జీ20 లోగోలో ‘కమలం’ ఏమిటి.. అసలు మోదీ, బీజేపీలకు సిగ్గులేదా అంటూ కాంగ్రెస్ ప్రశ్నలు

    • రచయిత, ఇక్బాల్ అహ్మద్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జీ-20 గ్రూప్‌కు అధ్యక్షత వహించేందుకు ముందుగా దీనికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్‌సైట్‌లను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.

అయితే, లోగోలో ‘‘కమలం’’ గుర్తు కనిపించడంపై ప్రధాన పత్రిపక్షమైన కాంగ్రెస్ అభ్యంతరాలు వ్యక్తంచేసింది.

‘‘70ఏళ్ల క్రితం భారత్ తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ.. కాంగ్రెస్ జెండాను భారత్ జెండాగా మార్చాలనే ప్రతిపాదనను తిరస్కరించారు’’అని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, మీడియా విభాగం ఇన్‌చార్జి జైరాం రమేశ్ గుర్తుచేశారు.

‘‘కానీ, నేడు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల గుర్తే, భారత్ అధ్యక్షత వహిస్తున్న జీ-20 సదస్సు లోగోగా మారిపోయింది. నిజంగా షాక్ తగిలినట్లు అనిపిస్తోంది. తమను తాము ప్రచారం చేసుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్ని కూడా సిగ్గులేకుండా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు ఉపయోగించుకుంటున్నారు’’అని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజాద్ పూనావాలా స్పందించారు.

‘‘మోదీని వ్యతిరేకించాలని అనుకునేవారు.. జాతీయ గుర్తులు, పువ్వులను ఎందుకు విమర్శిస్తున్నారు’’అని ఆయన ప్రశ్నించారు.

‘‘తర్వాత ఏమిటి? మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను తన పేరు నుంచి కమలాన్ని తీసేయాలని చెబుతారా? మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా కూడా తన పేరు నుంచి రాజీవ్‌ను తీసేయాలా?’’అని ఆయన వ్యాఖ్యానించారు.

జీ20 అధ్యక్ష స్థానానికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్‌సైట్‌లను మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆ లోగోలో కమలం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ లోగోపై మోదీ స్పందిస్తూ.. ‘‘జీ20 లోగో కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు. ఇది ఒక సందేశం. ఇది ఒక భావోద్వేగం. మన నరనరాల్లో ఇది జీర్ణించుకుపోయింది. మన ఆలోచనల్లో భాగమైన తీర్మానం ఇది. ఈ లోగో, థీమ్ ద్వారా మనం ప్రపంచానికి సందేశం ఇస్తున్నాం’’అని చెప్పారు.

‘‘యుద్ధం నుంచి విముక్తి కోసం బుద్ధుడు ఇచ్చిన సందేశం, అహింసకు దూరంగా ఉండేందుకు మహాత్మా గాంధీ చూపిన పరిష్కారాలు దీని ద్వారా ప్రపంచానికి మళ్లీ మనం అందిస్తున్నారు. ఇది ప్రపంచంలో నూతనోత్తేజాలు నింపుతుంది’’అని ఆయన అన్నారు.

కమలాన్ని ఆధ్యాత్మిక వారసత్వ సంపదగా మోదీ అభివర్ణించారు. ‘‘మన విశ్వాసాలు, మన నమ్మకాలకు ఈ ఆధ్యాత్మిక వారసత్వ సంపద అద్దం పడుతోంది’’అని మోదీ వివరించారు.

కమలాన్ని ఆకాంక్షకు చిహ్నంగా మోదీ చెప్పారు. ‘‘నేడు కోవిడ్-19 దుష్ప్రభావాలను ప్రపంచ దేశాలు చవిచూస్తున్నాయి. ఒకవైపు ఘర్షణలు, మరోవైపు ఆర్థిక మందగమనం అతలాకుతలం చేస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో కొత్త ఆశలను ఈ జీ20 లోగో చిగురింపచేస్తోంది’’అని ఆయన వివరించారు.

వెల్లువెత్తిన విమర్శలు

కమలం గురించి బీజేపీ, మోదీ ఏం చెబుతున్నప్పటికీ, ఈ లోగోను ఆవిష్కరించిన వెంటనే సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రముఖ రచయిత సలీల్ త్రిపాఠి స్పందిస్తూ.. ‘‘జీ20 సదస్సు చిహ్నంగా ఒక రాజకీయ పార్టీ గుర్తును ఎలా పెడతారు? ఈ గ్రూపులోని మిగతా 19 దేశాలు మోదీ చర్యలను ఆమోదిస్తున్నాయా? అయితే, అవునని, కాకపోతే కాదని చెప్పాలి’’అని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు జర్నలిస్టు ప్రమీలా ఫిలిపోస్ కూడా కమలాన్ని చిహ్నంగా చూపించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు.

