You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మిస్ వరల్డ్కు ఏ ప్రశ్న వేశారు, ఆమె ఏం చెప్పారు, విజేతను ఎలా ఎంపిక చేశారు?
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
మిస్ వరల్డ్ కార్యక్రమం మే 31 శనివారం సాయంత్రం హైదరాబాద్లోని హైటెక్స్లో కళ్లు మిరిమిట్లు గొలిపేలా జరిగింది.
థాయిలాండ్కు చెందిన ఒపల్ సుచాత చౌసీ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు.
ముందుగా మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని వినాయకుడి పూజతో ప్రారంభించారు.
తరువాత 108 మంది పోటీదారులు ఒకేసారి వేదికపై కనిపించారు.
నాలుగు ఖండాల కేటగిరీల వారీగా ర్యాంప్ వాక్ చేశారు.
కార్యక్రమంలో భాగంగా గత 20 రోజుల్లో మిస్ వరల్డ్ పోటీదార్ల పర్యటన దృశ్యాలను ప్రదర్శించారు.
తెలంగాణ టూరిజాన్ని ప్రోత్సహించే వీడియోలు పెట్టారు.
మిస్ వరల్డ్ జడ్జీలు ఎవరు?
మొత్తం 9 మంది ఈ కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరించారు.
వారిలో మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లీ, నటుడు సోనూ సూద్, మేఘా ఇంజినీరింగ్ డైరెక్టర్ సుధా రెడ్డి, నటుడు రానా దగ్గుబాటి, తెలంగాణ ప్రభుత్వ అధికారి జయేష్ రంజన్, 2017 మిస్ వరల్డ్ మానుషి ఛిల్లర్, మహేశ్బాబు భార్య, మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్, 2014 మిస్ ఇంగ్లండ్ కరినా టర్రెల్, 72వ మిస్ వరల్డ్ అఫీషియల్ స్టేజ్ డైరెక్టర్ డోనా వాల్ష్ జడ్జీలుగా వ్యహరించారు.
ఎలా ఎంపిక చేశారు?
భారత్కు చెందిన నందిని గుప్తా సహా 108 దేశాల నుంచి యువతులు ఈ 'మిస్ వరల్డ్' పోటీలకు హాజరయ్యారు.
ప్రాథమిక పోటీల తర్వాత మూడు దశల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్కు ఒక్కో ఖండం నుంచి పదేసి మంది (అమెరికా, కరీబియన్స్ నుంచి 10, ఆఫ్రికా నుంచి 10, ఐరోపా నుంచి 10, ఏషియా, ఓషీనియా నుంచి 10 మంది) చొప్పున మొత్తం 40మందిని ఎంపిక చేశారు. తరువాత ఒక్కో ఖండం నుంచి ఎంపికైన 10 మంది నుంచి రెండో దశకు ఐదుగురిని (టాప్ 5) ఎంపిక చేశారు.
అనంతరం ప్రతి ఖండం నుంచి ఎంపికైన ఐదు గురిలో మూడో దశలో ఇద్దరిని (టాప్ 2) ఎంపిక చేశారు. అంటే, ఖండానికి ఇద్దిరి చొప్పున పోటీలో మొత్తం 8 మంది నిలిచారు.
వీరిలో ముందుగా నిర్వహించిన రకరకాల పోటీల నుంచి ఎంపికైన వారితో పాటు, జడ్జీలు అప్పటికప్పుడు ఎంపిక చేసిన వారూ ఉన్నారు.
మిస్ వరల్డ్ ఇండియా నందినీ గుప్తా టాప్ 20లో, అంటే ఏషియా, ఓషీనియా కేటగిరీలో టాప్ 5లో నిలిచారు.
కానీ, తరువాత కాంటినెంట్ టాప్ 2లో ఎంపిక కాలేదు.
చివరగా టాప్ 8లో నిలిచిన వారు ఎవరంటే...
- బ్రెజిల్
- మార్టినిక్
- ఇథియోపియా
- నమీబియా
- పోలాండ్
- యుక్రెయిన్
- ఫిలిప్పీన్స్
- థాయిలాండ్
వీరందరినీ మీరే మిస్ వరల్డ్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు? అని జడ్జీలు ఒకే ప్రశ్న అడిగారు.
ఆ ప్రశ్నకు 45 సెకన్లలో సమాధానం చెప్పాలని కోరారు.
మార్టినిక్, ఇథియోపియా, పోలాండ్, థాయిలాండ్ దేశాల అమ్మాయిలు చివరి రౌండ్ వరకూ వచ్చారు.
వారిలో థాయిలాండ్ అమ్మాయి విజేత కాగా, నాలుగవ స్థానంలో మార్టినిక్ నుంచి ఆరెలీ జోయాచిమ్ (Aurelie Joachim), 3వ స్థానంలో పోలాండ్ మాజా క్లాజా (Maja Klajda), 2వ స్థానంలో ఇథియోపియా అమ్మాయి హసెట్ దెరెజీ అద్మాసు (Hasset Dereje Admassu) నిలిచారు.
పోలాండ్కు చెందిన మాజా క్లాజాను నమ్రత శిరోద్కర్.. ఇథియోపియా కంటెస్టెంట్ను దగ్గుబాటి రానా, మార్టినిక్ కంటెస్టెంట్ను మాజీ మిస్ వరల్డ్ మానుషి.. థాయిలాండ్ కంటెస్టెంట్ను సోనూ సూద్ ప్రశ్నలడిగారు.
ఏ ప్రశ్న వేశారు, మిస్వరల్డ్ ఏం చెప్పారు?
'' సత్యం, వ్యక్తిగత బాధ్యతల గురించి ఈ ప్రయాణం మీకేం నేర్పింది? అని మిస్ థాయిలాండ్ను సోనూ సూద్ ప్రశ్నించారు.
''ఇది నా జీవితంలోనే గొప్ప అవకాశం. మిస్ వరల్డ్లో ఉండటం ద్వారా నేను నేర్చుకున్న ముఖ్యమైన విషయం సత్యాన్ని ఎలా స్వీకరించాలనే బాధ్యత. నేను, మిగిలిన అమ్మాయిలు, ఈ హాలులో ఉన్న ప్రతి ఒక్కరం మన జీవితాల్లోని ఇతరులకు ఆదర్శంగా ఉండటమే మనం చేయగలిగిన గొప్ప పని. ఎందుకంటే, నువ్వు ఎవరైనా కావొచ్చు, ఎంత వయస్సు ఉన్నా, జీవితంలో ఏ పదవిలో ఉన్నా, మీ పక్కనే ఒక వ్యక్తి ఉంటారు. అది పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. లేదా వాళ్ళు మీ కన్న తల్లిదండ్రులే కావచ్చు, వారు మిమ్మల్ని ఎంతో ఆదర్శంగా చూస్తారు. తోటి వారికి నాయకత్వం వహించడం, నడిపించడంలో ఉత్తమమైన మార్గం ఏంటంటే, కరుణాపూరిత చర్యలతో వారిని నడిపించడం. అదే మన చుట్టూ ఉన్న వారికీ, ప్రపంచంలో ఉన్న వారికీ మనం చేయగలిగే మంచి.'' అని బదులు ఇచ్చారు మిస్ వరల్డ్ గెలిచిన ఒపలా.
ఆ తరువాత జడ్జీలు న్యాయ నిర్ణేతను ఎంచుకునే సమయంలో, 2024 మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా వేదికపై మాట్లాడారు.
విజేతను మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ప్రకటించారు.
మొదటి రన్నరప్కి ఒక చిన్న కిరీటం ధరింపచేశారు
ప్రధాన విజేతను సింహాసనంపై కూర్చోబెట్టి, కిరీటం పెట్టారు క్రిస్టినా.
తరువాత పోటీదారులంతా వేదికపై నృత్యం చేస్తూ అలరించారు. అటు ప్రేక్షకులు కూడా వేదికవైపు వెళ్లడానికి, ఫోటోలు తీసుకోవడానికి ఉత్సాహపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డి, నటులు చిరంజీవి, విజయ్ దేవరకొండతో పాటు ఇతర ప్రముఖులు మిస్ వరల్డ్ కార్యక్రమం చూడటానికి వచ్చారు.
ఈ కార్యక్రమానికి మిస్ వరల్డ్ 2016 స్టెఫానీ డెల్ వాలె, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంభర్ హోస్ట్లుగా వ్యవహరించారు.
బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్ స్టేజ్ పైన ప్రదర్శన ఇచ్చారు.
నటుడు, దాత సోనూ సూద్కు మిస్ వరల్డ్ హ్యూమానిటేరియన్ అవార్డు ప్రదానం చేశారు నటుడు రానా.
మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్గా సుధారెడ్డిని ప్రకటించారు.
''తన కెరీర్కు కీలకమైన తెలుగు సినిమా పరిశ్రమకు ధన్యవాదాలు'' అంటూ చెప్పిన సోను సూద్, బొమ్మాళీ అంటూ డైలాగ్ చెప్పారు.
''సొంత నగరం, సొంత రాష్ట్రం హైదరాబాద్లో మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ నియమితులవ్వడం సంతోషంగా ఉంది'' అన్నారు మేఘా డైరెక్టర్ సుధా రెడ్డి.
పోటీలు జరుగుతున్నంత సేపూ ఆయా దేశాల అభిమానులు తమ వారిని ప్రోత్సహిస్తూ నినాదాలు చేశారు.
ప్రేక్షకులు, పోటీదార్ల బంధువులు, ఇతర సిబ్బందితో కలిసి అనేక దేశాల వారు హైటెక్స్లో సందడి చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)