#SatyaNadella: 'విచారకరం - బాధాకరం' - CAAపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందన

భారతదేశంలో వివాదాస్పద పౌరసత్వం చట్టం (సీఏఏ) గురించి మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల స్పందిస్తూ.. జరుగుతున్న పరిణామాలు బాధాకరమని, మంచిదికాదని వ్యాఖ్యానించినట్లు బజ్‌ఫీడ్ ఎడిటర్-ఇన్-చీఫ్ బెన్ స్మిత్ ట్విటర్‌లో పేర్కొన్నారు.

మైక్రోసాఫ్ట్ సంస్థ సోమవారం ఉదయం అమెరికాలోని మన్‌హటన్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో సంపాదకులతో సత్య నాదెళ్ల మాట్లాడారని.. ఆ సందర్భంగా తను అడిగిన ప్రశ్నకు ''నాకు అర్థమైనంతవరకూ జరుగుతున్న పరిణామాలు విచారకరం. ఇది మంచిది కాదు... భారతదేశానికి వచ్చే ఒక బంగ్లాదేశీ వలస వ్యక్తి ఇండియాలో తదుపరి యూనికార్న్‌ను స్థాపించటమో.. ఇన్ఫోసిస్ తర్వాతి సీఈఓ అవటమో జరిగితే నేను చాలా సంతోషిస్తాను'' అని వ్యాఖ్యానించినట్లు స్మిత్ ట్వీట్ చేశారు.

ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విటర్‌లో #SatyaNadella, Microsoft ట్రెండవుతున్నాయి.

హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన సత్య నాదెళ్ల.. తన బహుళ సాంస్కృతిక మూలాల గురించి కూడా బెన్ స్మిత్‌కి చెప్పారు. ''నేను హైదరాబాద్ నగరంలో పెరిగాను. పెరగటానికి అది చాలా గొప్ప ప్రాంతమని నాకు ఎల్లప్పుడూ అనిపిస్తుంది. మేం ఈద్ జరుపుకున్నాం. క్రిస్మస్ జరుపుకున్నాం. దీపావళి జరుపుకున్నాం. మూడు పండుగలూ మాకు పెద్ద పెండుగలే'' అని వివరించారు.

బెన్ స్మిత్ ఈ ట్వీట్ చేసిన కొద్ది సేపటి తర్వాత.. సత్య నాదెళ్ల తరఫున మైక్రోసాఫ్ట్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో.. ''ఏ దేశమైనా తన సరిహద్దులను నిర్ణయించుకుంటుంది. జాతీయ భద్రతను కాపాడుకుంటుంది. అందుకు అనుగుణంగా వలస విధానాన్ని నిర్ణయించుకుంటుంది. ప్రజాస్వామ్యాల్లో దీనిని ప్రజలు, ప్రభుత్వాలు చర్చించి, నిర్వచించుకుంటారు. నేను నా భారత వారసత్వ సంపదతో.. బహుళ సాంస్కృతిక భారతదేశంలో పెరగటం ద్వారా.. అమెరికాలో ఒక వలసగా నా అనుభవంతో నేను రూపొందాను. వలస వచ్చిన ఒక వ్యక్తి.. భారతీయ సమాజానికి, విస్తృత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగేలా ఒక సంపన్నమైన స్టార్టప్‌ను స్థాపించాలని ఆశించగలగేలా.. లేదంటే ఒక బహుళజాతి కార్పొరేషన్‌కు సారథ్యం వహించాలని ఆశించగలిగేలా భారతదేశం ఉండాలన్నది నా ఆకాంక్ష'' అని పేర్కొన్నారు.

సత్య నాదెళ్ల ప్రకటన కూడా సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. ఆయన ప్రకటన మీద ప్రఖ్యాత చరిత్రకారుడు రామచంద్ర గుహ స్పందిస్తూ.. ''నాదెళ్ల చెప్పిన మాటలు నాకు సంతోషం కలిగించాయి. మన సొంత భారతీయ ఐటీ సంస్థల అధిపతులు ఇటువంటి ధైర్యం, మేధస్సును ప్రదర్శించివుంటే బాగుండునని నేను కోరుకుంటున్నా'' అని ట్వీట్ చేశారు.

రామచంద్ర గుహను గత నెలలో కర్ణాటకలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేక నిదర్శనలో పాల్గొన్నపుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు.. అమెరికన్ ఎంటర్‌ప్రైజెస్ ఇన్‌స్టిట్యూట్‌తో పనిచేస్తున్న భారత సంతతి రచయిత సదానంద్ ధూమే.. ''సత్య నాదెళ్ల ఈ అంశం గురించి స్పందించటం కొంచెం ఆశ్చర్యం కలిగించింది. కానీ.. ఆయన భారత పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించటం ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. మైక్రోసాఫ్ట్ వంటి ఒక విజయవంతమైన సంస్థ.. ప్రజలందరినీ వారి మతాలతో నిమిత్తం లేకుండా సమానంగా వ్యవహరించాలనే సూత్రం మీద నిర్మితమైంది'' అని ట్వీట్ చేశారు.

ఎన్‌డీటీవీ ప్రొమోటర్ ప్రణయ్ రాయ్ ట్వీట్ చేస్తూ.. ''ప్రస్తుతమున్న గొప్ప భారతీయుల్లో ఒకరు మాట్లాడుతున్నపుడు మనం జాగ్రత్తగా వినాలి. సత్య నాదెళ్ల మనకు గర్వకారణం - అతడు హృదయమున్న అద్భుత ప్రపంచ నాయకుడు'' అని ప్రశంసించారు.

అయితే.. సత్య నాదెళ్ల ప్రకటన గందరగోళంగా ఉందని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ స్పందించారు. పౌరసత్వ చట్టం మీద వ్యాఖ్యానించే ముందు ఆ చట్టాన్ని అధ్యయనం చేయాలని ఆయనకు సూచించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)