బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిందువుల తరఫున దాఖలైన పిటిషన్ల విచారణను చట్ట ప్రకారం అడ్డుకోవడం సాధ్యం కాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ఈ రోజు దిల్లీలో జరిగిన ప్రతిపక్ష కూటమి ఇండియా నేతల భేటీలో కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరును దిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించారని ఎండీఎంకే అధ్యక్షుడు వైకో వెల్లడించారు.
వార్తాసంస్థ పీటీఐ ఎక్స్ వేదికగా షేర్ చేసిన వీడియోలో, వీసీకే అధ్యక్షులు థోల్ తిరుమలవన్ మాట్లాడుతూ, “పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు. అయితే, ఈ సమయంలో ప్రధాని అభ్యర్థిని ప్రకటించడంలో ప్రయోజనం లేదని, ఆయన వారించారు. పోలింగ్ తర్వాత మాత్రమే ఆ అంశంపై చర్చించొచ్చు అని ఖర్గే చెప్పారు” అని వెల్లడించారు.
సమావేశం అనంతరం ఖర్గే మాట్లాడుతూ, “ముందుగా మేం ఎన్నికల్లో విజయం గురించి చర్చిస్తాం. కూటమి తరపున మెజారిటీ సంఖ్యలో లోక్సభ స్థానాలను గెల్చుకున్నాక, ప్రధాని అభ్యర్థిపై చర్చించొచ్చు” అన్నారు.
మొత్తం 28 పార్టీలు ఈ రోజు జరిగిన ఇండియా కూటమి నాలుగో సమావేశానికి హాజరైనట్లు కాంగ్రెస్ తెలిపింది.
పార్లమెంట్లో ఎంపీల సస్పెన్షన్ను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 22 నుంచి విపక్షాలు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నాయి.
మంగళవారం లోక్సభ నుంచి మరో 49 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. వీరిలో ఫరూక్ అబ్దుల్లా, శశి థరూర్, మనీష్ తివారీ, ఇతర సభ్యులు ఉన్నారు.
సోమవారం ఏకంగా 78 మంది పార్లమెంటు సభ్యులు సస్పెండ్ అయ్యారు. సోమ, మంగళవారాల్లో కలిపి మొత్తం 127 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు.
సోమవారం సస్పెండైన 78 మందిలో 33 మంది లోక్సభ సభ్యులు, 45 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు.
డిసెంబరు 13న లోక్సభలో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని పార్లమెంటులో విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
భీమా కోరేగావ్ హింస కేసులో నిందితుడిగా ఉన్న గౌతమ్ నవలఖకు మంగళవారం బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
"న్యాయస్థానం ఈరోజు బెయిల్ మంజూరు చేసింది" అని నవలఖ తరపు న్యాయవాది యుగ్ మోహిత్ చౌధురి అన్నారు.
"ఈ బెయిల్ అమలుపై మూడు వారాల పాటు స్టే ఇచ్చారు" అని తెలిపారు.
బెయిల్ ఆర్డర్ పై స్టే ఇవ్వడం వల్ల, నవలఖ విడుదల కాక ముందే, ఎన్ఐఏ సుప్రీంకోర్టులో బెయిల్ ఆర్డర్పై అప్పీల్ చేయడానికి సమయం ఉంది.
నిరుడు నవంబర్ నుంచి నవలఖ గృహనిర్భంధంలోనే ఉంటున్నారు.
అనార్యోగ కారణాల వల్ల తనను జైలు నుంచి మార్చాలని ఆయన గతంలో సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దీనిని కోర్టు పరిగణనలోకి తీసుకొంది. దీంతో నవలఖ జైలు నుంచి బయటకు వచ్చి, గృహనిర్భందంలో ఉంటున్నారు.
అంతకుముందు ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు ఆయన దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది.
2018 జనవరిలో కులపరమైన హింసను ప్రోత్సహించేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై భీమా కోరేగావ్ కేసులో 16 మందిని అరెస్టు చేశారు.
అంతేకాక, నిందితులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేందుకు కుట్ర పన్నారని, నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసు నిందితుల్లో ఇప్పటి వరకు ఏడుగురికి బెయిల్ మంజూరైంది.
ఐపీఎల్ వేలంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డు ధర పలికాడు. అతడిని రూ.24.75 కోట్ల ధరకు కోల్కతా నైట్ రైడర్స్(కేకేఆర్) దక్కించుకొంది.
అతడి కోసం ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్రైడర్స్ పోటీపడ్డాయి. చివరి దశలో గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ మధ్య గట్టి పోటీ నడిచింది. చివరకు అతడిని కేకేఆర్ ఎగరేసుకుపోయింది.
ప్రపంచ కప్ ఫైనల్లో భారత్పై ఆస్ట్రేలియా విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించిన పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్లను ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దక్కించుకుంది.
పాట్ కమిన్స్ను 20.5 కోట్ల ధరకు, హెడ్ను రూ.6.8 కోట్లకు తీసుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సెట్ వేలం ముగిసింది.
వెస్టిండీస్ ప్లేయర్ రావ్మన్ పావెల్తో వేలం మొదలు కాగా రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 7.4 కోట్లకు అతన్ని సొంతం చేసుకుంది.
క్యాప్డ్ ఆల్రౌండర్ల కేటగిరీలో జరిగిన ఈ వేలంలో ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ను రూ. 6.80 కోట్లకు సన్రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.
రూ. 2 కోట్ల బేస్ప్రైజ్తో ట్రావిస్ హెడ్ వేలంలోకి వచ్చాడు.
