'ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం సరైనదే' - రాకేష్ సిన్హా

అమెరికా, రష్యా, పాకిస్తాన్, చైనాల్లో ఏ దేశానికీ భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం లేదని బీజేపీ ఎంపీ రాకేష్ సిన్హా స్పష్టం చేశారు.

ఆర్టికల్ 370 సవరణ పూర్తిగా భారత్‌కి సంబంధించిన అంశమని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై పాకిస్తాన్‌కి మరే ఇస్లామిక్ దేశమూ అండగా లేదని, ఈ వ్యవహారంలో ప్రస్తుతం పాకిస్తాన్ ఒంటరి అని అన్నారు.

భారత్ వైపు నుంచి ఎలాంటి దౌత్యపరమైన తప్పిదమూ జరగలేదన్నారు.

పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించిన తీరు చూస్తుంటే... "నిరాశ చెందిన పిల్లి" మాట్లాడుతున్నట్లుగా ఉందని ఆయన విమర్శించారు.

బీబీసీ హిందీ రేడియో ఎడిటర్ రాజేశ్ జోషీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

వర్తమాన అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో ఇతర దేశాలతో భారత్ చాలా కీలక భూమిక పోషిస్తోందని, పాకిస్తాన్ చేసే తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు.

ఈ అంశంపై చైనా ప్రతిస్పందనను ఆయన తోసి పుచ్చారు.

"ఆర్టికల్ 370 అన్నది కాలక్రమంలో పూర్తిగా కనుమరుగైపోతుందని, అది కూడా కాంగ్రెస్ హయాంలోనే జరుగుతుందని భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడో చెప్పుకొచ్చారు. అయితే, ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ విడతల వారీగా చేసేందుకు ప్రయత్నించగా... తాము మాత్రం ఒకే దెబ్బతో పని పూర్తి చేశాం" అని సిన్హా అన్నారు.

ఇటీవలి కాలంలో కశ్మీర్ ప్రజలకు చైనా స్టాపుల్డ్ వీసాలను జారీ చేసిందన్న విషయాన్ని గుర్తు చేశారు.

"విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా... సరిహద్దుల్లో ఉన్న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లపై హక్కు కోరుకుంటోంది. ఒకవేళ చైనా విస్తరణ కాంక్షను విస్మరించినట్లయితే... అందుకు ప్రతిఫలంగా మన దేశంలో భారీ భూభాగాన్ని కోల్పోవలసి ఉంటుంది. నిజానికి చైనా అనేది పాకిస్తాన్‌కి మిత్ర దేశం కాదు. చైనాతో భారతదేశానికి ఆర్థిక, రాజకీయ సంబంధాలు కొనసాగుతున్నా, అది ఎప్పటికీ భారత్‌కి మిత్ర దేశం కాదు. ఒకవేళ భారతదేశానికి ఉన్న శత్రు దేశాల జాబితా ఉంటే అందులో మొదటి స్థానంలో ఉండే పేరు చైనాదే అవుతుంది" అని రాకేశ్ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)