ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, FACEBOOK/TDP/JANASENA/YSRCP
పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా 25 పార్లమెంట్ స్థానాలకు గానూ గురువారం నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మొత్తం 555 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. వారంతా కలిపి 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వాటిలో బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి బరిలో ఉన్న రాజమండ్రి నుంచి 22 సెట్ల నామినేషన్లు వేయగా, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పోటీలో ఉన్న కడప నుంచి 42 సెట్ల నామినేషన్లు వేశారు.
175 అసెంబ్లీ స్థానాలకు 3084 మంది నామినేషన్లు వేశారు. 4265 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.
వైఎస్సార్సీపీ తరుపున 175 స్థానాల్లోనూ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. విపక్ష ఎన్డీయే కూటమి తరుపున టీడీపీ 144 స్థానాల్లో, బీజేపీ 10, జనసేన 21 స్థానాల్లో నామినేషన్లు వేశాయి. ఆయా పార్టీల రెబల్స్ కూడా కొందరు నామినేషన్లు వేశారు. ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ , సీపీఎం, సీపీఐ అభ్యర్థులు 175 స్థానాల్లోనూ నామినేషన్లు వేశారు.
సీఎం వైఎస్ జగన్ బరిలో ఉన్న పులివెందులలో 37 సెట్ల నామినేషన్లు , మాజీ సీఎం చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో 32, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బరిలో ఉన్న పిఠాపురంలో 19 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి.

ఫొటో సోర్స్, Reuters
హాలీవుడ్ మూవీ మొఘల్ హార్వీ వైన్స్టీన్ దోషిగా తేలిన 2020నాటి అత్యాచార కేసులో తీర్పును న్యూయార్క్లోని ఓ ఉన్నత స్థాయస్థానం కొట్టివేసింది.
ఈ కేసులో అతడికి నిష్పాక్షిక విచారణ లభించలేదని కోర్టు అభిప్రాయపడింది.
అతడిపై నమోదైన అభియోగాలపై కాకుండా.. గతంలో అతడి ప్రవర్తనను అనుసరించే కోర్టులో విచారణ జరిగిందని న్యూయార్క్లోని ఈ అప్పీళ్ల న్యాయస్థానం అభిప్రాయపడింది.
అయితే, వేరే రేప్ కేసులోనూ దోషిగా నిరూపితమైన 72 ఏళ్ల వైన్స్టీన్ జైలులోనే ఉండాల్సి ఉంటుంది.
తాజా అప్పీలుపై 4-3 మెజారిటీతో కోర్టు గురువారం తీర్పునిచ్చింది.

ఫొటో సోర్స్, X/@OFFICIALTOOMA
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మద్దతు ప్రకటించిన ఇరాన్ ర్యాపర్కు అక్కడి కోర్టు మరణ శిక్ష విధించింది. ఈ విషయాన్ని ర్యాపర్ న్యాయవాది ధ్రువీకరించారు.
2022లో మెహసా అమీనీ హత్య అనంతరం చెలరేగిన నిరసనలకు తన పాటల ద్వారా తూమజ్ సలేహీ మద్దతు పలికారు.
ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని సలేహీ న్యాయవాది ఆమిర్ రైసియాన్ చెప్పారు. దీనిపై ఇరాన్ ప్రభుత్వం స్పందించలేదు.
సలేహీని 2022 అక్టోబరులోనే అరెస్టు చేశారు. ఆ సమయంలోనే బహిరంగంగా నిరసనలకు ఆయన మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనపై అక్కడి అధికారులు చాలా ఆరోపణలు మోపారు.
2023 జులైలో సలేహీకి ఆరేళ్ల జైలు శిక్ష విధించారు.
అయితే, ఈ ఏడాది జనవరిలో ‘రివొల్యూషనరీ కోర్టు’ కొత్త అభియోగాలను నమోదుచేసిందని సలేహీ న్యాయవాది చెప్పారు.
అవినీతి, ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేయడం, అల్లర్లను రెచ్చగొట్టడం తదితర ఆరోపణల్లో కోర్టు సలేహీని దోషిగా నిర్ధారించింది. ఈ మరణ శిక్షపై అప్పీలు చేసుకోవడానికి సలేహీకి 20 రోజుల సమయం ఉంటుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారాలలో విద్వేష ప్రసంగాలు చేస్తున్నారంటూ బీజేపీ రాహుల్ గాంధీపైనా, కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీపైనా పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
ఆ ఆరోపణలను ఆయా పార్టీలకు పంపిన ఎన్నికల సంఘం ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 11గంటలకల్లా వివరణ ఇవ్వాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు నోటీసులు జారీచేసినట్టు ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఉన్నతస్థానాలలో ఉన్నవారు ప్రచారంలో చేసే ప్రసంగాలు తీవ్ర పరిణామాలకు కారణమవుతాయని నోటీసుల జారీ సందర్భంగా ఎన్నికల సంఘం పేర్కొంది.

ఫొటో సోర్స్, REUTERS
రష్యా బలగాలను ఎదుర్కొనేందుకు యుక్రెయిన్కు రహస్యంగా 'సుదూర లక్ష్యాలను ఛేదించే మిసైల్స్'ను అమెరికా అందించింది. ఆ బాలిస్టిక్ క్షిపణులను యుక్రెయిన్ ఉపయోగించడం ప్రారంభించింది. ఈ విషయాన్ని అమెరికా అధికారులు ధృవీకరించారు.
ఈ ఆయుధాలు 2023 మార్చిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుక్రెయిన్కు అందించిన రూ. 2,500 కోట్లు (300 మిలియన్ డాలర్స్) సహాయంలో భాగం. ఇవి ఈ నెల నుంచి యుక్రెయిన్కు చేరుకోవడం ప్రారంభించాయి.
క్రిమియాలోని రష్యన్ లక్ష్యాలపై దాడి చేయడానికి వాటిని ఒకసారి ఉపయోగించారని కూడా అమెరికన్ మీడియా చెబుతోంది.
బైడెన్ తాజాగా యుక్రెయిన్కు రూ. 5 లక్షల కోట్ల (61 బిలియన్ డాలర్ల) సహాయ ప్యాకేజీని కూడా ఆమోదించారు.
అమెరికా గతంలో యుక్రెయిన్కు ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్ మీడియం-రేంజ్ ఆయుధాలను అందించింది. అయితే గత ఫిబ్రవరిలో యుక్రెయిన్కు సుదూర క్షిపణులను అందించే ప్రతిపాదనకు బైడెన్ రహస్యంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు.
ఈ క్షిపణులు 300 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగలవు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.