You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టీ తాగుదామని రైలు దిగి, 20 ఏళ్లు మగ్గిపోయిన తెలుగోడి వ్యధ
దాదాపు 20 ఏళ్ల కిందట ఉత్తరాంధ్రలోని ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి పని కోసం పాండిచ్చేరికి రైలులో బయలుదేరారు కోనేరు అప్పారావు. అప్పుడు ఆయన వయసు సుమారు 40 ఏళ్లు.
ఆ రైలు తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఒక స్టేషన్లో ఆగినప్పుడు, అప్పారావు టీ తాగుదామని దిగారు. తిరిగి ఎక్కేలోపు ఆ రైలు కదిలిపోయింది.
రైలు మిస్సయిన అప్పారావుకు సాయం చేస్తానని ముందుకొచ్చిన ఓ వ్యక్తి, ఆయనను తన మేకల మందకు కాపరిగా మార్చేశారు.
కోనేరు అప్పారావు ప్రస్తుతం తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఓల్డేజ్ హోంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈయన కుటుంబీకులు ఎవరో కనుక్కునేందుకు అటు తమిళనాడు, ఇటు ఆంధ్రపదేశ్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తనది పార్వతీపురం సమీపంలోని జమ్మిడివలసని ఒకసారి, ఒడిశాలోని కొరాపుట్ జిల్లా అలమండ మండలంలోని జమ్మడవలస అని మరోసారి, అదే మండలంలోని జంగిడివలసని ఇంకోసారి చెప్పారు.