You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

స్తంభించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు.. పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్న మెటా

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు భారత్‌తోపాటు, ప్రపంచంలోని పలు దేశాల్లోనూ నిలిచిపోయాయి. ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోయాయని 3 లక్షలకు పైగా రిపోర్ట్‌లు రాగా, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంపై 20 వేలకు పైగా రిపోర్ట్‌లు వచ్చాయి.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. స్తంభించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు.. పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామన్న మెటా

    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు భారత్‌తోపాటు, ప్రపంచంలోని పలు దేశాల్లో నిలిచిపోయాయి.

    ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్ పేర్కొన్న వివరాల ప్రకారం.. ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోయాయని 3 లక్షలకు పైగా రిపోర్ట్‌లు రాగా, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంపై 20 వేలకు పైగా రిపోర్ట్‌లు వచ్చాయి.

    ఏఎన్ఐ దీనిపై ట్వీట్ చేసింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.

    వీలైనంత త్వరగా పరిష్కరిస్తాం-మెటా

    దీనిపై స్పందించాల్సిందిగా మెటాను సంప్రదించగా, “ఫేస్‌బుక్ లాగిన్‌ అవడంలో సమస్య ఎదురవుతోందని గుర్తించాం. మా ఇంజనీరింగ్ బృందాలు సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాయి” అని తెలిపింది.

    'సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం'- మెటా ప్రతినిధి

    ఎక్స్ వేదికగా యూజర్లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు నిలిచిపోయాయని సమస్య గురించి షేర్ చేస్తుండగా, మెటా కమ్యూనికేషన్స్‌కు చెందిన ఆండీ స్టోన్ స్పందించారు.

    "ప్రజలు మా సేవలు పొందడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారని గుర్తించాం. సమస్యను పరిష్కరించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం" అని ట్వీట్ చేశారు.

  3. ఆంధ్రప్రదేశ్: టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరామ్‌.. కాసేపటికే మంత్రివర్గం నుంచి బర్తరఫ్

    శంక్ వడిశెట్టి

    బీబీసీ కోసం

    ఏపీ మంత్రి గుమ్మనూరు జయరామ్ టీడీపీలో చేరిన కొద్దిసేపటికే ఆయన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ గెజిట్ విడుదలైంది.

    మంగళగిరిలో జరిగిన జయహో బీసీ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆయన్ను కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

    కొద్దిసేపటికే జయరామ్‌ను ఏపీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

    కార్మిక శాఖ మంత్రిగా ఉన్న ఆయన పార్టీ మారడంతో ఆయన్ని క్యాబినెట్ నుంచి తొలగించాలన్న సీఎం జగన్మోహన్ రెడ్డి సిఫార్సు మేరకు గవర్నర్ ఆమోదం తెలిపారు.

    రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు స్థానం నుంచి టీడీపీ తరఫున తాను బరిలో ఉంటానని గుమ్మనూరు జయరామ్ ప్రకటించారు.

  4. గాజా: 'పిల్లలకు ఆహారం తీసుకొస్తానని వెళ్ళిన నా భర్త శవపేటికలో తిరిగి వచ్చాడు'

  5. బాన్సురీ స్వరాజ్‌ ఎవరు... బీజేపీ ఆమెకు ఎంపీ టికెట్ ఇవ్వడంపై వివాదం ఎందుకు?

  6. అనంత్ అంబానీ ప్రీ-వెడ్డింగ్: పాప్ స్టార్ రియానా, బిలియనేర్ బిల్‌గేట్స్, మార్క్ జుకర్ బర్గ్, ఇవాంకా ట్రంప్... ఇంకా భారతీయ హేమాహేమీల మెగా సందడి

  7. ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు, ఈ కేసు పూర్తి వివరాలివీ...

  8. పాకిస్తాన్‌‌: ఆకస్మికంగా కురిసిన మంచు, వర్షాల కారణంగా 35 మంది మృతి

    పాకిస్తాన్‌లో ఆకస్మికంగా కురిసిన మంచు, భారీ వర్షాల కారణంగా 35 మంది ప్రాణాలు కోల్పోయారు.

    మరణించిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు.

    భారీ వర్షాల కారణంగా భూమి కుంగి ఇళ్లు మట్టిలో కూరుకుపోయాయి.

    ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తాకిడి ఎక్కువగా ఉంది.

    మార్చి నెలలో ఉన్నట్లుండి కురిసిన మంచు, భారీ వర్షాలతో తీవ్రత పెరిగింది.

