విరాట్ కోహ్లీ: బ్రాడ్‌మన్, సచిన్, సెహ్వాగ్‌ల రికార్డ్ బ్రేక్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌మ్యాచ్‌లో విజృంభించాడు. టెస్టుల్లో తన 26వ సెంచరీని పూర్తిచేసుకున్నాడు.

రెండో రోజు ఆటలో భారత జట్టు 601 పరుగుల వద్ద డిక్లేర్ చేసేటప్పటికి కోహ్లీ 254 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన డాన్ బ్రాడ్‌మన్ రికార్డును బద్దలుకొట్టాడు.

కెప్టెన్‌గా ఉంటూ టెస్టుల్లో అత్యధికసార్లు 150 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా బ్రాడ్‌మన్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ బద్దలుకొట్టాడు.

డాన్ బ్రాడ్‌మన్ ఎనిమిదిసార్లు ఇలాంటి ఫీట్ సాధించగా కోహ్లీ ఇప్పుడాయన్ను అధిగమించి తన కెప్టెన్సీలో తానే తొమ్మిది సార్లు 150కి పైగా పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు.

పాంటింగ్, గ్యారీ సోబర్స్, సంగక్కరల సరసన..

ఈ టెస్టులో విరాట్ కోహ్లీ మరికొన్ని రికార్డులనూ సాధించాడు. ఇంకొందరి రికార్డులను సమం చేశాడు.

కెప్టెన్‌ హోదాలో కోహ్లీకి ఇది 19వ సెంచరీ. దీంతో పాంటింగ్ రికార్డును సమం చేసినట్లయింది. కెప్టెన్‌గా 25 టెస్ట్ సెంచరీలతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ వీరి కంటే ముందున్నాడు.

ఇక భారత్ తరఫున అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డును కోహ్లీ ఈ మ్యాచ్‌లో సాధించాడు. ఇప్పటి వరకు సచిన్, సెహ్వాగ్‌లు ఆరేసి టెస్ట్ డబుల్ సెంచరీలు సాధించి ఇంతవరకు అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ ఇప్పుడు వారిని అధిగమించాడు.

ఈ మ్యాచ్‌లోనే కోహ్లీ 7 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో గ్యారీ సోబర్స్, కుమార సంగక్కరల సరసన 7 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.

కాగా రెండో రోజు ఆట ముగిసేటప్పటికి దక్షిణాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)