హైదరాబాద్‌: భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి, ప్రమాదానికి కారణమేంటి?

(హెచ్చరిక: కలచివేసే అంశాలు)

హైదరాబాద్ నగరంలో చార్మినార్ సమీపంలో గుల్జార్ హౌస్‌ లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది మరణించినట్టు తెలంగాణ అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి ప్రకటించారు.

ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు చెప్పారు.

ఆదివారం ఉదయం 6 గంటల 16 నిమిషాల సమయంలో చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ చౌరస్తా వద్ద జీ+2 భవనంలో మంటలు చెలరేగాయని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.

ముందు గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు వ్యాపించాయని, తరువాత పై అంతస్తుకు పాకాయని చెప్పారు.

మొదటి అంతస్తులో 17మంది చిక్కుకుపోయారని, అగ్నిమాపక సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారని చెప్పారు.

మొత్తం 11 అగ్నిమాపక వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబో, 17 మంది అగ్నిమాపక అధికారులు, 70మంది సిబ్బంది మంటల్లో చిక్కుకున్నవారిని కాపాడి, మంటలను అదుపులోకి తేవడానికి 2 గంటల సమయం పట్టిందని చెప్పారు.

ఇరుకు దారి

మృతుల్లో 8 మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. వీరంతా పదేళ్లలోపు పిల్లలేనని ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి మీడియాకు చెప్పారు.

‘‘బిల్డింగ్ పురాతనమైనది. బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు చాలా సన్నని దారి మాత్రమే ఉంది. లోపల రెండు షాపులు ఉన్నాయి. అన్నీ దగ్ధమైపోయాయి. దాంతోపాటు నివాస సముదాయం కూడా ఉంది. దీంతో మొదటి, రెండో అంతస్తులకు వెళ్లేందుకు సరైన దారి లేకపోయింది’’ అని డీజీ చెప్పారు.

ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి

హైదరాబాద్‌ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రధాని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు.

మెరుగైన వైద్యం అందించండి: సీఎం

పాతబస్తీ మీర్‌చౌక్‌లో భారీ అగ్నిప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఘటనా స్థలాన్ని సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ''గుల్జార్ హౌస్‌ సమీపంలో దురదృష్టవశాత్తూ అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో అక్కడ 17 మంది ఉన్నారు. వారిలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. బాధిత కుటుంబాలతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారు. వారికి అవసరమైన ఏర్పాట్లన్నీ ప్రభుత్వం చేస్తోంది'' అని చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)