    ఇప్పటివరకు 150కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. 500లకు పైగా ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

    పఖ్తుంక్వా, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లలో ఎక్కువ శాతం దెబ్బతిన్నాయి.

  9. వైఎస్సార్‌సీపీకి మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా, టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటన, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రకటించారు.

    కర్నూలు జిల్లా ఆలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన స్థానంలో విరూపాక్షం అనే నేతను నియోజకవర్గ ఇన్‌చార్జిగా వైఎస్సార్‌సీపీ గతంలో ప్రకటించింది. అనంతరం జయరాంకు కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు.

    ఈ నిర్ణయాలతో అసంతృప్తిగా ఉన్న జయరాం తనకు ఆలూరు సీటు కావాలని పట్టుబట్టినప్పటికీ పార్టీ నాయకత్వం అంగీకరించలేదు.

    ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు.

    మంగళవారం మంగళగిరిలో జరిగే 'జయహో బీసీ సభ'లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి సమక్షంలో టీడీపీలో చేరబోతున్నట్లు జయరాం ప్రకటించారు.

    టీడీపీ తరపున గుంతకల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని ఆయన చెప్పారు.

  10. స్పానిష్ మహిళపై లైంగిక దాడి: ఝార్ఖండ్‌లో ఏం జరుగుతోంది?

  11. ఇజ్రాయెల్‌లో హమాస్ లైంగిక దాడులకు ఆధారాలు: ఐరాస నివేదిక

  12. మావోయిస్టులతో సంబంధాల కేసు: సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించిన బాంబే హైకోర్టు

    మావోయిస్టులతో సంబంధాల కేసులో దిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ తీర్పు ఇచ్చిందని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.

    కేసులో గతంలో సాయిబాబాకు జీవిత ఖైదు శిక్ష పడింది.

    ఆయన్ను 2014 మేలో దిల్లీలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత ఆయన్ను దిల్లీ యూనివర్శిటీ సస్పెండ్ చేసింది.

    చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం-యూఏపీఏలోని 13, 18, 20, 39 సెక్షన్ల కింద సాయిబాబాను దోషిగా తేలుస్తూ మహారాష్ట్రలోని గడ్చిరోలి సెషన్స్ కోర్టు 2017లో తీర్పు చెప్పింది.

    సెషన్స్ కోర్టు తీర్పును జస్టిస్ వినయ్ జోషి, జస్టిస్ వాల్మీకి ఎస్ఏ మెంజెస్‌లతో కూడిన హైకోర్టు నాగ్‌పూర్ ధర్మాసనం ఇప్పుడు కొట్టివేసింది.

    దేశానికి వ్యతిరేకంగా మావోయిస్టులు చేస్తున్న యుద్ధానికి సహాయ, సహకారాలు అందిస్తున్నారంటూ సెషన్స్ కోర్టు 2017లో సాయిబాబాతోపాటు మరికొందరిని దోషులుగా తేల్చిందని ‘బార్ అండ్ బెంచ్’ తెలిపింది.

    సాయిబాబాపై కేసును బాంబే హైకోర్టు బెంచ్ 2022 అక్టోబర్ 14న కొట్టివేసింది. అయితే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు, దీనిపై మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది.

    ప్రస్తుతం సాయిబాబా నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్నారు.

    తాజా తీర్పుపై సాయిబాబా సహచరి వసంత బీబీసీ తెలుగుతో మాట్లాడుతూ- ‘‘కోర్టు కేసు కొట్టివేసినట్లు మీడియాలో చూసే తెలుసుకున్నా. కేసు కొట్టివేయడంపై నేను, నా కూతురు మంజీర చాలా సంతోషంగా ఉన్నాం. గత పదేళ్లుగా ఆయన్ను అన్యాయంగా జైల్లో ఉంచారు. ఆరోగ్య సమస్యలున్నా బెయిల్ ఇవ్వలేదు. ఇకనైనా ప్రభుత్వం అడ్డు తగలకుండా త్వరగా ఆయన విడుదలయ్యేలా చూడాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు.

    ఈ కేసులో ఇతర నిందితులకు కూడా న్యాయం జరగాలని కోరుకొంటున్నానని వసంత తెలిపారు.

