You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విస్తృత ధర్మాసనానికి 'స్వలింగ సంపర్కం' కేసు
భారతదేశంలో స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.
ఈ అంశంపై మరింత చర్చ జరగాలని భావించిన సుప్రీంకోర్టు బెంచ్ దీనిని విస్తృత ధర్మాసనానికి నివేదించింది.
చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ చంద్రసూద్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది.
ఐపీసీ 377 వల్ల తలెత్తే సమస్యలపై విస్తృత చర్చ జరగాలని న్యాయస్థానం అభిప్రాయపడింది. సెక్షన్ 377 స్వలింగ సంపర్కాన్ని అసహజమైనదిగానూ, నేరంగానూ పరిగణిస్తోంది. గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.
ఈ కేసును విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
'గే సెక్స్'ను నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ నవ్తేజ్ సింగ్ జోహార్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారించింది.
జోహార్ తరఫున సీనియర్ న్యాయవాది అరవింద్ వాదనలు వివిపించారు.
'సెక్స్ భాగస్వామిని ఎంచుకోవడం పౌరుల ప్రాథమిక హక్కుల్లో భాగం' అని ఇటీవల 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా న్యాయవాది అరవింద్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అంతేకాదు..ఆర్టికల్ 377 రాజ్యాంగ విరుద్ధమని 2009లో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఆయన సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
అయితే, 2017లో సుప్రీంకోర్టు దిల్లీ హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. సెక్షన్ 377 రాజ్యాంగబద్ధమేనని స్పష్టం చేసింది.
2014లో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని గతంలో దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
తాజాగా నవ్తేజ్ సింగ్ జోహార్ వేసిన పిటిషన్ను ఇవాళ విచారించింది. ఈ కేసును విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేసింది.
దాంతో స్వలింగ సంపర్కం అంశంపై విస్తృత ధర్మాసనం విచారించి తీర్పు వెలువరించనుంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)