లైవ్ పేజీ అప్డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్తో రేపు ఉదయం కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హైదరాబాద్లోని ఒక కుటుంబంలో నలుగురు చనిపోయి కనిపించినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్తో రేపు ఉదయం కలుద్దాం.
హైదరాబాద్లోని ఒక కుటుంబంలో నలుగురు చనిపోయి కనిపించినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.
వారు ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోందని ఓయూ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎల్ఆర్ నాయక్ వెల్లడించారు.
వివిన్ ప్రతాప్, ఆయన భార్య ఉరి వేసుకుని కనిపించగా... ప్రతాప్ కూతురు, తల్లి మంచం మీద పడి ఉన్నారని ఆయన చెప్పారు.
అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్పై ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలకు త్రుటిలో ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదంలో ఎంపీ మిథున్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది గాయపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు ఒకే కారులో బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కాన్వాయ్లోని వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి కాన్వాయ్లోని కారు పల్టీలు కొట్టింది. ఆ కారులో ఉన్న మిథున్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి, భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు ఎటువంటి గాయాలు అవలేదు.
మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను వయాకామ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సొంతం చేసుకుంది.
ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్వీట్ ద్వారా ప్రకటించారు.
2023-27 కాలానికి గానూ మహిళల ఐపీఎల్ మీడియా హక్కుల కోసం వయాకామ్ రూ. 951 కోట్లతో బిడ్ దాఖలు చేసింది.
అంటే ఒక్కో మ్యాచ్ ప్రసార హక్కుల కోసం రూ. 7.09 కోట్లు చెల్లించనుంది.
మహిళా క్రికెటర్లకు వేతన సమానత్వం తర్వాత ప్రసారహక్కులకు సంబంధించిన ఈ బిడ్డింగ్ మహిళల క్రికెట్లో మరో చారిత్రక అంశం అని జైషా ట్వీట్ చేశారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు తర్వాత తెలుగు సినిమా ‘ఆర్ఆర్ఆర్’ తాజాగా క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ను కూడా సొంతం చేసుకుంది.
క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్- 2023లో ఉత్తమ విదేశీ భాష చిత్రం కేటగిరీలో ఆర్ఆర్ఆర్ సినిమాకు అవార్డు దక్కింది.
దీనితో పాటు ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాట అవార్డును గెలుచుకుంది.
ఈ విషయాన్ని క్రిటిక్స్ చాయిస్ అవార్డ్స్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా తెలిపింది.
‘‘ఆర్ఆర్ఆర్ సినిమా తారాగణానికి శుభాకాంక్షలు. క్రిటిక్స్ చాయిస్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ అవార్డును సొంతం చేసుకుంది’’ అని ట్వీట్లో పేర్కొంది.
నాటు నాటు పాట మరో అవార్డును సొంతం చేసుకుందంటూ ఆర్ఆర్ఆర్ మూవీ ట్విటర్ ఖాతా వెల్లడించింది.
గత వారమే నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది.
అమెరికా-కెనడా క్రిటిక్స్ చాయిస్ అసోసియేషన్ (సీసీఏ) ప్రతీ ఏడాది ఈ అవార్డులను అందిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న టి. గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ను పున:పరిశీలించాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం కోర్టు కోరింది.
ఎర్ర గంగి రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరించింది.
‘‘ఒకసారి డిఫాల్డ్ బెయిల్పై విడుదలైన తర్వాత విచారణకు సహకరించకపోవడం వంటి కారణాలను చూపిస్తూ దాన్ని తిరస్కరించలేం’’ అని సుప్రీం కోర్టు తీర్పులో పేర్కొంది.
బెయిల్ పిటిషన్పై అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను ఇప్పటికే సుప్రీం కోర్టు తెలంగాణకు బదిలీ చేసింది. గంగిరెడ్డి బెయిల్ రద్దుపై కూడా తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది.
నేపాల్లో పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కూలిపోయిన యతి ఎయిర్లైన్స్ విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ లభ్యమైందని కాఠ్మండూ ఎయిర్పోర్ట్ అధికారి తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన కమిటీ ఈ బ్లాక్ బాక్స్ కోసం ఎదురుచూస్తోంది.
సోమవారం ఉదయం నుంచి బ్లాక్ బాక్స్ అన్వేషణ సాగింది.
ఆదివారం రాత్రి వరకు సహాయక చర్యలు కొనసాగాయని, ప్రయాణికుల ఆచూకీ కోసం అన్వేషణ సాగిందని అధికారులు చెప్పారు. ఇప్పటివరకు మొత్తం 68 మృతదేహాలను బయటకు తీసినట్లు వెల్లడించారు.
ఈ ప్రమాదానికి గల కారణాలను విమానం వెనుక భాగంలో అమర్చి ఉండే ఈ బ్లాక్ బాక్స్ ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
విమాన ప్రమాదం ఎలా జరిగిందో బ్లాక్ బాక్స్ ద్వారా తెలుస్తుందని కమిటీ సభ్యుడు బుద్ధిసాగర్ లమిచానే బీబీసీతో అన్నారు.
బ్లాక్ బాక్స్లో ఫ్లయిట్ డాటా రికార్డర్తో పాటు కాక్పిట్ వాయిస్ రికార్డర్ కూడా ఉండటం వల్ల దర్యాప్తులో ఇది చాలా కీలకంగా మారుతుందని ఆయన వెల్లడించారు.
ఒక పెంపుడు కుక్క కారణంగా ఫుడ్ డెలివరీకి వెళ్లిన స్విగ్గీ డెలివరీ బాయ్ మృతి చెందారు.
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో జరిగిందని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
ఏఎన్ఐ తెలిపిన వివరాల ప్రకారం, స్విగ్గీ డెలివరీ బాయ్ అయిన రిజ్వాన్ ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి శోభన అనే మహిళ ఇంటికి వెళ్లారు.
ఆ మహిళకు చెందిన పెంపుడు కుక్క దాడి చేయడంతో తప్పించుకునే క్రమంలో రిజ్వాన్ భవనం మొదటి అంతస్థు నుంచి కింద పడ్డారు.
గాయాల పాలైన ఆయన ఆసుపత్రిలో కన్నుమూశారు.
ఈ నేపథ్యంలో పెంపుడు కుక్క యజమాని శోభనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారని వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
అఫ్గానిస్తాన్ మాజీ మహిళా ఎంపీ ముర్సల్ నబీజాదా హత్యకు గురయ్యారు.
కాబూల్లోని ఆమె నివాసంలో ముర్సల్తో పాటు ఆమె భద్రతా సిబ్బందిని కాల్చి చంపారు.
2021 ఆగస్టులో తాలిబాన్లు అఫ్గాన్లో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత చాలామంది అఫ్గాన్ను వదిలి వెళ్లిపోయారు. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక కూడా అఫ్గాన్లోనే ఉన్న మహిళా ఎంపీలలో 32 ఏళ్ల ముర్సల్ కూడా ఒకరు.
ఆదివారం జరిగిన ఈ ఘటనలో ఆమె సోదరునితో పాటు మరో భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అఫ్గాన్లో మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి