లైవ్ పేజీ అప్డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ రేపు ఉదయం కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
391 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన లంక జట్టు 73 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ రేపు ఉదయం కలుద్దాం.
శ్రీలంకతో తిరువనంతపురంలో జరిగిన మూడో వన్డేలో 317 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 391 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన లంక జట్టు 73 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది.
భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 4 వికెట్లు, మహ్మద్ షమీ 2 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగుల భారీ స్కోరు సాధించింది.
కోహ్లీ 110 బంతుల్లో(13 ఫోర్లు, 8 సిక్స్లు) 166 పరుగులు సాధించాడు. ఓపెనర్ శుభ్ మన్ గిల్ 116 పరుగులు కొట్టగా కెప్టెన్ రోహిత్ శర్మ 42 పరుగులు చేశాడు.
మొత్తానికి మూడు వన్డేల సిరీస్ను భారత జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది.
భారత్తో జరుగుతున్న మూడవ వన్డేలో శ్రీలంక ఆటగాళ్లు గాయపడ్డారు.
43వ ఓవర్లో కోహ్లీ కొట్టిన ఫోర్ను ఆపేందుకు ప్రయత్నించిన బండార, జెఫ్రీ... బౌండరీ లైన్ వద్ద ఒకరినొకరు ఢీ కొట్టారు.
గ్రౌండ్లోకి వచ్చిన ఫిజియోథెరపిస్టులు స్ట్రెచర్లు తెప్పించి వారిని తీసుకెళ్లారు.
నేపాల్లోని పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం కూలిపోయినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.
72 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ విమానంలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు తెలిసింది.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారని, ప్రస్తుతానికి విమానాశ్రయాన్ని మూసివేసినట్లు ఏఎన్ఐ తెలిపింది.
నేపాల్లోని పోఖరా అంతర్జాతీయ విమానాశ్రయానికి, ఓల్డ్ విమానాశ్రయానికి మధ్యలో యెతి ఎయిర్లైన్స్ విమానం కూలిపోయిందని యెతి ఎయిర్లైన్స్ అధికార ప్రతినిధి సుదర్శన్ బర్టౌలా చెప్పినట్లు ‘ద ఖాట్మండు పోస్ట్’ను ఉటంకిస్తూ ఏఎన్ఐ పేర్కొంది.
తెలుగు రాష్ట్రాల మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు.
సెమీ హైస్పీడ్ రైలు అయిన వందేభారత్ ఎక్స్ప్రెస్ తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం మధ్య ప్రయాణిస్తుంది.
ఆదివారం ఉదయం 10: 30 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్గా జెండా ఊపి రైలును ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పండుగ వాతావరణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు గొప్ప కానుక అందిందని అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల సంస్కృతిని, వారసత్వాన్ని వందేభారత్ ఎక్స్ప్రెస్ అనుసంధానిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘వందేభారత్ రైలు, నయా భారత్ సామర్థ్యానికి నిదర్శనం. భారతదేశం కలలు, ఆకాంక్షలకు ఇది ప్రతీక’’ అని అన్నారు.
సికింద్రాబాద్లో జరిగిన కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లతో పాటు రైల్వేశాఖ ఉన్నతాధికారులుపాల్గొన్నారు.
మిస్ యూనివర్స్ టైటిల్ను అమెరికాకు చెందిన ఆర్ బోనీ గాబ్రియెల్ గెలుచుకున్నారు.
అమెరికాలోని న్యూ ఓర్లాన్స్లో జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు.
గాబ్రియెల్తో పాటు వెనిజులా, డొమినిక్ రిపబ్లిక్ దేశాలకు చెందిన పోటీదారులు టాప్-3లో నిలిచారు.
భారత్ నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న దివితా రాయ్కు నిరాశ్ ఎదురైంది. ఆమె టాప్-16కి కూడా చేరుకోలేకపోయారు.
విజేత గాబ్రియెల్కు గతేడాది మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు కిరీటాన్ని అలంకరించారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఉదయం 10:30 గంటలకు వర్చువల్గా ప్రారంభించనున్నారు.
వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ.. జెండా ఊపి రైలును లాంఛనంగా ప్రారంభిస్తారు.
భారత రైల్వే శాఖ ప్రవేశపెట్టిన ఎనిమిదో వందేభారత్ రైలు ఇది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 700 కి.మీ దూరం ఇది ప్రయాణిస్తుందని రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లతో పాటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లలో వందేభారత్ ఎక్స్ప్రెస్ ఆగుతుందని తెలిపింది.
రైలు ప్రారంభానికి ముందు శనివారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, వందేభారత్ రైలును పూర్తిగా తనిఖీ చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి