You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్ రాజధాని రగడ: శాసనమండలి రద్దవుతుందా?
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఉత్కంఠ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మెజారిటీలో ఉన్న శాసనమండలి రద్దు దిశగా ఈ పరిణామాలు సాగుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, సమ్మిళిత అభివృద్ధి బిల్లు 2020ను శాసనమండలిలో ప్రవేశపెట్టకుండా అడ్డుకునేందుకు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులకు రాష్ట్ర శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ బిల్లు ప్రకారం.. విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా, అమరావతి శాసన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఏర్పాటవుతాయి.
ఈ బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టాల్సి ఉంది. బిల్లులను మండలి ఆమోదించినట్లయితే అవి గవర్నర్ ఆమోదంతో చట్టంగా మారతాయి. ఒకవేళ తిరస్కరించినట్లయితే.. మళ్లీ శాసనసభకు వెళతాయి. శాసనసభ అదే బిల్లును మళ్లీ ఆమోదించినట్లయితే.. ఆ బిల్లు మరోసారి శాసనమండలికి వెళుతుంది. మండలి రెండోసారి కూడా బిల్లును తిరస్కరించినా సరే.. నిబంధనల ప్రకారం బిల్లు ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారు.
అధికార, విపక్షాల వ్యూహ ప్రతివ్యూహాలు...
అయితే.. ఈ బిల్లులను శాసనమండలిలో ప్రవేశపెట్టకుండా అడ్డుకట్ట వేయటానికి మండలిలో ఆధిక్యంలో ఉన్న ప్రతిపక్ష టీడీపీ వ్యూహాత్మక ఎత్తుగడలు అనుసరిస్తోంది.
మండలిలో ప్రతిపక్ష టీడీపీకి 34 మంది సభ్యులు ఉండగా.. అధికార వైసీపీకి 9 మంది సభ్యులు.. పీడీఎఫ్కి ఆరుగురు సభ్యులు, బీజేపీకి ఇద్దరు, కాంగ్రెస్కు ఒకరు, స్వతంత్ర సభ్యులు ముగ్గురు ఉన్నారు.
మండలి సమావేశాలకు ముందు అధికార వైసీపీ ఎమ్మెల్సీలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమావేశమయ్యారు. ఇరు పక్షాలూ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించాయి. రెండు పార్టీలూ తమ తమ ఎమ్మెల్సీలకు విప్ జారీలు చేశాయి.
అధికార పక్షం నుంచి మంత్రులందరూ మండలికి హాజరయ్యారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డిలు శాసనమండలి వీఐపీ గ్యాలరీలోకి కూర్చుని.. మండలిలో పరిణామాలను పరిశీలిస్తున్నారు.
ప్రతిపక్షం తన ఎమ్మెల్సీలందరూ సభకు హాజరయ్యేలా చూసింది. అయినప్పటికీ.. సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మంగళవారం నాడు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మరో ఇద్దరు ఎమ్మెల్సీలు సమావేశానికి హాజరు కాలేదు.
రూల్ 71 కింద చర్చకు టీడీపీ నోటీస్...
శాసనసభ ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లులను రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి మంగళవారం శాసన మండలిలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చించి, ఆమోదించాలని ఆయన ప్రతిపాదించారు.
ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ రూల్ 71 కింద తీర్మానం ప్రవేశపెట్టింది. ముందుగా.. రాజధాని మార్పుపై చర్చించాలని, బిల్లును తిరస్కరించాలని కోరింది. ప్రభుత్వ విధానం మీద రూల్ 71 కింద ఇచ్చిన నోటీసుపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పట్టుపట్టారు.
ఇందుకు మంత్రి బుగ్గన అభ్యంతరం తెలిపారు. వికేంద్రీకరణ బిల్లు శాసనసభలో ఆమోదం పొందినందున.. ముందు ఆ బిల్లు మీద చర్చ జరగాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రభుత్వ వ్యవహారాలకు ప్రధమ ప్రాధాన్యతనివ్వాలని నిబంధనలు చెబుతున్నాయని పేర్కొన్నారు.
చైర్మన్ నిర్ణయంపై మంత్రుల అభ్యంతరం...
ఈ నేపథ్యంలో రూల్ 71 కింద చర్చ జరపాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు మండలి చైర్మన్ షరీఫ్ చెప్పారు. ఏ విధంగా చర్చ జరపాలన్న అంశంపై చాంబర్లో మాట్లాడదామని సూచించారు.
మండలి చైర్మన్ భయపడుతున్నారని అధికార పక్ష సభ్యులు వ్యాఖ్యానించారు. భయపడడానికి ఇదేం గుడివాడ కాదని యనమల బదులిచ్చారు. ''టీడీపీ సభ్యులు డొంక తిరుగుడుగా వ్యవహరిస్తున్నారు'' అని మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ విమర్శించారు. శాసనసభ ఆమోదించిన బిల్లులు ప్రవేశపెట్టి తీరాల్సిందేనన్నారు.
''ఇందులో డొంక తిరుగుడేం లేదు.. నిబంధనలను వినియోగించుకుంటున్నాం'' అని యనమల స్పందించారు. రూల్ 71 కింద చర్చకు అనుమతిస్తున్నట్లు మండలి చైర్మన్ ప్రకటించారు.
టీ విరామం తర్వాత శాసనమండలి మళ్లీ సమావేశమైంది. రూల్ 71 కింద చర్చకు చైర్మన్ అనుమతించటం పట్ల.. చైర్మన్ తీరుపై మంత్రులు అభ్యంతరం వ్యక్తంచేశారు. బుగ్గన ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చించాలని డిమాండ్ చేశారు.
