ఐపీఎల్-2019 వేలం: జయదేవ్‌‌ ఉనాద్కట్‌‌కు రూ. 8.4 కోట్లు, కాకినాడ కుర్రాడు విహారికి రూ. 2 కోట్లు, సామ్‌ కురాన్‌కు రూ.7.2 కోట్లు

ఐపీఎల్ 2019 సీజన్ కోసం జరుగుతున్న ఆటగాళ్ల వేలంలో కాకినాడకు చెందిన హనుమ విహారి రూ. 2 కోట్లు పలికాడు.

జయదేవ్ ఉనాద్కట్‌ను 8.4 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అలాగే, వరుణ్ చక్రవర్తిని రూ. 8.4 కోట్లకు కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ దక్కించుకుంది.

ఇంగ్లండ్ లెఫ్ట్- హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ సామ్ కురాన్‌ ఈ వేలంలో రూ.7.2 కోట్ల ధర పలికాడు. అతన్ని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కొనుగోలు చేసింది. దీంతో కురాన్ ఇప్పుడు ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఈ వేలం జరుగుతోంది.

రూ. 50 లక్షల కనీస ధరతో వేలంలోకి ప్రవేశించిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారీని దక్కించుకునేందుకు దిల్లీ క్యాపిటల్స్ (దిల్లీ డేర్‌డెవిల్స్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఆఖరికి రూ. 2 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్ అతన్ని చేజిక్కించుకుంది.

మంగళవారం వేలం పాటలో అమ్ముడుపోయిన తొలి ఆటగాడు విహారీనే. గతంలో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు.

కోటి రూపాయల కనీస ధరతో వేలంలోకి ప్రవేశించిన యువరాజ్‌ను కొనుగోలు చేసేందుకు తొలి రౌండ్‌లో ఏ జట్టూ ముందుకు రాలేదు. తర్వాత ముంబయ్ ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది. రూ.50 లక్షల కనీస ధరతో వచ్చిన చటేశ్వర్ పుజారాను కూడా ఇంకా ఎవరూ కొనుగోలు చేయలేదు.

మోహిత్ శర్మను రూ.5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది.

రూ. 20 లక్షల కనీస ధరతో వేలంలోకి వెళ్లిన శివం దూబేను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.

హైదరాబాద్ చేతికి బెయిర్‌స్టో

రూ.1.2 కోట్లతో వృద్ధిమాన్ సాహాను సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. రూ.2.2 కోట్లకు జానీ బెయిర్‌స్టోను దక్కించుకుంది.

శ్రీలంక ఆటగాడు లసిత్ మలింగాను ముంబయి ఇండియన్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.

దక్షిణాఫ్రికా ఆటగాడు కోలిన్ ఇంగ్రామ్‌ను 6.4 కోట్లతో దిల్లీ క్యాపిటల్స్ చేజిక్కించుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)