ, ఎప్పుడూ చూడలేదు" అని అన్నారు.
రెండు రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ సోమవారం భారత్ చేరుకున్నారు. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్రంప్ దంపతులకు రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.
మొటేరా స్టేడియంలో ట్రంప్, మోదీ ప్రసంగం
ఆగ్రా సందర్శనకు ముందు అహ్మదాబాద్లోని మోటేరా స్టేడియంలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు.
భారత దేశాన్ని, భారత సంస్కృతిని, భారత్ సాధించిన ఘనతను, తన పాలనను ప్రశంసిస్తూ ట్రంప్ చేసిన ప్రసంగానికి మోదీ ధన్యవాదాలు తెలిపారు. సడలని విశ్వాసం కల్గిన మంచి మిత్రులుగా భారత్-అమెరికా దేశాలను మోదీ అభివర్ణించారు.
ఘన స్వాగతం పలికిన భారతీయులకు, మోదీ ఇచ్చిన ఆతిధ్యానికి కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్, గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్ అమెరికా అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
భారత్ చేపట్టిన చంద్రయాన్ ప్రాజెక్ట్ పై ట్రంప్ తన ప్రసంగంలో ప్రశంసలు కురిపించారు.
అమెరికా అభివృద్ధిలో మహిళా పారిశ్రామిక వేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ట్రంప్ ప్రశంసిచారు.
ఇరు దేశాలకు ప్రయోజనం కల్గించేలా ప్రధాని మోదీతో చర్చలు జరుపుతానని చెప్పారు. అయితే ఈ ప్రక్రియ కాస్త క్లిష్టమైనదేనని అన్నారు.
భారత్తో మా అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ షేర్ చేసుకుంటామని ట్రంప్ చెప్పారు. "మేం భారత్కు రక్షణ పరికరాలు అందిస్తాం. భారత సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తాం" అన్నారు.
3 బిలియన్ డాలర్లకు పైగా విలువైన అత్యాధునిక మిలిటరీ హెలికాప్టర్స్, ఇతర మిలిటరీ పరికరాలను భారత సైన్యానికి అందించేందుకు రెండు దేశాలూ రేపు ఒప్పందం చేసుకోబోతున్నాయని చెబుతున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు.
తీవ్రవాదంపై కలిసి పోరాడాలని భారత్-అమెరికా దృఢ సంకల్పంతో ఉన్నాయని ట్రంప్ చెప్పారు. "మేం ఇస్లామిక్ స్టేట్ను అంతం చేశాం. అల్ బగ్దాదీని అంతం చేసింది మేమే" అన్నారు.
రెండు దేశాలు ఉగ్రవాద పీడిత దేశాలేనన్న ట్రంప్ తన నేతృత్వంలో ఐసిస్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నానని చెప్పారు. పాకిస్తాన్తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్తో కలిసి పని చేస్తున్నామని అన్నారు.
భారత దేశాన్ని తిరుగులేని ఆర్థిక శక్తిగా అభివర్ణించిన ట్రంప్ గడిచిన ఏడు దశాబ్దాల్లో తిరుగులేని అభివృద్ధి సాధించిందని చెప్పారు. గడిచిన పదేళ్లలో పేదరికాన్ని ప్రారదోలారగల్గారని. మోదీ నాయకత్వంలో దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరికీ విద్యుత్ అందుబాటులోకి వచ్చిందని ట్రంప్ అన్నారు. అన్ని దేశాలకు ఆదర్శంగా భారత్ నిలుస్తోందని వ్యాఖ్యానించారు.
తెలివితేటలకు, సృజనాత్మకతకు భారత్ పెట్టింది పేరన్నారు. భారతీయ సంస్కృతి గురించి, పండగల గురించి తన ప్రసంగంలో ప్రస్తావించారు. వివిధ మతాలకు చెందిన ప్రజలు, వందకుపైగా భాషలు ఇలా భిన్నత్వంలో ఏకత్వానికి భారత్ ప్రతీకగా నిలుస్తోందని ట్రంప్ చెప్పారు.
అమెరికాలోని భారతీయులు సైన్స్, ఆర్ట్స్, టెక్నాలజీ తదితర రంగాల్లో తిరుగులేని ప్రతిభను చూపిస్తున్నారంటూ ప్రసంసల జల్లు కురింపించారు. గతంలో ఎప్పుడు లేని విధంగా అమెరికా ఆర్థికరంగం పరుగులు తీస్తోందని, తన హయాంలో అమెరికన్ మిలటరీ ప్రపంచ శక్తిగా అవతరించిందన్నారు. మెలానియా ట్రంప్తో కలిసి మహాత్మాగాంధీ ఆశ్రమాన్ని సందర్శించిన మర్చిపోలేని అనుభూతినిచ్చిందన్నారు.
