టీ20 ప్రపంచ కప్‌: సంబరాలు.. కన్నీళ్లు.. మరెన్నో చిత్రాలు..

17 ఏళ్ల తర్వాత భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. జూన్ 29 జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు సంబరాలు మిన్నంటాయి. మైదానంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్‌ పాండ్యాల భావోద్వేగం అందరినీ కదిలించింది.

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న తర్వాత, రోహిత్, కోహ్లీలు టీ20 ఇంటర్నేషనల్స్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు.

ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత క్రికెటర్ల సంబరాలతో పాటు, ఈ మ్యాచ్‌లోని కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలకు సంబంధించిన చిత్రాలను చూద్దాం..

బౌండరీ లైన్ వద్ద పట్టిన క్యాచ్‌తో..

ఈసారి కూడా టీమిండియా చేతుల్లోంచి మ్యాచ్ వెళ్లిపోతుందేమో అని అనిపిస్తున్న సమయంలో బౌలర్లు రంగంలోకి దిగారు. అప్పుడు మిల్లర్ మైదానంలో ఉన్నాడు.

‘కిల్లర్ మిల్లర్’గా పేరున్న అతడు ఏదైనా చేయగలడు. కానీ, ఈ సమయంలో సూర్యకుమార్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

ఆఖరి ఓవర్‌లో సిక్స్ వెళ్లే తొలి బంతిని బౌండరీ లైన్ వద్ద అతడు అందుకున్న తీరు అభిమానుల్లో ఆశలు కలిగించేలా చేసింది. ఆ క్యాచ్‌కు మిల్లర్ అవుట్ కావడంతో, మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది.

రోహిత్ కల నెరవేరిన వేళ..

ప్రపంచ కప్‌ను గెలవడం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అతిపెద్ద కల. ఈ కల నెరవేరడంతో రోహిత్ భావోద్వేగానికి లోనయ్యారు.

మైదానంపై పడుకుని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన కుమార్తెను భుజాలపై ఎత్తుకుని మైదానమంతా తిరిగారు. హార్దిక్ పాండ్యాను ఎత్తుకుని హగ్ చేసుకున్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న హార్దిక్ పాండ్యా

భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన హార్డిక్ పాండ్యా మ్యాచ్ ముగిసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నారు.

రోహిత్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, క్లాసెన్‌ను, మిల్లర్‌ను, రబడను విజయవంతంగా మైదానం నుంచి బయటికి పంపాడు పాండ్యా.

చివరి ఓవర్‌లో ఆఖరి బంతిని వేసిన తర్వాత హార్దిక్ పాండ్యా మైదానంలోనే కూలబడిపోయాడు.

పాండ్యాను రోహిత్, విరాట్ కోహ్లీ, బుమ్రాలు గట్టిగా హత్తుకున్నారు.

చిన్నపిల్లాడిలా కోచ్ రాహుల్ ద్రవిడ్ సంబరాలు

భారత జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను అభిమానులు అంత సంతోషంగా చూడటం ఇదే తొలిసారేమో అనిపిస్తోంది.

జట్టులో సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రపంచ కప్ గెలవాలనే కోరికను నెరవేర్చుకోలేకపోయిన ద్రవిడ్, కోచ్‌గా ఆ కలను సాకారం చేసుకున్నారు.

ద్రవిడ్‌ను టీమిండియా క్రికెటర్లంతా ఎత్తుకుని గాలిలోకి లేపారు.

ఈ ప్రపంచ కప్ జర్నీలో భారత జట్టుకు అత్యంత ముఖ్యమైన ఆటగాడిగా జస్‌ప్రీత్ బుమ్రా నిలిచాడు. ప్రతి మ్యాచ్‌లో వ్యూహాత్మక సమయాల్లో వికెట్లను పడగొట్టాడు.

సగటున కేవలం 4 పరుగులే ఇచ్చాడు బుమ్రా. దీంతో, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును బుమ్రా దక్కించుకున్నాడు.

జెండా ఎగరవేస్తూ సిరాజ్ సంబరాలు

భారత జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ మహమ్మద్ సిరాజ్ సంబరాలు చేసుకున్నాడు. మ్యాచ్ తర్వాత సిరాజ్ చాలా భావోద్వేగంగా కనిపించాడు.