‘‘మోదీ ఎప్పుడూ ఎన్నికల గురించే ఆలోచిస్తుంటారు. అందుకే ఈ లోగోలో వికసించిన కమలాన్ని కలిపి ఆవిష్కరించినప్పుడు నేనేమీ ఆశ్చర్యపోలేదు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

జీ20 అధ్యక్ష స్థానంలో భారత్..

ప్రపంచంలోని ప్రధానంగా అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమే జీ20. 1990ల్లో ఆర్థిక సంక్షోభం నడుమ జీ20 పురుడు పోసుకుంది. ముఖ్యంగా ఆ సంక్షోభం తూర్పు, ఆగ్నేయాసియా దేశాలపై ఎక్కువ ప్రభావం చూపింది.

మధ్యాదాయ దేశాలతో తమతో కలుపుకుంటూ ప్రపంచ దేశాల్లో ఆర్థిక స్థిరత్వం నెలకొల్పడమే ఈ గ్రూపు లక్ష్యం.

60 శాతం ప్రపంచ జనాభా, 85 శాతం ప్రపంచ స్థూల ఉత్పత్తి (జీడీపీ), 75 శాతం ప్రపంచ వాణిజ్యాలకు జీ20 ప్రాతినిధ్యం వహిస్తోంది.

మొదట్నుంచీ ఈ గ్రూపులో భారత్‌కు సభ్యత్వం ఉంది.

ఈ గ్రూపులో భారత్‌తోపాటు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేసియా, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియా, బ్రిటన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రూపుకు ఇండోనేసియా అధ్యక్ష స్థానంలో ఉంది.

ఈ ఏడాది జీ20 వార్షిక సదస్సు నవంబరు 15-16 తేదీల్లో ఇండోనేసియాలోని బాలీలో జరుగనుంది. దీనికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా ప్రపంచ నాయకులు హాజరు కాబోతున్నారు.

వివాదం ఏమిటి?

వచ్చే ఏడాది భారత్ ఈ సదస్సును కశ్మీర్‌లో నిర్వహించాలని భావించింది. దీని కోసం కశ్మీర్ ప్రభుత్వం గత జూన్‌లో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటుచేసింది.

అయితే, దీనిపై వివాదం రాజుకొంది.

సదస్సును కశ్మీర్‌లో నిర్వహించడంపై పాకిస్తాన్, చైనా, తుర్కియా, సౌదీ అరేబియా అభ్యంతరం వ్యక్తంచేశాయి. దీంతో దీన్ని దిల్లీకి మార్చాలని భారత్ నిర్ణయించింది.

సదస్సులో భాగంగా బంగ్లాదేశ్, ఈజిప్టు, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ల ప్రతినిధులకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. జీ20కు శాశ్వత సచివాలయం లాంటిది ఏమీలేదు.

షేర్పాలుగా పిలిచే జీ20 దేశాల ప్రతినిధులు సమన్వయంతో ఈ సదస్సు అజెండాను నిర్ణయిస్తారు. వీరు కేంద్ర ఆర్థిక మంత్రులు, రిజర్వు బ్యాంకు గవర్నర్ల సాయంతో అజెండాను నిర్ణయిస్తారు.

భారత్‌కు ముఖ్యమైన బాధ్యతలు

జీ20 అధ్యక్ష హోదాతోపాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీవో) చైర్మన్‌షిప్ కూడా భారత్‌కు దక్కింది. ఎస్‌సీవో సదస్సు వచ్చే ఏడాది భారత్‌లో నిర్వహించనున్నారు.

మరోవైపు 2022 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి భధ్రతా మండలి అధ్యక్ష స్థానం కూడా భారత్‌కు దక్కనుంది. ప్రస్తుతం భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ కొనసాగుతోంది.

మరోవైపు జీ7లోనూ భారత్‌కు చోటు దక్కుతుందని వార్తలు వస్తున్నాయి.

ప్రపంచంలో ఆర్థికంగా శక్తిమంతమైన ఏడు దేశాల కూటమే జీ7. ఈ ఏడాది జర్మనీలో ఈ సదస్సు జరగబోతోంది. దీని కోసం భారత్‌ను జర్మనీ ఆహ్వానించింది.

ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న బ్రిటన్‌ను గత సెప్టెంబరులో భారత్ అధిగమించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)