నమస్తే అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన ట్రంప్. భారత్ అంటే అమెరికాకు ఎంతో గౌరవం అని వ్యాఖ్యానించారు. ఐదు నెలల క్రితం టెక్సస్లో మోదీ ఆహ్వానం పలికితే.. ఇప్పుడు తనకు మొతేరా స్టేడియంలో ఘన స్వాగతం పలకడం సంతోషంగా ఉందన్నారు. మొతేరా స్టేడియం అద్భుతంగా ఉందని, తనకు అద్భుత స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలిపారు. భారత ఆతిథ్యాన్ని తన కుటుంబం ఎప్పటికీ మరిచిపోలేదని ట్రంప్ అన్నారు.
ఇవాళ ప్రపంచమంతా ట్రంప్ ఏం మాట్లాడతారోనని ఎదురు చూస్తున్నారని మోదీ అన్నారు. భారత పర్యటనకు వచ్చినందుకు మెలానియా ట్రంప్, ఇవాంకా దంపతులకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
నమస్తే అన్న పదానికి లోతైన అర్థం ఉందన్న మోదీ. ట్రంప్ నాయకత్వంలో రెండు దేశాల సంబంధాలు మరింత పటిష్టమవుతాయని వ్యాఖ్యానించారు.
మొతేరా స్టేడియంలో ఇవాళ కొత్త చరిత్ర ప్రారంభమయ్యిందని మోదీ అన్నారు. అమెరికా నుంచి అహ్మదాబాద్ వరకు సుదీర్ఘ ప్రయాణం చేసిన తర్వాత కూడా ఎలాంటి విశ్రాంతి లేకుండా సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన ట్రంప్ పరివారానికి మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
భారత్ మాతాకి .. అంటూ ప్రసంగాన్ని తన ప్రారంభించిన మోదీ. నమస్తే ట్రంప్ , భారత్-అమెరికా సంబంధాలు వర్ధిల్లాలి అంటూ కొనసాగించారు.
మొతేరా స్టేడియంలో ఇరు దేశాధినేతలకు పెద్ద ఎత్తున అభివాదం చేసిన జనం. జాతీయ గీతం జనగణమనతో ప్రారంభమైన సభ. భారత హోమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఇతర ప్రముఖులు సభకు హాజరైన వారిలో ఉన్నారు.
మొతేరా స్టేడియంను చేరుకున్న ట్రంప్- మోదీ.
ప్రస్తుతం అహ్మాదాబాద్ నగరంలో మోదీ-ట్రంప్ల రోడ్ షో కొనసాగుతోంది. గుజరాతీ సంప్రదాయ కళాకృతులతో జనం స్వాగతం పలుకుతున్నారు.
కాసేపట్లో మొతేరా స్టేడియంను డోనల్డ్ ట్రంప్ ప్రారంభించనున్నారు.
సబర్మతీ ఆశ్రమం నుంచి మొతేరా స్టేడియంలో జరగనున్న నమస్తే ట్రంప్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రంప్ దంపతులు, ప్రధాని మోదీ బయల్దేరారు.
ట్రంప్ దంపతులకు సబర్మతీ ఆశ్రమాన్ని స్వయంగా దగ్గరుండీ చూపించిన నరేంద్ర మోదీ.
సబర్మతీ ఆశ్రమానికి చేరుకున్న ట్రంప్ దంపతులు.
కాసేపట్లో ట్రంప్ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు.
పలు సాంస్కృతిక కళారూపాలు ప్రదర్శిస్తూ సంప్రదాయబద్ధంగా ఆహ్వానం సాగింది. విమానాశ్రయం నుంచి మెతేరా స్టేడియంకు రోడ్ షో ప్రారంభమయ్యింది. దారి పొడవునా పెద్ద ఎత్తున జనం మోదీ-ట్రంప్లకు ఆహ్వానం పలుకుతున్నారు. మొత్తం 22 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో జరగనుంది.
అహ్మదాబాద్ చేరిన మోదీ
ట్రంప్కు స్వాగతం పలికేందుకు ప్రధాని మోదీ అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అటు అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియం కిట కిటలాడుతోంది. బయట కూడా పెద్ద సంఖ్యలో జనం వేచి చూస్తున్నారు.
రోడ్ షో జరగనున్న ప్రాంతంలో దారి పొడవునా మోదీ -ట్రంప్లకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం చేరుకుంటున్నారు.
విమానాశ్రయం నుంచి జరిగే రోడ్ షోలో మార్గ మధ్యంలో మురికివాడలు కనిపించకుండా నిర్మించిన గోడపై పోలీసులు పహారా కాస్తున్నారు.
ఆయనతో పాటు వచ్చేదెవరు ?