మండలి చైర్మన్ తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తంచేశారు. చైర్మన్ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయకూడదని.. చైర్మన్ పని తీరు మండలి చరిత్రలో మచ్చగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.
మండలి చైర్మన్ షరీఫ్ స్పందిస్తూ.. తనకు రాజకీయాలు అపాదించవద్దని చెప్పారు. నిబంధనల మేరకు పని చేస్తున్నానని పేర్కొన్నారు.
బొత్స వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో టెలివిజన్ చానళ్లలో శాసనమండలి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేశారు. చైర్మన్ సీటును 14 మంది మంత్రులు చుట్టుముట్టారు. దీంతో శాసనమండలి రెండోసారి వాయిదా పడింది.
మండలిలో బిల్లులు ప్రవేశపెట్టకపోతే ఏమవుతుంది?
శాసనసభ ఆమోదించిన బిల్లులను శాసనమండలి ఆమోదించటమో, తిరస్కరించటమో చేయొచ్చు. అయితే.. రెండోసారి తిరస్కరించినప్పటికీ.. ఆ బిల్లును ఆమోదించినట్లుగానే పరిగణిస్తారు. బిల్లు గవర్నర్ ఆమోదంతో చట్టంగా మారుతుంది.
ఒకవేళ.. మొదటిసారి కానీ, రెండోసారి కానీ.. బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు శాసనమండలి సిఫారసు చేయవచ్చు. అలా మూడు నెలల పాటు ఈ బిల్లు చట్టంగా మారకుండా నిలువరించవచ్చునని పరిశీలకుల విశ్లేషణ.
ఈ నేపథ్యంలో.. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు చట్టంగా చేయటానికి ఆటంకాలు ఎదురుకాకుండా చూడటానికి.. మండలిని రద్దు చేయటం, ఆర్డినెన్స్ జారీచేయటం వంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్తున్నారు.
రాత్రి మంత్రివర్గం అత్యవసర భేటీ.. మండలి రద్దుపై నిర్ణయం?
ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం అత్యవసర సమావేశం కానుంది. మంత్రులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మండలి రద్దుపై కేబినెట్ తీర్మానం చేసే అవకాశముందని చెప్తున్నారు. ఈ విషయంలో న్యాయపరమైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం.
నిజానికి.. శాసనసభలో అధికార పక్షానికి భారీ మెజారిటీ ఉన్నప్పటికీ.. మండలిలో ప్రతిపక్షం ఆధిక్యంలో ఉండటం సర్కారుకు ఇబ్బందికరంగా మారిందని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతకుముందు కూడా.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన ప్రవేశపెట్టటం, ఎస్సీ కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను కూడా శాసనసభకు తిప్పి పంపుతూ శాసనమండలి తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో మండలిని రద్దు చేయాలన్న ఆలోచన ప్రభుత్వంలో ముందు నుంచే ఉన్నట్లు చెప్తున్నారు.
శాసనమండలిని రద్దు చేయాలంటే.. తొలుత మంత్రివర్గం తీర్మానం చేయాలి. దానిని శాసనసభలో ఆమోదించాలి. అలా ఆమోదించిన తీర్మానాన్ని పార్లమెంటుకు పంపించాలి. అంటే.. పార్లమెంటు ఆమోదించిన తర్వాతే మండలి రద్దు అవుతుందని నిపుణులు చెప్తున్నారు.
రద్దు చేస్తామంటే మేం భయపడం: నారా లోకేశ్
శాసనమండలిని రద్దు చేస్తామంటే భయపడేది లేదని ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వం శాసనమండలిని రద్దుచేసే యోచనలో ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో లోకేశ్ మీడియాతో మాట్లాడారు.
''ఈ విషయంలో టీడీపీ సభ్యులెవరూ ఆందోళనలో లేరు. మండలి రద్దుపై అసెంబ్లీ తీర్మానం మాత్రమే చేయగలదు. మేం కూడా మండలిలో తీర్మానం చేయగలం. ప్రజా సమస్యలపై చర్చ అంటే.. ప్రభుత్వం రద్దు అంటోంది'' అని విమర్శించారు.
టీడీపీ ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా
మరోవైపు.. శాసనమండలి ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రతిపక్ష టీడీపీ సీనియర్ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు పంపించారు.
భవిష్యత్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకూడదని నిశ్చయించుకున్నట్లు.. మీడియాకు కూడా విడుదల చేసిన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఆయన మంగళవారం నాడు శాసనమండలి సమావేశాలకు హాజరుకాలేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపించి అజ్ఞాతంలోకి వెళ్లినట్టు చెప్తున్నారు.
శాసనమండలి సమావేశానికి డొక్కా మాణిక్యవరప్రసాద్తో పాటు శమంతకమణి, నామినేటెడ్ ఎమ్మెల్సీ రత్నబాబు కూడా హాజరుకాకపోవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి:
- జైల్లో సొరంగం తవ్వారు.. 75 మంది ఖైదీలు పరారయ్యారు
- వినోదం కోసం ఇంట్లో చిరుతల్ని పెంచుకుంటున్నారు
- ఏనుగు ఈ స్టార్ హోటల్కు రెగ్యులర్ కస్టమర్.. చూడండి ఏం చేస్తోందో
- వసతి గృహంలో బాలికలపై అత్యాచారం కేసు: 19 మందిని దోషులుగా తేల్చిన కోర్టు
- ‘నా న్యూడ్ చిత్రాలు గీశాక, నా కాళ్లకు నమస్కరిస్తారు’
- పోర్నోగ్రఫీ వెబ్సైట్లలో పెరిగిపోతున్న టీనేజీ అమ్మాయిల కంటెంట్.. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్కు కలిగే లాభమేంటి.. జరిగే నష్టమేంటి
- రూపాయి చరిత్ర : కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)