గాయం తర్వాత తిరిగొచ్చిన పంత్‌ ఆనందానికి అవధుల్లేవు..

2022లో జరిగిన కారు ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న రిషబ్ పంత్, కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చాడు.

ఈ టోర్నమెంట్ అంతా అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్‌తో పాటు, వికెట్లను తీయడంలోనూ సహకరించాడు.

ప్రపంచ కప్‌తో కుల్దీప్ యాదవ్

ఇండియన్ స్పిన్నర్లు ఈ టోర్నమెంట్‌లో బాగా ఆడారు. గెలుపు తర్వాత ప్రపంచ కప్‌ను పట్టుకుని స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సంబరాలు చేసుకున్నాడు.

గెలుపు ఉత్సాహంలోనే రిటైర్మెంట్ ప్రకటన

భారత క్రికెట్‌లో ఇద్దరు లెజెండ్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మలు ఈ గెలుపు తర్వాత టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించారు.

భారత్‌కు ఈ ప్రపంచకప్ గెలవడం ఎంత అవసరమో ఇదే తెలియజేస్తుంది. సెమీ ఫైనల్స్‌లో రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఫైనల్ ఇన్నింగ్స్‌లో భారత్ మంచి స్కోరు చేసేందుకు జట్టుకు విరాట్ కోహ్లీ సహకరించాడు.

టోర్నమెంట్‌లో ఏ మ్యాచ్‌ ఓడిపోకుండా గెలిచిన తొలి జట్టు

టీ20 పురుషుల ప్రపంచ కప్‌ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా గెలిచిన తొలి జట్టు భారత్‌నే. ఈ టోర్నమెంట్‌లో ఆడిన 8 మ్యాచ్‌లలోనూ భారత్ గెలిచింది.

కన్నీళ్లు పెట్టుకున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లు

మ్యాచ్ చివరి వరకు పోరాడిన దక్షిణాఫ్రికా క్రికెటర్లు, ఓటమి తర్వాత మైదానంలోనే కన్నీళ్ల పెట్టుకున్నారు.

వారిని ఓదార్చేందుకు రిషబ్ పంత్ వెళ్లి, అక్కడి వాతావరణాన్ని మార్చాడు.

దక్షిణాఫ్రికా అయిదు సార్లు వన్డే వరల్డ్ కప్‌లో, రెండుసార్లు టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్‌ వరకు వెళ్లి ఓటమి పాలైంది.

దక్షిణాఫ్రికాకు ఇదే తొలి వరల్డ్ కప్ ఫైనల్. ఈ ఫైనల్‌లో కూడా దక్షిణాఫ్రికా ఓటమిని చూడాల్సి వచ్చింది.

గ్రౌండ్‌లోనే డ్యాన్సులు వేసిన కోహ్లీ, అర్షదీప్ సింగ్

మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ, అర్షదీప్ సింగ్‌లు గ్రౌండ్‌లోనే డ్యాన్సులు వేశారు.

వీరితో పాటు మిగతా ప్లేయర్లు సైతం చిందులేశారు.

భారత క్రికెటర్లకు ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు

ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్న భారత క్రికెటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు.

‘‘మన జట్టు తనదైన స్టయిల్‌లో టీ20 ప్రపంచ కప్‌ను ఇంటికి తీసుకొచ్చింది. భారత క్రికెట్ టీమ్‌ను చూసి చాలా గర్వపడుతున్నా. ఈ మ్యాచ్ చరిత్రాత్మకం’’ అంటూ ప్రధాని మోదీ అన్నారు.

‘‘సూర్య, ఏమన్నా క్యాచా! రోహిత్, మీ నాయకత్వానికి ఈ గెలుపు ఒక నిదర్శనం. రాహుల్, నాకు తెలుసు టీమిండియా మీ మార్గనిర్దేశాన్ని మిస్ అవుతుంది. నీలం రంగులో ఉన్న ఈ అద్భుతమైన వ్యక్తులు దేశాన్ని గర్వపడేలా చేశారు’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)