డోనల్డ్ ట్రంప్తో పాటు అమెరికా మొదటి మహిళ మెలానియా ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జారెద్ ఖష్నెర్ సహా అమెరికా ఆర్థిక మంత్రి స్టీవెన్ మనూషన్, వాణిజ్యశాఖ మంత్రి విల్బర్ రాస్, జాతీయ భద్రతా సలహాదారు రాబర్డ్ ఓబ్రైన్, ఇంధన శాఖ మంత్రి డాన్ బ్రూలెట్ సహా ఇతర ఉన్నతాధికారుల బృందం రానుంది. ట్రంప్తో పాటు మెలానియా కూడా అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
షెడ్యూల్ ఎలా సాగనుంది ?
ఉదయం 11.40కి విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయనకు భారత ప్రధాని నరేంద్రమోదీ స్వాగతం పలుకుతారు. ఆపై ఎయిర్పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆహ్వాన వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్లోని మొతేరా క్రికెట్ స్టేడియం వరకు జరిగే రోడ్ షోలో ఇద్దరు నేతలు పాల్గొంటారు.
మార్గమధ్యంలో మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమాన్ని ట్రంప్ సతీ సమేతంగా సందర్శించనున్నారు. అక్కడ సుమారు 15 నిమిషాలు గడపనున్నారు. ఆ తరువాత నేరుగా స్టేడియంకు చేరుకుంటారు. మొత్తం 22 కిలోమీటర్ల మేర ఈ రోడ్ షో జరగనుంది.
క్రికెట్ మైదానాన్ని ప్రారంభించిన తర్వాత ఏర్పాటు చేసిన సభకు హాజరైన జనాన్ని ఉద్ధేశించి ట్రంప్, మోదీలు ప్రసంగిస్తారు. ఆపై 'నమస్తే ట్రంప్' పేరిట భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
అహ్మదాబాద్ నుంచి ఆగ్రాకు
ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ట్రంప్ అహ్మదాబాద్ నుంచి సాయంత్రం 5.15 గంటలకు ఆగ్రా చేరుకుంటారు. అక్కడ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్.. ట్రంప్ బృందానికి ఆహ్వానం పలుకుతారు.
ఆపై తాజ్ మహల్కు చేరుకోనున్న ట్రంప్ అక్కడ సుమారు గంట సేపు గడుపుతారు. తాజ్ మహల్ సందర్శన అనంతరం రాత్రి 7.30 గంటలకు దిల్లీ చేరుకుంటారు. అక్కడితో ట్రంప్ తొలి రోజు పర్యటన ముగుస్తుంది.
మంగళవారం షెడ్యూల్
ఉదయం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, మొదటి మహిళ మెలానియా ట్రంప్ ఇరువురూ రాష్ట్రపతి భవన్లో జరిగే ఆహ్వాన వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత నేరుగా రాజ్ఘాట్కి వెళ్లి మహాత్మాగాంధీ సమాధికి నివాళులర్పిస్తారు. తర్వాత, 'హైదరాబాద్ హౌస్'లో ట్రంప్-మోదీల మధ్య అధికారిక చర్చలు జరుగుతాయి.
చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం రాష్ట్రపతి భవన్లో అమెరికా అధ్యక్షుని గౌరవార్థం భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పాల్గొంటారు. అక్కడితో డోనల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన ముగుస్తుంది. విందు అనంతరం తిరుగు పయనమవుతారు.
ట్రంప్ పర్యటన ప్రత్యేకతలు
అమెరికా అధ్యక్ష హోదాలో ట్రంప్ భారత్ రావడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి భవన్లో జరిగే విందు కార్యక్రమానికి దేశంలో 8 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది. అయితే ప్రతిపక్షాలకు మాత్రం ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం దక్కలేదు. ఇలా ఓ అమెరికా అధ్యక్షుడు భారత్లో ప్రతిపక్ష నేతల్ని కలవకపోవడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి
- ట్రంప్ భారత పర్యటనతో అమెరికా-ఇండియా ట్రేడ్ వార్ సమసిపోతుందా?
- చిరంజీవి సినిమాలో మహేశ్ బాబు కీలక పాత్ర
- ఒక్కొక్కరిదీ ఒక్కో కథ: భారత మహిళల క్రికెట్ జట్టులోని ఈ ప్లేయర్స్ మీకు తెలుసా...
- భూమి బల్లపరుపుగా ఉందని నిరూపిస్తానని ప్రాణాలు కోల్పోయాడు
- సీఏఏ-ఎన్ఆర్సీ: పెళ్లి, పుట్టినరోజు సర్టిఫికెట్ల కోసం హైదరాబాద్లో దరఖాస్తుల వెల్లువ
- కాందహార్ హైజాక్: 'హనీమూన్కు వెళ్లి బందీగా చిక్కారు'
- టైఫాయిడ్ వాక్సిన్: 'అద్భుతంగా పనిచేస్తోంది'
- లక్షల జంతువులను బలి ఇచ్చే 'అత్యంత రక్తసిక్త జాతర' మళ్ళీ మొదలు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)