You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బాలకృష్ణ దోషి: ‘ఆర్కిటెక్చర్ నోబెల్’ గెల్చుకున్న భారతీయుడు
తక్కువ ఖర్చుతో ఇళ్లు నిర్మించడంలో వినూత్నమైన కృషి చేసిన భారతదేశానికి చెందిన 90 ఏళ్ల బాలకృష్ణ దోషి ఈ ఏడాది ప్రతిష్టాత్మక ప్రిట్జ్కర్ పురస్కారం గెల్చుకున్నారు.
ఆర్కిటెక్చర్లో అత్యున్నత గౌరవంగా భావించే ఈ పురస్కారాన్ని గెల్చుకున్న మొట్టమొదటి భారతీయుడు ఆయనే.
ఆ పురస్కారం కింద ఆయనకు సుమారు రూ.65 లక్షలు లభిస్తాయి. మే లో టొరంటోలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
పారిస్లో శిష్యరికం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 1947లో ఆయన ముంబైలోని సర్ జేజే స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో ఆర్కిటెక్చర్ విద్యను అభ్యసించడం ప్రారంభించారు.
1950లలో ఆర్కిటెక్చర్ మార్గదర్శిగా భావించే లె కార్బుసియర్తో పని చేయడానికి పారిస్ వెళ్లారు.
కార్బుసయర్తో కలిసి పని చేసిన అనంతరం 1954లో భారతదేశానికి తిరిగి వచ్చారు. చండీగఢ్, అహ్మదాబాద్లలో పలు ప్రాజెక్టులపై పని చేశారు.
అనేక సంస్థలు, గృహ నిర్మాణ ప్రాజెక్టులు, ప్రభుత్వ కార్యాలయాలు, గ్యాలరీలు, ప్రైవేట్ నివాసాలకు దోషి రూపకల్పన చేశారు.
దక్షిణాదిన బెంగళూరులోని అత్యున్నత మేనేజ్ మెంట్ స్కూల్ ఆయన చేతిలోనే రూపుదిద్దుకుంది.
అలాగే ఇండోర్లో తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణ ప్రాజెక్టును రూపొందించింది కూడా ఆయనే. ఆ పథకం కింద నిర్మించిన 6,500 ఇళ్లలో ప్రస్తుతం సుమారు 80 వేల మంది మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు.
కింది తరగతి ప్రజల కోసం కూడా తక్కువ ఖర్చుతో మంచి ఇల్లు నిర్మించాలనేది తన లక్ష్యంగా ఉండాలని దోషి 1954 లోనే భావించారు.
స్వాతంత్ర్యానంతర భారతదేశంలో అత్యంత ప్రభావశీలురైన ఆర్కిటెక్ట్లలో ఆయన ఒకరు. అంతర్జాతీయ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయన స్థానిక సంప్రదాయాలతో మేళవించారు.
''బాలకృష్ణ దోషి ఎలాంటి ఆడంబరాలు లేని, మూసధోరణులకు దూరంగా ఉండే డిజైన్లను సృష్టించారు. పట్టణాల ప్లానింగ్లో కళ, టెక్నిక్.. అన్నీ దృష్టిలో పెట్టుకొని నిర్మాణాలు చేశారు'' అని ప్రిట్జ్కర్ జ్యూరీ పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)