CSKvMI: ధోనీ లేని ‘చెన్నై’ ఇలా ఉంటుందా

చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్‌లో ఈ జట్టుకు ఉన్న క్రేజే వేరు. సొంత గడ్డపై మ్యాచ్ ఆడితే ఓడిపోవడం చాలా అరుదు.

ఈ సీజన్‌లో ఇంతవరకు సొంతగడ్డపై ఓటమి అన్నది చూడని ఈ జట్టు శుక్రవారం నాటి మ్యాచ్‌‌లో సొంతగడ్డపైనే చిత్తుగా ఓడిపోయింది.

ముంబయి ఇండియన్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోనీ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపించిందన్నది విశ్లేషకుల మాట. జ్వరం కారణంగా చెన్నై కెప్టెన్ ధోనీ ఈ మ్యాచ్‌లో ఆడలేదు.

ఆయన స్థానంలో రైనా నాయకత్వం వహించారు. రవీంద్ర జడేజా కూడా అనారోగ్యంతో ఆడలేదు. డుప్లెసిస్‌ కూడా జట్టులో లేడు.

ముంబయి ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేయగా.. ఆ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన బ్యాటింగ్‌తో మంచి స్కోరుకు బాటలు వేయగా.. బౌలర్లూ మొదటి నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వరుసగా వికెట్లు తీస్తూ ముంబయిని 46 పరుగుల తేడాతో గెలిపించారు.

తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టులో రోహిత్‌ శర్మ మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 48 బంతులు 67 పరుగులతో రాణించడంతో 4 వికెట్లకు 155 పరుగులు చేసింది.

అనంతరం చెన్నై ఛేదనలో మొదటి నుంచి తడబడుతూ సాగింది. వరుసగా వికెట్లు కోల్పోతూ లక్ష్యానికి చాలా దూరంలో చతికిలబడింది. చెన్నై 45 పరుగులకే నాలుగు కీలక వికెట్లు చేజార్చుకుంది. తొలి ఓవర్లోనే షేన్ వాట్సన్‌‌ను అవుట్ చేయడంతో ప్రారంభించిన మలింగ మొత్తం 4 వికెట్లు తీసి ముంబయికి విజయాన్ని అందించారు.

చెన్నైలోని కీలక ఆటగాళ్లు రైనా, రాయుడు, జాదవ్ వంటివారూ తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. నిలకడగా ఆడిన విజయ్ కూడా అవుటవడంతో చెన్నై 66 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో శాంట్నర్‌ 22 పరుగులు, బ్రావో 20 పరుగులతో చెన్నై కనీసం 100 పరుగులు చేరుకోవడానికి కారణమయ్యారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)