లోంగేవాలా 'బోర్డర్' యుద్ధం రియల్ హీరో బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చాంద్‌పురి మృతి

ఇండియన్ ఆర్మీ బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ చాంద్‌పురి మృతి చెందారు

చాంద్‌పురి వయసు 78 సంవత్సరాలు. మొహాలీలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

1971లో భారత్-పాకిస్తాన్ మధ్య లోంగేవాలా దగ్గర జరిగిన యుద్ధంలో ఈయన హీరోగా నిలిచారు.

భారత సైన్యంలో అత్యుత్తమ సేవలకు కుల్దీప్ చాంద్‌పురికి మహావీర్ చక్ర, విశిష్ట సేవా మెడల్ ప్రదానం చేశారు.

బ్రిగేడియర్ కుల్దీప్ సింగ్ మృతికి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ట్విటర్‌లో సంతాపం తెలిపారు.

"చాంద్‌పురి వీర సైనికుడు, కీలకమైన లోంగేవాలా యుద్ధంలో ఆయన హీరోగా నిలిచారు" అని అమరీందర్ కీర్తించారు.

బ్రిగేడియర్ చాంద్‌పురి నేపథ్యం

బ్రిగేడియర్ చాంద్‌పురి 1940 నవంబర్ 22న ప్రస్తుత పాకిస్తాన్‌లో జన్మించారు. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం పంజాబ్‌లోని బాలాచౌర్‌ దగ్గర చాంద్‌పూర్ గ్రామానికి చేరుకుంది.

కుల్దీప్ చాంద్‌పురి హోషియార్‌పూర్‌లోని ప్రభుత్వ కళాశాలలో చదువుకున్నారు. 1962లో భారత సైన్యంలోని పంజాబ్ రెజిమెంట్‌లో లెప్టినెంట్‌గా చేరారు.

పాకిస్తాన్‌తో జరిగిన 1965, 1971 యుద్ధాల్లో కుల్దీప్ పాల్గొన్నారు. చాలా కాలం పాటు ఐక్యరాజ్యసమితి అత్యవసర సేవల్లో కూడా పనిచేశారు.

లోంగేవాలా యుద్ధంలో బ్రిగేడియర్ చాంద్‌పురి, ఆయన సహచరుల సాహసాల ఆధారంగానే బాలీవుడ్ మూవీ 'బోర్డర్‌' తెరకెక్కింది. ఈ సినిమాలో కుల్దీప్ చాంద్‌పురి పాత్రను నటుడు సన్నీడియోల్ పోషించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)