    కేసులో సాయిబాబాతోపాటు మరో ఐదుగురు నిందితులను హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

    కోర్టు తీర్పుపై ప్రముఖ న్యాయవాది ఇందిరా జైసింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ '' సాయిబాబా నిర్దోషి, ఎన్ని రోజులకు? ఆయన ఆరోగ్యాన్ని ఎవరు తిరిగిస్తారు? కోర్టులా? సిగ్గుపడాలి. ఎంతమంది మిగతావాళ్లు బెయిల్ కోసం వేచి చూడాలి? ఆయనకు జరిగిన స్వేచ్ఛ నష్టానికి మూల్యం ఎవరు చెల్లిస్తారు?'' అని

  13. ఇజ్రాయెల్‌లో జరిగిన దాడిలో భారతీయుడి మృతిపై 'ఇజ్రాయెల్ ఎంబసీ' ప్రకటన

    ఇజ్రాయెల్‌లో భారతీయుడి మృతిపై విచారం వ్యక్తంచేస్తూ భారత్‌లోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

    హిజ్బుల్లా ఈ దాడికి పాల్పడినట్లుగా ఆరోపిస్తూ, దానిని పిరికిపంద చర్యగా పేర్కొంది. గాయపడిన వారికి వైద్య సహాయం అందిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

    "మార్గలియట్‌లో నిన్న మధ్యాహ్నం పండ్లతోటను సాగు చేస్తున్న కార్మికులపై షియా టెర్రర్ ఆర్గనైజేషన్ హిజ్బుల్లా జరిపిన ఉగ్రదాడిలో ఒక భారతీయ పౌరుడు మరణించడం, మరో ఇద్దరు గాయపడటం తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించాయి. గాయపడిన వారికి ఇజ్రాయెల్ అత్యుత్తమ వైద్య చికిత్స అందిస్తోంది" అని ఎంబసీ ఎక్స్‌లో తెలిపింది.

  14. అబార్షన్‌ను మహిళల రాజ్యాంగ హక్కుగా నిర్ణయించిన తొలి దేశంగా ఫ్రాన్స్

    అబార్షన్(గర్భస్రావం)ను రాజ్యాంగ హక్కుగా కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది.

    ఫ్రాన్స్ తన 1958 నాటి రాజ్యాంగంలో సవరణలు చేస్తూ, గర్భస్రావాన్ని మహిళల రాజ్యాంగ హక్కుగా కల్పించే చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం తెలిపింది.

    ఈ బిల్లు 780-72 ఓట్ల తేడాతో పార్లమెంటు ఆమోదం పొందింది. ఓటింగ్ ఫలితాలను ప్రకటించినప్పుడు పార్లమెంట్‌లోని సభ్యులంతా లేచి నిల్చుని చప్పట్లు కొడుతూ సంఘీభావం తెలిపారు.

    చట్టసభ్యులు తీసుకున్న ఈ నిర్ణయం ‘‘ఫ్రెంచ్ గౌరవం’గా అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ వర్ణించారు.

    అయితే, ఈ మార్పును మాత్రం యాంటీ-అబార్షన్ గ్రూప్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

    ఫ్రాన్స్‌లో 1975 నుంచి గర్భస్రావం చట్టబద్ధమైనదే. కానీ, ప్రెగ్నెన్సీని తొలగించుకునే మహిళల హక్కును కాపాడేందుకు రాజ్యాంగ సవరణ కావాలని 85 శాతం మంది ప్రజలు కోరినట్లు పోల్ సర్వేలో తెలిసింది.

    చాలా ఇతర దేశాలు పునరుత్పత్తి హక్కులను రాజ్యాంగ హక్కులుగా కల్పించాయి. అయితే, అబార్షన్‌కు కూడా రాజ్యాంగపరమైన హామీని కల్పించిన తొలి దేశంగా మాత్రం ఫ్రాన్స్ చరిత్రలో నిలిచిపోనుంది.

    ఆధునిక ఫ్రాన్స్ వ్యవస్థాపక పత్రానికి ఇది 25వ సవరణ. 2008 నుంచి తొలిసారి చేపట్టిన సవరణ ఇదే.

    ఈ ఓటింగ్ నిర్ణయం వెలువడిన తర్వాత, పారిస్‌లోని ఈఫిల్ టవర్ ‘బై బాడీ, మై చాయిస్’నే సందేశంతో వెలుగొందింది.

    ‘‘మీ శరీరం మీదే. మీ శరీరం విషయంలో ఎవరూ నిర్ణయం తీసుకోరు’’ అనే సందేశాన్ని తాము మహిళలందరికీ ఇస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రధానమంత్రి గాబ్రియల్ అట్టల్ చెప్పారు.

  15. బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం

    నమస్తే.

    తాజా వార్తలను ఎప్పటికప్పుడు మీకందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.