You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ ఆర్టీసీ సకల జనభేరి: ‘ప్రభుత్వంలో విలీనం సహా డిమాండ్లన్నీ సాధించేవరకూ పోరాటం ఆగదు’
- రచయిత, బళ్ల సతీష్, బీబీసీ ప్రతినిధి
- హోదా, ఫోటోలు: వలబోజు శివకుమార్
సమ్మె బాట పట్టిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు బుధవారం హైదరాబాద్లో సకల జనభేరి పేరుతో సభ నిర్వహించారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా తమ డిమాండ్లన్నింటినీ సాధించే వరకూ పోరాటం ఆపబోమని కార్మికులు ప్రకటించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది.
కార్మికులకు మద్దతుగా పలు రాజకీయ పార్టీల నాయకులు దీనికి హాజరయ్యారు. సభ జరిగిన సరూర్నగర్ ఇండోర్ స్టేడియం కార్మికులతో నిండిపోయింది.
కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రాం, టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ నాయకుడు చాడ వెంకట్ రెడ్డి, బీజేపీ నేత వివేక్, ఎంఆర్పీఎస్ నాయకుడు మంద కృష్ణమాదిగతోపాటు పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, కళాకారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు.
సభలో మాట్లాడిన వారంతా ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టారు. కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆర్టీసీని విలీనం చేయడం ఎందుకు సాధ్యం కాదో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు అన్నీ మేనిఫెస్టోలో పెట్టే తీసుకుంటున్నారా అని ప్రశ్నించారు.
కార్మికులకు మద్దతుగా ఆందోళనలు చేస్తామని, అవసరమైతే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని కోదండరామ్ హెచ్చరించారు.
‘‘కేసీఆర్ ఎన్నో పుస్తకాలు చదివానని చెప్పుకుంటాడు. కానీ, ఆయనకు రాజ్యాంగంపై కూడా అవగాహన లేదు’’ అని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఈ సమ్మె విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.
కార్మికుల ఐక్యతను దెబ్బతీయడానికి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని, కార్మికులు అప్రమత్తంగా ఉండాలని ఎల్.రమణ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీని అన్యాక్రాంతం చేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ అవకాశవాది అని, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ నేత వివేక్ అన్నారు.
సకల జన భేరి సభకు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ఆర్టీసీ సిబ్బంది తరలి వచ్చారు. సభలో కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చాలా సార్లు వినిపించాయి.
సభా ప్రాంగణం సరిపోక పోవడంతో బయట కూడా పెద్ద సంఖ్యలో కార్మికులు నిలబడిపోయారు. ఆర్టీసీ కార్మికులతో పాటు వామపక్షాల కార్యకర్తలు కూడా సభకు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఆర్టీసీ సమ్మె బుధవారానికి 26 రోజులకు చేరుకుంది. ప్రస్తుతానికి సమ్మె ముగిసే సంకేతాలు ఏమీ కనిపించడం లేదు.
ప్రభుత్వం, కార్మిక సంఘాలు తమ తమ వాదనలకు కట్టుబడి ఉన్నాయి.
ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమీక్ష నిర్వహించారు.
మరోవైపు, గురువారం అన్ని డిపోల ముందు నిరాహార దీక్షలు చేయాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.
ఇవి కూడా చదవండి:
- నిజాం పాలనలో 1932లో ప్రారంభమైన ఘన చరిత్ర ఉన్న ఆర్టీసీ భవిష్యత్తు ఏంటి?
- సమ్మెలో ఉన్న ఉద్యోగులంతా సెల్ఫ్ డిస్మిస్ అయ్యారన్న కేసీఆర్.. నోటీసులు ఇవ్వకుండా ఎలా తీస్తారన్న యూనియన్లు
- సౌదీ అరేబియా భారతదేశంతో స్నేహం ఎందుకు కోరుకుంటోంది...
- జయలలిత తమిళనాడులో సమ్మె చేస్తున్న ఉద్యోగులను తొలగించినప్పుడేం జరిగింది?
- ఐఎస్ చీఫ్ బగ్దాదీ అండర్వేర్ను ఆ గూఢచారి ఎందుకు దొంగిలించారు?
- 'సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మిక సంఘాలకు చెప్పలేం' - తెలంగాణ హైకోర్టు
- స్టాకర్వేర్: భార్యాభర్తల పరస్పర నిఘా కోసం పెరుగుతున్న స్పైవేర్ వినియోగం.. రెండో స్థానంలో భారత్
- 'తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు జీతాలివ్వాలంటే రూ. 224 కోట్లు కావాలి... మావద్ద 7.5 కోట్లే ఉన్నాయి'
- బగ్దాదీ హతమయ్యాడు... ఇప్పుడు ఐఎస్ పరిస్థితి ఏంటి?
- ‘కడుపు కాలే రోడ్ల మీదకు వచ్చాం... తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమానికి ఆర్టీసీ సమ్మె నాంది కావాలి’
- అబూ బకర్ అల్ బగ్దాదీ ఎవరు? ఖురాన్ బోధించే ‘భక్తుడు’ ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఎలా అయ్యారు?
- తెలంగాణ ఆర్టీసీలో మహిళా ఉద్యోగులు ఏమంటున్నారు?
- నల్లగా ఉన్నావంటూ భర్త చేసే వేధింపులకు తట్టుకోలేక భార్య ఆత్మహత్య
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)