You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు, ఒక్క రోజే 270 మందికి పైగా మృతి, అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..
లెబనాన్ రాజధాని బేరూత్ బాంబు మోతలతో దద్దరిల్లుతోంది. హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేసింది.
అందుకు ప్రతిగా, ఉత్తర ఇజ్రాయెల్పైకి హిజ్బుల్లా క్షిపణులను ప్రయోగించింది.
దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో 270 మందికి పైగా మరణించారని, 1000 మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది.
మృతుల్లో చిన్నారులు, మహిళలు, వైద్య సిబ్బంది కూడా ఉన్నారని వెల్లడించింది.
ఇజ్రాయెల్ అత్యంత భారీ స్థాయిలో వైమానిక దాడులతో లెబనాన్పై విరుచుకుపడుతోంది.
ఇవాళ (సెప్టెంబర్ 23) ఒక్కరోజే లెబనాన్లో హిజ్బుల్లాకు చెందిన దాదాపు 800 లక్ష్యాలపై దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది.
అంతకు ముందు, లెబనాన్లో హిజ్బుల్లా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాల నుంచి సామాన్య ప్రజలు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. వైమానిక దాడులు ఇకపై అత్యంత తీవ్ర స్థాయిలో ఉంటాయని కూడా చెప్పింది.
లెబనాన్లోని ఈశాన్య ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఒక వ్యక్తి మరణించారని, చాలా మంది గాయపడ్డారని ఆ దేశ మీడియా తెలిపింది.
ఇళ్లు వదిలి వెళ్లిపోతున్న ప్రజలు
ఇజ్రాయెల్, లెబనాన్ పూర్తి స్థాయి యుద్ధానికి దిగొద్దని, రెండు పక్షాలూ వెనక్కి తగ్గాలని అమెరికా, యూరోపియన్ యూనియన్, ఐక్యరాజ్య సమితి సహా అనేక దేశాలు విజ్ఞప్తి చేశాయి.
తాజా ఘర్షణల కారణంగా ఇప్పటి వరకు దాదాపు 90,000 మంది ప్రజలు దక్షిణ లెబనాన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)