ఇంగ్లండ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ను రూ. 4 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
వేలంలో దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రాస్కో, భారత ప్లేయర్లు కరుణ్ నాయర్, మనీశ్ పాండే, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్లపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో తొలి సెట్ వేలం ముగిసేసరికి వారు అన్సోల్డ్ ప్లేయర్లుగా మిగిలిపోయారు.
లోక్సభ నుంచి మరో 49 మంది ఎంపీలు సస్పెన్షన్కు గురయినట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
తాజాగా సస్పెండ్ అయిన వారిలో ఫరూక్ అబ్దుల్లా, శశి థరూర్, మనీష్ తివారీ ఉన్నారు.
సోమవారం రికార్డు స్థాయిలో 78 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో గడిచిన రెండు రోజుల్లో పార్లమెంట్ ఉభయసభల నుంచి మొత్తం 127 మంది ఎంపీలు సస్పెండ్ అయ్యారు.
మోదీ ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
గతవారం పార్లమెంట్లోకి నలుగురు వ్యక్తులు చొరబడటం గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
పార్లమెంట్లో ఈ విషయంలో ఏర్పడిన గందరగోళం తర్వాత సోమవారం పెద్ద సంఖ్యలో ఎంపీలు సస్పెన్షన్కు గురయ్యారు. కొన్ని ముఖ్యమైన బిల్లులను సభలో ప్రవేశపెట్టే సమయంలో ఇది జరిగింది.
వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు ప్రాంతపు యాజమాన్య హక్కులకు సంబంధించి అంజుమన్ ఇంతెజామియా మసీద్ కమిటీ దాఖలు చేసిన ఐదు పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించింది.
మసీదు స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ పలువురు హిందువులు దాఖలు చేసిన పిటిషన్లను ది ప్లేస్ ఆఫ్ వర్షిప్ (ప్రత్యేక నిబంధనలు) చట్టం, 1991 ప్రకారం విచారణ జరపరాదంటూ మసీదు కమిటీ పిటిషన్లు దాఖలు చేసింది. అయితే, ఆ చట్టం ఈ పిటిషన్లను అడ్డుకోలేదని కోర్టు తెలిపింది.
ఈ చట్టం 1947 తర్వాత ఏ ప్రార్థనా స్థలాల స్టేటస్(స్థితి)ను మార్చరాదని చెబుతోంది.
అయితే, హిందువుల తరఫున దాఖలైన పిటిషన్ల విచారణను చట్ట ప్రకారం అడ్డుకోవడం సాధ్యం కాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
“జ్ఞానవాపి ప్రాంతం అటు హిందూ స్వభావంతోగానీ, లేదంటే ముస్లిం స్వభావంతోగానీ ఉండాలి. కానీ, ఇలా రెండు స్వభావాలు ఉండటానికి వీలు లేదు. కోర్టు దీనిలో ఏదో ఒకదానిని నిర్ధరించాలి. పిటిషనర్లు వేసిన పిటిషన్లను సమర్ధించే సాక్ష్యాధారాలను కోర్టు పరిశీలించాలి.’’ అని పేర్కొంది.
మీడియా కథనాల ప్రకారం ఈ కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని వారణాసి కోర్టును హైకోర్టు కోరింది.
1991 నుంచి ఈ వ్యవహారం 32 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నందున ఈరోజు నుంచి ఆరు నెలల్లోగా దీనిపై తుది తీర్పునివ్వాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
సోమవారం జ్ఞానవాపికి చెందిన ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సైంటిఫిక్ సర్వే నివేదికను కోర్టుకు సమర్పించారు.
ఈ కేసులో మసీదు కమిటీ వేసిన ఐదు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో డిసెంబర్ 8న కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పును వెలువరించింది.
ఈ కేసు విచారాణార్హం కాదని రెండు పిటిషన్లు దాఖలు కాగా, ఏఎస్ఐ సర్వేకు వ్యతిరేకంగా మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రాబోయే సీజన్ కోసం నేడు (మంగళవారం) మినీ వేలం జరుగనుంది.
దుబయ్లోని కోకా-కోలా అరీనా వేదికగా మధ్యాహ్నం గం. 1 నుంచి వేలాన్ని నిర్వహించనున్నారు.
భారత్ బయట ఐపీఎల్ వేలం జరుగనుండటం ఇదే తొలిసారి.
మొత్తం 333 మంది క్రికెటర్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. అందులో 214 మంది భారత క్రికెటర్లు, 119 మంది విదేశీయులు.
ఐపీఎల్లోని 10 ఫ్రాంచైజీలు కలిసి గరిష్టంగా 77 మంది ఆటగాళ్లను మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇందులో విదేశీ కోటా కింద 30 మంది, భారతీయుల కేటగిరీలో 47 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తాయి.
మిగతా ఫ్రాంచైజీలతో పోలిస్తే గుజరాత్ టైటాన్స్ అత్యధిక డబ్బుతో వేలం బరిలో దిగుతోంది. ఆ జట్టు ఖాతాలో రూ. 38.15 కోట్లు ఉన్నాయి.
సీఎస్కే వద్ద రూ. 31.40 కోట్లు, దిల్ క్యాపిటల్స్ వద్ద రూ 28.95 కోట్లు, కోల్కతా నైట్ రైడర్స్ వద్ద రూ. 32.70 కోట్లు, లక్నో సూపర్జెయింట్స్ వద్ద రూ. 13.15 కోట్లు, ముంబయి ఇండియన్స్ వద్ద రూ 17.75 కోట్లు, పంజాబ్ కింగ్స్ వద్ద రూ. 29.10 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 14.50 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 23.25 కోట్లు, సన్రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ. 34 కోట్ల పర్స్ మనీ ఉంది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి.