పద్మావత్: ఎందుకిన్ని అల్లర్లు? నిరసనలు?

ఎన్నో నెలలుగా వివాదాల్లో నలిగిపోతున్న బాలీవుడ్ చిత్రం 'పద్మావత్' ఎట్టకేలకు నేడు విడుదలైంది.

పద్నాలుగో శతాబ్దానికి చెందిన హిందూ మహా రాణి, ముస్లిం రాజుకు సంబంధించిన కథను ఈ సినిమా ప్రస్తావిస్తుంది.

రాజ్‌పుట్ మహారాణి పాత్రను అవమానకరంగా చిత్రీకరించారన్నది పద్మావత్ సినిమాపై ఉన్న ప్రధాన ఆరోపణ.

దాంతో కర్ణి సేన లాంటి కొన్ని సంఘాలు సినిమాను నిషేధించాలని ఉద్యమించాయి. ఆ సినిమా వివాదాస్పదం కావడానికి దారితీసిన పరిణామాలు, ఆ నిరసనల పరంపరను ఈ కింది వీడియోలో చూడండి.

2017జనవరిలో కర్ణి సేన సభ్యులు పద్మావతి సినిమా సెట్‌ను ధ్వంసం చేయడంతో పాటు భన్సాలీపై దాడి చేయడంతో వివాదం మొదలైంది.

తొలుత గత డిసెంబర్ 1న సినిమాను విడుదల చేయాలని చూశారు. దాంతో నవంబర్‌లో నిరసన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రాజ్‌పుట్ సంఘాల సభ్యులు భన్సాలీ దిష్టిబొమ్మలను తగలబెట్టారు.

రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, హరియాణా లాంటి అనేక రాష్ట్రాల్లో రాజ్‌పుట్ సంఘాల సభ్యులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

ఎవరి మనోభావాలూ దెబ్బతినకుండా సినిమాలో మార్పులు చేసేవరకూ అది విడుదల కావడానికి వీల్లేదని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే అన్నారు.

భన్సాలీ తలను తెచ్చిన వారికి ఏకంగా దాదాపు రూ.10కోట్ల నజరానాను ఓ బీజేపీ నేత ప్రకటించారు.

కోర్టు ఏం చెప్పింది?

పద్మావత్‌ విడుదలపై నాలుగు రాష్ట్రాలు విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ జనవరి 18న సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

సెన్సార్ బోర్డు ఒప్పుకున్నప్పుడు రాష్ట్రాలు సినిమాను అడ్డుకోవడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించింది. దాంతో మళ్లీ నిరసనలు చెలరేగాయి.

గుజరాత్‌లో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించి, వాహనాలను తగలబెట్టారు. ఓ థియేటర్‌ను ధ్వంసం చేశారు.

ఈ నేపథ్యంలో చిత్ర బృందం కూడా కొందరు చరిత్రకారులకు సినిమాను చూపించి వారి సూచనలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా పద్మావత్‌ను విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)