ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.
గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో చేయడాన్ని చైనా తీవ్రంగా తప్పుపట్టింది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ ఇంతటితో సమాప్తం.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం.
గుడ్ నైట్.

ఫొటో సోర్స్, Facebook
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 26న విచారణకు రావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) నోటీసులు జారీ చేసింది.
సీబీఐ గతంలో ఆమె వాంగ్మూలం రికార్డు చేసింది. హైదరాబాద్లోని ఆమె ఇంటికి వెళ్లి సీబీఐ అధికారులు వివరాలు సేకరించారు.
ఈ కేసులో కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇప్పటికే విచారించింది. 2023 మార్చిలో మూడుసార్లు దిల్లీలో ఈడీ విచారించింది.
ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది విచారణ దశలో ఉంది. తదుపరి విచారణ ఈ నెల 28న జరగాల్సి ఉంది.
ఇప్పటికే పలుమార్లు విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేయగా, ఆమె గైర్హాజరవుతూ వచ్చారు.

ఫొటో సోర్స్, ANI
పంజాబ్ - హరియాణా మధ్యనున్న శంభు సరిహద్దు వద్ద నిరసన తెలుపుతున్న రైతులు బుధవారం 'దిల్లీ చలో' మార్చ్కు పిలుపునిచ్చారు.
బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి.
పాదయాత్ర ప్రారంభానికి ముందు రైతులకు మాస్కులు, గ్లౌజులు, సేఫ్టీ సూట్లు పంపిణీ చేశారు. అదే సమయంలో, మార్చ్ ప్రారంభమైన తర్వాత భద్రతా దళాలు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించాయి.
బోర్డర్లో ఏర్పాటు చేసిన బారికేడ్లు, సిమెంట్ దిమ్మెలను తొలగించేందుకు రైతులు ట్రాక్టర్లను సిద్ధంగా ఉంచారు.

ఫొటో సోర్స్, Facebook
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్సీపీకి మరో ఎంపీ దూరమయ్యారు. ఇప్పటికే ముగ్గురు లోక్సభ సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీకి పంపించారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖలో వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్టు ప్రభాకర్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పుకుంటున్నట్టు లేఖలో రాశారు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్సీపీలో కీలకంగా వ్యవహరించారు. గత ఎన్నికలకు ముందు పలు జిల్లాలకు ఇంఛార్జిగా పనిచేశారు. అందుకు ప్రతిఫలంగా పార్టీ ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశమిచ్చింది. ఆయన భార్యకు టీటీడీ బోర్డ్ మెంబర్ పదవి కూడా దక్కింది.
నెల్లూరు లోక్సభ స్థానానికి ప్రభాకర్ రెడ్డి ఇంఛార్జిగా ఉన్నారు. అయితే తాను సూచించిన వారికి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిగా అవకాశం ఇవ్వడం లేదనే విషయమై కొద్ది రోజులుగా అలిగి, పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరమయ్యారు. తాజాగా వైఎస్సార్సీపీని వీడడంతో కొద్ది రోజుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టు అనుచరులు చెబుతున్నారు.
తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రభాకర్ రెడ్డి మరో ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది, న్యాయ నిపుణుడు ఫలీ నారీమన్ మరణించారు. ఆయన వయసు 95 ఏళ్లు.
బాంబే హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం సుప్రీంకోర్టులో న్యాయవాదిగా దిల్లీ కేంద్రంగా పనిచేశారు.
1972లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను సొలిసిటర్ జనరల్గా నియమించిగా 1975లో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేశారు.
అనంతరం 2011 నుంచి 2013 వరకు మరోమారు ఆయన సొలిసిటర్ జనరల్గా పనిచేశారు.
2007లో ఆయనకు ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. ఫలీ నారీమన్ కుమారుడు జస్టిస్ రొహింటన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.

ఫొటో సోర్స్, EPA
గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో చేసిన తీర్మానాన్ని అమెరికా వీటో చేయడాన్ని చైనా తీవ్రంగా తప్పుపట్టింది.
అమెరికా తీరు తప్పుడు సందేశం పంపించిందని చైనా పేర్కొంది. ‘కొనసాగుతున్న హననానికి పచ్చజెండా’ ఊపినట్లయిందని చైనా పేర్కొంది.
అల్జీరియా ప్రతిపాదించిన ఈ తీర్మానం యుద్ధం ముగింపు కోసం చేపట్టే చర్చలను గందరగోళంలోకి నెడుతుందని వైట్ హౌస్ పేర్కొంది.
కాగా అమెరికా తాను విడిగా ఒక తాత్కాలిక కాల్పుల విరమణ తీర్మానాన్ని ప్రతిపాదించింది. రఫా నగరంలోకి ఇజ్రాయెల్ చొరబడరాదంటూ అందులో హెచ్చరించింది.
గాజాలో యుద్ధం కొనసాగుతున్న సమయంలో అల్జీరియా చేసిన తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంపై విమర్శలొస్తున్నాయి. భద్రతా మండలిలోని 15 సభ్య దేశాలలో 13 దేశాలు అల్జీరియా తీర్మానానికి మద్దతిచ్చాయి. బ్రిటన్ దీనికి దూరంగా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ఎన్నికలలో స్పష్టమైన ప్రజాతీర్పు రాకపోవడం, ప్రభుత్వ ఏర్పాటుకు ఏ ఒక్కరికీ కావాల్సిన మెజారిటీ రాని పరిస్థితులలో తాజాగా అక్కడి రెండు ప్రధాన పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి.
పాకిస్తాన్ ముస్లిం లీగ్ – నవాజ్(పీఎంఎల్ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేలా ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చాయి.
పీఎంఎల్ఎన్ మద్దతుతో పీపీపీ పాలన ప్రారంభించనుందని రెండు పార్టీలు కలిసి ప్రకటన చేశాయి.
ఫిబ్రవరి 8న జరిగిన పాకిస్తాన్ ఎన్నికలలో.. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న అభ్యర్థులు ఎక్కువ స్థానాలలో విజయం సాధించారు. పీఎంఎల్ఎన్, పీపీపీలకు అంతకంటే తక్కువ సీట్లే వచ్చాయి.
మంగళవారం చేసిన ఒక ప్రకటనలో పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో.. ‘దేశ ఆర్థిక సంక్షోభానికి పరిష్కారం చూపడమే మా సంకీర్ణం లక్ష్యం’ అన్నారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీకందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసంఇక్కడ క్లిక్ చేయండి