ప్రపంచ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మాక్స్‌వెల్

తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగుల భారీ స్కోరు చేసింది. 400 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది.

లైవ్ కవరేజీ

  1. అంబేడ్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరిస్తూ చేసిన 22 ప్రతిజ్ఞలు ఏమిటి, హిందూ దేవుళ్లను కించపరిచేలా ఉన్నాయా?

  2. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. ప్రపంచ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మాక్స్‌వెల్

    మాక్స్‌వెల్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, 40 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసిన మాక్స్‌వెల్

    ఆస్ట్రేలియా బ్యాటర్ గ్లెన్ మాక్స్‌వెల్ ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించాడు.

    బుధవారం దిల్లీలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్‌వెల్ 40 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు.

    మూడు వారాల క్రితం దిల్లీలోనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ అయిడెన్ మర్‌క్రమ్ 49 బంతుల్లో సెంచరీ కొట్టి నెలకొల్పిన రికార్డును మాక్స్‌వెల్ అధిగమించాడు.

    మాక్స్‌వెల్ మొత్తం 44 బంతుల్లో 106 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. అంటే 84 పరుగులు ఫోర్లు, సిక్సర్ల రూపంలోనే వచ్చాయి.

    తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగుల భారీ స్కోరు చేసింది. 400 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 21 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. 25 పరుగులు చేసిన ఓపెనర్ విక్రమ్‌జిత్ సింగే ఈ జట్టులో టాప్ స్కోరర్.

    ఆసీస్ 309 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ప్రపంచ కప్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతి పెద్ద విజయం. 240.9 స్ట్రైక్ రేట్‌తో చెలరేగి ఆడిన మాక్స్‌వెల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు.

    ఆస్ట్రేలియా జట్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా సెంచరీ చేశాడు. 93 బంతుల్లో అతడు 104 పరుగులు సాధించాడు. వార్నర్ 11 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు.

  4. విశాఖపట్నం: వాషింగ్ మెషిన్‌లో తరలించిన రూ.1.3 కోట్లు ఎవరివి?, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

    నోట్ల కట్టలు

    ఫొటో సోర్స్, UGC

    విశాఖపట్నం ఎన్ఏడీ జంక్షన్‌లో వాషింగ్ మెషిన్‌లో అక్టోబరు 23న రూ.1.3 కోట్ల విలువైన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ నగదు ఎవరిది అనేది ఇంతవరకు తెలియలేదు.

    విశాఖపట్నం నుంచి విజయవాడకు తరలిస్తుండగా పోలీసుల తనిఖీలో ఈ నోట్ల కట్టలు బయటపడ్డాయి.

    పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..‘‘ఎలక్ట్రానిక్ వస్తువులతో వెళ్తున్న ఓ ఆటోను ఆపి తనిఖీ చేయగా వాషింగ్ మెషిన్లను డెలివరీకి ఇచ్చేందుకు వెళుతున్నట్లు డ్రైవర్ చెప్పాడు. మెషిన్‌లో మాత్రం గుట్టల కొద్దీ నోట్ల కట్టలు ఉన్నాయి. వాటి విలువ రూ.1.30 కోట్లు. అందులోనే 30 మొబైల్ ఫోన్లు కూడా ఉన్నాయి. విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఈ ఆటో పట్టుబడింది’’ అని తెలిపారు.

    వాషింగ్ మెషీన్లో నోట్ల కట్టలు

    ఫొటో సోర్స్, UGC

    ఈ నోట్ల కట్టలు ఎవరివనే విషయంపై కానీ, నగదుకు సంబంధించిన ఇతరత్రా ఆధారాలు కానీ దొరకలేదు.

    నగదుతో పాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆటోను సీజ్ చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

    నగరంలోని ఎలక్ట్రానిక్ వస్తువులు విక్రయాలు జరిపే సోనో విజన్ కంపెనీ నుంచి వాషింగ్‌ మెషిన్‌తోపాటు ఈ నోట్ల కట్టలను తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    సోనో విజన్ తమకు ఎటువంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ డబ్బును సీజ్ చేసి, కోర్టుకు అందచేశామని ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ డి.ప్రసాదరావు చెప్పారు.

    సరైన ఆధారాలు లేకపోవడంతో సీఆర్పీసీ 41,102 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

    వాషింగ్ మెషీన్లో నోట్ల కట్టలు

    ఫొటో సోర్స్, UGC

  5. బంగారం దోచుకొచ్చి గొయ్యితీసి దాచే కొడుకులు, బ్యాంకులో కుదువ పెట్టే తల్లి.. పోలీసులకు ఎలా దొరికారు?

  6. పిల్లలు సరిగా పెరగాలంటే తల్లిదండ్రులు ఎలా ఉండాలి?

  7. ఇజ్రాయెల్‌‌కు మద్దతుగా అమెరికా యుద్ధానికి దిగుతుందా?

  8. కాంగ్రెస్‌లో చేరుతున్నా, అమిత్ షాకి రుణపడి ఉంటా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

    ఫొటో సోర్స్, KOMATIREDDY RAJ GOPAL REDDY/FACEBOOK

    బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఒక లేఖ విడుదల చేశారు రాజగోపాల్ రెడ్డి.

    ‘‘ఏడాదిన్నర క్రితం తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ, ఆ తర్వాత కొంత డీలా పడింది. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను భావిస్తున్నారు. అందుకే నేను కూడా ప్రజల ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. నా కోసం పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు ధన్యవాదాలు’’ అని లేఖలో తెలిపారు.

    ''తప్పనిసరి పరిస్థితుల్లోనే బీజేపీకి రాజీనామా చేస్తున్నా. నియంతృత్వ కేసీఆర్ సర్కారుపై యుద్ధం చేసే అవకాశం కల్పించిన బీజేపీకి ధన్యవాదాలు. కేంద్ర మంత్రి అమిత్ షాకు రుణపడి ఉంటాను. బీజేపీ పెద్దలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’’ అని తెలిపారు.

  9. ఆంధ్రప్రదేశ్: కులగణన పై ఏపీ సర్కార్ తొందరపడుతోందా, వలంటీర్ల పాత్రపై విమర్శలు ఏమిటి?

  10. ఆ ఇద్దరు పదేళ్లుగా హమాస్ బందీలు... వర్ణ వివక్ష కారణంగానే ఇజ్రాయెల్ వారిని విడిపించడం లేదా?

  11. ఇజ్రాయెల్-హమాస్ వివాదాన్ని ఆపేందుకు చైనాతో కలిసి పనిచేస్తామన్న అమెరికా

    ఆంటోని బ్లింకెన్

    ఫొటో సోర్స్, get

    ఇజ్రాయెల్-హమాస్ వివాదం పెద్ద యుద్ధంగా మారకుండా చూసేందుకు చైనాతో కలిసి పని చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి చెప్పారు.

    "ఈ సంఘర్షణ పెద్దది కాకుండా నిరోధించాల్సిన బాధ్యత కౌన్సిల్ సభ్యులు ముఖ్యంగా శాశ్వత సభ్యులపై ఉంది" అని బ్లింకెన్ సూచించారు. ఇందుకోసం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.

    చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ గురువారం అమెరికా చేరుకోనున్నారు. వచ్చే నెలలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై చర్చ జరగవచ్చని భావిస్తున్నారు.

  12. 'అది సొరంగాల సాలెగూడు'.. హమాస్ చెర నుంచి విడుదలైన మహిళ వ్యాఖ్యలు

  13. మరో ఇద్దరు మహిళా బందీలను విడుదల చేసిన హమాస్

    ఇజ్రాయెల్ గాజా హమాస్

    ఫొటో సోర్స్, Getty Images

    హమాస్ విడుదల చేసిన ఇద్దరు బందీలు టెల్ అవీవ్ చేరుకున్నారు. వారిద్దరికీ చికిత్స జరుగుతోంది.

    79 ఏళ్ల న్యూరిట్ కూపర్, 85 సంవత్సరాల యెకెవెడ్ లిఫ్‌షిట్జ్‌‌ గత కొన్ని రోజులుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్నారు.

    వారి ఆరోగ్యం దృష్ట్యా మానవతా దృక్పథంతో ఆ ఇద్దరినీ విడుదల చేసినట్లు హమాస్ వెల్లడించింది.

    అయితే కూపర్ భర్త 85 ఏళ్ల అమిరామ్, లిఫ్‌షిట్జ్ భర్త 83 ఏళ్ల ఓడెడ్ ఇప్పటికీ గాజాలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ వెల్లడించింది.

    వీరి విడుదలలో మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్టుకు, వారిని టెల్ అవీవ్‌కు చేర్చిన రెడ్ క్రాస్‌ సంస్థకు ఇజ్రాయెల్ కృతజ్జతలు తెలిపింది.

    ఇప్పటి వరకు హమాస్ 4గురు బందీలను విడుదల చేయగా, ఇంకా 200 మందికి పైగా ప్రజలు హమాస్ వద్ద బందీలుగా ఉన్నారని ఇజ్రాయెల్ అంటోంది.

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.