You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

యుక్రెయిన్: మరియుపూల్‌ రోడ్లపై యుద్ధ ట్యాంకులు, నగరం మధ్యకు చేరుకున్న పోరాటం

భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇద్దరు నాయకులు పలు అంశాలపై చర్చలు జరిపారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

లైవ్ కవరేజీ

సతీష్ ఊరుగొండ, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  1. యుక్రెయిన్: మరియుపూల్ రోడ్లపై ట్యాంకులు, నగరం మధ్యకు చేరిన యుద్ధం

    యుక్రెయిన్ రేవు నగరం మరియుపూల్‌లో భీకర పోరాటం జరుగుతోంది. రష్యా ఇక్కడ వరసగా దాడులు చేస్తోంది.

    నగరంలో కొనసాగుతున్న భీకర పోరు వల్ల బాంబు దాడులకు గురైన థియేటర్ శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడడం కష్టంగా మారిందని మరియుపూల్ నగర మేయర్ చెప్పారు.

    యుద్ధం ఆగినప్పుడే సహాయ సిబ్బంది శిథిలాలు తొలగించడానికి వీలవుతుందని మేయర్ వాదిన్ బాయ్‌షోంకో తెలిపారు.

    థియేటర్ ఉన్న ప్రాంతాన్ని పౌర నివాస ప్రాంతంగా చెప్పినప్పటికీ దానిపై రష్యా బాంబులు ప్రయోగించిందని యుక్రెయిన్ అధికారులు చెప్పారు. కానీ రష్యా ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

    రష్యా సైన్యం మరియుపూల్‌ను చుట్టుముట్టింది. నగరంలో విద్యుత్, తాగునీరు, గ్యాస్ సరఫరా ఆగిపోయింది.

    రష్యా నగరంలోకి మానవతా సాయం అందించే దారులు కూడా మూసివేసింది. దాదాపు మూడు లక్షల మంది ఇప్పటికీ నగరంలోనే ఉన్నారు.

    యుక్రెయిన్ చెప్పిన వివరాల ప్రకారం ఆస్పత్రులు, చర్చిలు, లెక్కలేనన్ని నివాస ప్రాంతాలపై రష్యా బాంబు దాడులు జరిపింది. నగరంలో 80 శాతం భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఇక్కడ జరిగిన నష్టాన్ని పూడ్చలేమని స్థానిక అధికారులు భావిస్తున్నారు.యుక్రెయిన్, రష్యా అప్‌డేట్స్ కోసం బీబీసీ న్యూస్ లైవ్ పేజీని చూడండి. ధన్యవాదాలు.

  2. రష్యాను ఎదుర్కొనేందుకు యుక్రెయిన్‌కు అమెరికా ఏయే ఆయుధాలు ఇచ్చింది?

    ఒకప్పుడు అఫ్గానిస్తాన్‌లో రష్యాను ముప్పుతిప్పలు పెట్టిన ఆయుధాలను అమెరికా ఇప్పుడు యుక్రెయిన్‌కు ఇచ్చింది.

    అయితే, కొన్ని ఆయుధాలు కావాలని అడిగినా కూడా అమెరికా యుక్రెయిన్‌కుఎందుకు ఇవ్వడం లేదు.

    తమ కంటే ఎక్కువగా, మెరుగైన ఆయుధాలున్న రష్యా దాడిని ఎదుర్కోడానికి యుక్రెయిన్‌కు ఇవి సహాయం చేయగలవా?

  3. మల్లు స్వరాజ్యం: భూస్వామ్య కుటుంబంలో పుట్టి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం

    తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమాలు, అందులోనూ సాయుధ పోరాటాలలో పాల్గొన్న ప్రముఖ మహిళల్లో మల్లు స్వరాజ్యం అగ్రభాగంలో నిలుస్తారు.

    అటు దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంతోపాటు, ఇటు నిజాం నవాబు అరాచకాలకు ఎదురొడ్డి నిలిచారు మల్లు స్వరాజ్యం.

    భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మల్లు స్వరాజ్యంది కీలక పాత్ర.

    13 ఏళ్ల చిరు ప్రాయంలోనే నిజాం, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమంలోకి దిగిన మల్లు స్వరాజ్యం పీడిత, తాడిత వర్గాల అభ్యున్నతి కోసం, హక్కుల కోసం పోరాడారు.

    పుట్టింది భూస్వామ్య కుటుంబంలోనే అయినా, అదే భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరు సాగించారు.

  4. బ్రేకింగ్ న్యూస్, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

    సీపీఎం ప్రముఖ నాయకురాలు, తెలంగాణ సాయుధ పోరాట సభ్యురాలు మల్లు స్వరాజ్యం మరణించారు.

    ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లో చికిత్స అందిస్తున్నారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె 1931లో జన్మించారు.

    స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాటంలో అలనాటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో పనిచేశారు. తదనంతరం సీపీఎం పార్టీలో కొనసాగారు. ఆమె సోదరుడు భీమిరెడ్డి నరసింహా రెడ్డి కూడా సాయుధ పోరాట యోధుడే. ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమెకు ముగ్గురు సంతానం.

  5. 14000 మంది రష్యా సైనికులు చనిపోయారు: యుక్రెయిన్

    యుక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టిన మొదటి మూడు వారాల్లో 14,400 మంది రష్యా సైనికులు చనిపోయారని యుక్రెయిన్ అధికారులు చెప్పారు.

    1470 సైనిక వాహనాలు, 100కుపైగా ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లను కూల్చేసినట్లు యుక్రెయిన్ సైనిక అధికారులు ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో తెలిపారు.

    ఈ వివరాలను బీబీసీ స్వయంగా వెరిఫై చేయలేదు.

    అయితే, 7 వేల మంది రష్యా సైనికులు చనిపోయారని, 14 వేల నుంచి 21వేల మంది సైనికులు గాయపడ్డారని పశ్చిమ దేశాల నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.

  6. కడప రాయలసీమ రణభేరి సభలో బీజేపీ నాయకులు ఏమన్నారంటే..

    కడపలో రాయలసీమ రణభేరి సభను నిర్వహించింది బీజేపీ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు నేతలు ఈ సభలో పాల్గొన్నారు.

    రాయలసీమలో పేదరిక నిర్మూలన కోసం ఏం చేశారో జగన్ సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.

    జగన్.. అప్పులు తెచ్చి ఎన్ని రోజులు అభివృద్ధి చేస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

    బీజేపీలో చేరితే కేసులు పెడతామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

    పెండింగ్ ప్రాజెక్టుల సాధనే బీజేపీ లక్ష్యమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. వైసీపీ కక్షపూరిత పాలన చేస్తోందని ఆరోపించారు.

    పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ప్రతిపక్షాలు ఏకమై జగన్‌ను గద్దె దించాలని బీజేపీ ఏపీ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సూచించారు.

    రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అవుతున్నా ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు.

  7. దిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో నరేంద్ర మోదీతో జపాన్ ప్రధాని భేటీ

    భారత పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

    ఇద్దరు నాయకులు పలు అంశాలపై చర్చలు జరిపారని ప్రధాని కార్యాలయం వెల్లడించింది.

    ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతి సంబంధాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిల్లీలోని హైదరాబాద్‌ హౌజ్‌లో ఇరువురు నేతలు చర్చించారని ఏఎన్ఐ వార్తా సంస్థ పేర్కొంది.

  8. #TheKashmirFiles: జమ్మూలో స్థిరపడిన కశ్మీర్‌ పండిట్‌లు ఏమంటున్నారు?

    'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా విడుదలైన తర్వాత కశ్మీర్‌లోని నగ్రోటా సమీపంలో ఉన్న జగ్తీ టౌన్‌షిప్‌లో నివసించే కశ్మీరీ పండిట్ కుటుంబాలు మరోసారి 'ఘర్ వాపసి' కలలు కనడం ప్రారంభించాయి.

    2011లో ఈ జగ్తీ టౌన్‌షిప్‌ను నిర్మించారు. ఇందులో సుమారు 4 వేల నిర్వాసిత కుటుంబాలు నివసిస్తున్నాయి.

    విడుదలైన తర్వాత తీవ్ర చర్చనీయాంశంగా మారిన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా తాము తిరిగి స్వస్థలాలకు తీసుకెళ్లే ప్రయత్నాలను సులభతరం చేస్తుందా లేక అడ్డంకులు సృష్టిస్తుందా అని వారంతా ఆందోళన చెందుతున్నారు.

    మూడు దశాబ్ధాలు గడిచినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కశ్మీరీ హిందువులను స్వస్థలాలకు చేర్చడంలో విఫలమయ్యాయి.

    జగ్తి టౌన్‌షిప్‌లో నివసిస్తున్న నిర్వాసితులందరూ ఈ సినిమాను మెచ్చుకుంటూనే, 1990 నుండి ఇప్పటి వరకు ఇలాంటి చాలా సినిమాలు వచ్చాయని, కానీ తమ జీవితంలో మార్పు రాలేదని అంటున్నారు.

  9. యుక్రెయిన్ ఆయుధాగారంపై హైపర్‌సోనిక్ మిసైల్‌ ప్రయోగించాం: రష్యా

    పశ్చిమ యుక్రెయిన్‌లోని భూగర్భ ఆయుధాగారాన్ని టార్గెట్ చేస్తూ తాము హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించామని రష్యా రక్షణ శాఖ చెప్పింది.

    రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ చెప్పిన వివరాల ప్రకారం ఈ దాడితో యుక్రెయిన్ ఇవానో-ఫ్రాంకివ్స్క్ ప్రాంతంలోని ఆయుధాగారం ధ్వంసమైంది.

    తాము లక్ష్యంగా చేసుకున్న స్థావరాల్లో యుక్రెయిన్ సైన్యం క్షిపణులు, వైమానిక ఆయుధాలు ఉన్నాయని రష్యా రక్షణ శాఖ చెప్పింది.

    హైపర్‌సోనిక్ క్షిపణులు అధునాతనమైనవి. ఈ రకం క్రూయిజ్ మిసైళ్లు ధ్వని వేగానికి ఐదురెట్ల వేగంతో ప్రయాణిస్తాయి.

    యుక్రెయిన్ మీద తాము ప్రయోగిస్తున్న కింజాల్ క్షిపణులు రెండు వేల కిలోమీటర్ల దూరం వరకూ లక్ష్యాలను ఛేదించగలవని రష్యా చెబుతోంది.

    ఇవి అన్నిరకాల వైమానిక, క్షిపణి డిఫెన్స్ సిస్టమ్‌లను తప్పించుకోగలవు. అయితే రష్యా ఈ వాదనను బీబీసీ స్వయంగా వెరిఫై చేయలేదు.

  10. మహిళల వరల్డ్ కప్: భారత్‌పై విజయంతో సెమీస్‌లో ఆస్ట్రేలియా

    న్యూజీలాండ్‌లో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టుపై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

    అక్లాండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో మహిళా ప్రపంచ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోరును చేజ్ చేసిన ఆస్ట్రేలియా టోర్నీలో సెమీస్‌కు చేరుకుంది.

    భారత్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేయగా, ఆసీస్ మరో మూడు బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

    జట్టును విజయ పథంలో నడిపిన ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్ (97) తన 15వ వన్డే సెంచరీ మిస్సయ్యారు. చివరి వరకూ నిలిచిన లానింగ్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు ఉన్నాయి.

    ఆసీస్ ఓపెనర్లు హేన్స్(43), హీలీ(72) పరుగులు చేయగా, పెర్రీ 28 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మూనీ(30) మెక్ గ్రాత్(0) నాటౌట్‌గా నిలిచారు.

    భారత బౌలర్లలో పూజా వస్త్రకర్‌కు 2, సింగ్, రానాకు చెరో వికెట్ లభించాయి.

    ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ కొత్త రికార్డ్ సృష్టించారు. మహిళా వరల్డ్ కప్‌లో ఎక్కువసార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రికార్డ్ సమం చేశారు.

    ఇప్పటివరకూ ఈ రికార్డ్ న్యూజీలాండ్ మాజీ బ్యాటర్ డెబీ హాక్లీ పేరున ఉంది.

    మిథాలీ, డెబీ ఇద్దరూ వరల్డ్ కప్‌లో 12 సార్లు 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేశారు.

    మిథాలీ రాజ్ ఈ మ్యాచ్‌లో 96 బంతుల్లో 1 సిక్స్, 6 ఫోర్లతో 68 పరుగులు చేశారు. మిథాలీకి వన్డేల్లో ఇది 68వ హాఫ్ సెంచరీ.

  11. ఘనా: ఆధునిక యుగంలో రాణి పాలన ఎలా ఉంటుంది?

  12. అణు నిరోధకం అంటే ఏంటి? 1 నిమిషం వీడియో

  13. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన, అతిపెద్ద రష్యా సైన్యం యుక్రెయిన్‌లో ఎందుకు వెనుకబడింది?

    ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన, అతిపెద్ద సైనిక శక్తి ఉన్న దేశాల్లో రష్యా ఒకటి. కానీ యుక్రెయిన్‌పై ప్రారంభ దండయాత్రలో రష్యా సాయుధ బలగాల ప్రభావం స్పష్టంగా కనిపించలేదు.

    యుద్ధరంగంలో రష్యా ప్రదర్శనపై పశ్చిమ దేశాలకు చెందిన చాలామంది మిలిటరీ విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. రష్యా ప్రదర్శన 'నిరుత్సాహంగా' ఉందని ఒకరు వ్యాఖ్యానించారు.

    రష్యా మిలిటరీ పురోగమనం చాలావరకు నిలిచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కోల్పోయిన నష్టాల నుంచి రష్యా మిలిటరీ కోలుకోగలదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

    ''ఇప్పటివరకు తమ లక్ష్యాలను రష్యన్లు అందుకోలేదనేది సుస్పష్టం. బహుశా ఇకముందు కూడా ఇలాగే ఉండొచ్చు'' అని సీనియర్ నాటో మిలిటరీ అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.

    మరి రష్యా విషయంలో తప్పు ఎక్కడ జరిగింది? రష్యా మిలిటరీ చేసిన పొరపాట్ల గురించి సీనియర్ పాశ్చాత్య మిలిటరీ అధికారులతో, నిఘా వర్గాల అధికారులతో బీబీసీ మాట్లాడింది.

  14. బిర్యానీ తింటే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి, నపుంసకత్వం వస్తుందా? ఈ ప్రచారంలో నిజమెంత?

    మనలో చాలామందికి 'బిర్యానీ' అనే మాట వింటేనే నోరు ఊరుతుంది. ఈ బిర్యానీలో హైదరాబాద్ బిర్యానీ, దిండిగల్ బిర్యానీ, అంబూర్ బిర్యానీ, మలబార్ బిర్యానీ, తాళప్పకట్టి బిర్యానీ, మండీ బిర్యానీ లాంటి అనేక రకాలు ఉన్నాయి. కుండ బిర్యానీ, బొంగు బిర్యానీ, కొబ్బరి చిప్ప బిర్యానీ వంటి కొత్త రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

    పర్షియాలో పుట్టిన బిర్యానీ, ఇప్పుడు కేవలం ఇండియాలోనే కాక, అమెరికా, అప్గానిస్తాన్, ఇరాన్, థాయిలాండ్, దక్షిణాఫ్రికాలలో కూడా ప్రాచుర్యం పొందింది.

    ఇండియాలో జొమాటో, స్విగ్గీలాంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లలో బిర్యానీయే మోస్ట్ ఫేవరేట్ ఫుట్ ఐటమ్ అని నివేదికలు చెబుతున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు బిర్యానీ ఇప్పడు అందరికీ ప్రియమైన వంటకం. కేవలం బిర్యానీ పాయింట్లు పెట్టి ధనవంతులైన వాళ్లు ఉన్నారు.

    మటన్, చికెన్ బిర్యానీ రకాలను చాలామంది ఇష్టపడుతుంటారు. పనీర్, వెజిటబుల్, మష్రూమ్, ఫిష్ బిర్యానీ రకాలు కూడా ఉంటాయి.

    కానీ, ఇక్కడ బిర్యానీ గురించి చెప్పబోతున్న విషయాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ఎందుకంటే బిర్యానీ రుచికి మైమరిచిపోయి తినడమేగానీ, దాని సైడ్‌ ఎఫెక్ట్స్ గురించి చాలామంది పట్టించుకోరు.

  15. పంజాబ్ మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తి

    పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ప్రభుత్వం మంత్రుల ప్రమాణ స్వీకారం చండీగఢ్‌లో జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తొలి క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.

  16. బంగ్లాదేశ్: హిందూ ఆలయంపై దాడి, అసలు కథ ఏంటి?

    బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం ఒక హిందు దేవాలయంపై ఆందోళనకారుల సమూహం దాడికి తెగబడింది. ఆలయ ప్రహారి గోడలోని కొంతభాగాన్ని కూల్చివేసింది.

    ఆందోళనకారుల దాడిలో తన సహాయకులు ఇద్దరు గాయపడినట్లు రాధాకాంతా ఇస్కాన్ దేవాలయ పూజారి కృష్ణా దాస్ ఆరోపించారు.

    ఈ ఘటన వెనుక భూమికి సంబంధించిన వివాదం ఉన్నట్లు చెబుతున్నారు.

    స్థానిక మత సంస్థలు ఆలయంపై దాడిని ఖండించాయి. ఆలయ భూమి విషయంలో స్థానికంగా బలంగా ఉన్న ఒక వర్గానికి మధ్య ఏర్పడిన వివాదం కారణంగానే తాజా ఘటన జరిగిందని 'హిందూ బౌద్ధ్ ముస్లిం ఏక్తా పరిషత్' వ్యాఖ్యానించింది.

    అదే సమయంలో దాడి ఆరోపణల్లో నిజం లేదని పోలీసులు చెబుతున్నారు.

  17. కర్ణాటకలో బస్సు ప్రమాదం 8 మంది మృతి, 25 మందికి తీవ్ర గాయాలు, బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

    కర్ణాటకలోని తుమకూరు జిల్లా పాలవల్లి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని వైఎన్ హోసకోటె నుంచి పావడగ వెళుతున్న బస్సు రోడ్డుపక్కన బోల్తా పడింది.

    ఈ పావగడ, వైఎన్ హోసకోటె ప్రాంతాలు అనంతపురం జిల్లాను ఆనుకునే ఉంటాయి. అనంత జిల్లా మడకశిర, కళ్యాణ దుర్గల మధ్య ఉంటాయి ఈ ప్రాంతాలు.

    ఈ ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. 25 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ఉన్నారు.

    ఎస్వీటీ అనే ప్రైవేటు సంస్థకు చెందిన బస్సు ఇది.

    స్థానికలు, అధికార యంత్రాంగం సహాయక చర్యలు అందిస్తున్నారు. స్థానికుల సహాయంతో బస్సును పైకి లేపి పక్కకు తరలించారు. మృతదేహాలో రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడ్డాయి.

    పరిస్థితి విషమంగా ఉన్న వారిని బెంగళూరు ఆసుపత్రులకు తరలించారు. స్థానిక నాయకులు వారిని బాధితులను పరామర్శించి పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.

  18. మీరు తెలుసుకోవాల్సిన తాజా సమాచారం..

    మీరు మా లైవ్ పేజీకి ఇప్పుడే వచ్చినట్లైతే.. మీరు తెలుసుకోవాల్సిన తాజా సమాచారం ఇదీ..

    స్థానికం

    • మార్చి 19వ తేదీ అర్థరాత్రి 2 గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్‌కు గురైందని ఆ పార్టీ ప్రకటించింది. దీనిని పునరుద్ధరిస్తుండగా ఖాతాను ట్విటర్ డీయాక్టివేట్ చేసిందని, అందుకే పునరుద్ధరణకు సమయం పడుతోందని తెలిపింది.

    జాతీయం

    • పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం చండీగఢ్‌లో జరుగుతోంది. 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
    • ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆక్లాండ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో భారత జట్టు తలపడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 68 పరుగులు (96 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లు), యస్తికా భాటియా 59 పరుగులు (83 బంతుల్లో ఆరు ఫోర్లు), హర్మాన్ ప్రీత్ కౌర్ 57 పరుగులు నాటౌట్ (47 బంతుల్లో ఆరు ఫోర్లు) రాణించారు.
    • ఈ అప్‌డేట్ రాసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 12 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 76 పరుగులు చేసింది.

    అంతర్జాతీయం

    • ఏమాత్రం ఆలస్యం చేకుండా రష్యాతో శాంతి చర్చలు జరగాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ కోరారు
    • ‘‘లేకపోతే రష్యా నష్టాలు ఎంతగా ఉంటాయంటే.. వాటి నుంచి తేరుకునేందుకు ఎన్నో తరాల సమయం పడుతుంది’’ అని జెలియెన్‌స్కీ అన్నారు.
    • మరియుపూల్ నగరంలో యుద్ధం తీవ్రంగా జరుగుతోంది. సిటీ సెంటర్‌కు చేరుకున్నామన్న రష్యా దళాల ప్రకటనను మేయర్ కూడా ధృవీకరించారు. రష్యా బాంబుల ధాటికి నగరంలోని 80 శాతం భవనాలు దెబ్బతిన్నాయని చెప్పారు.
    • మరియుపూల్ థియేటర్‌పై గురువారం రష్యా బాంబుదాడి చేసింది. ఆ థియేటర్ బేస్‌మెంట్‌లో ఇప్పటికీ వందలాది మంది ప్రజలు చిక్కుకుపోయారు.
    • రష్యా నిరంతరాయంగా కాల్పులు జరుపుతుండటంతో నగరం నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు హ్యూమన్ కారిడార్ ఏర్పాటు సాధ్యం కావట్లేదని జెలియన్‌స్కీ అన్నారు.
    • ‘‘మేం ముందుగా రచించుకున్న ప్రణాళికలు అన్నింటినీ కచ్చితంగా అమలు చేస్తాం’’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు.
  19. పంజాబ్ కొత్త మంత్రులు వీళ్లే..

    పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కొత్త మంత్రివర్గం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనుంది.

    ముఖ్యమంత్రి భగవంత్ మాన్ 10 మందితో కొత్త క్యాబినెట్ ఏర్పాటు చేయనున్నారు.

    ఈ పేర్లను భగవంత్ మాన్ ట్విటర్లో ప్రకటించడం విశేషం.

    కొత్త మంత్రులు వీళ్లే..

    • హర్పాల్ సింగ్ చీమా
    • డాక్టర్ బల్జిత్ కౌర్
    • హర్భజన్‌ సింగ్ ఈటీఓ
    • డాక్టర్ విజయ్ సింగ్లా
    • లాల్ చంద్ కటారుచక్
    • గుర్మీత్ సింగ్ మీట్ హయర్
    • కుల్దీప్ సింగ్ ధాలీవాల్
    • లాల్జిత్ సింగ్ భుల్లర్
    • బ్రమ్ శంకర్ (జింపా)
    • హర్జోత్ సింగ్ బ్రెయిన్స్
  20. అప్పు చేయకపోవడం కూడా తప్పేనా? చేస్తే ఎంత చేయాలి, ఎలా చేయాలి?

    అప్పు చేయడం కొందరికి తప్పనిసరి కావచ్చు. కానీ, అలా చేయడం ఎక్కువమందికి ఇష్టం ఉండదు. వ్యక్తిగతంగా చూస్తే ఇది మంచి ఆలోచనే. కానీ, ఒక దేశ ఆర్ధిక వ్యవస్థ విషయానికి వస్తే మాత్రం సరైన వ్యూహం కాదు. పెట్టుబడుల కోసం అప్పు చేయడం మంచి ఆలోచనని నిపుణులు అంటున్నారు.

    నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాలు సంపన్న దేశాలే. వాటి అప్పుల స్థాయి చాలా తక్కువగా ఉంది. కానీ, అవి మార్కెట్‌లో రుణాలు తీసుకోక పోయినట్లయితే, ధనిక దేశాలుగా మారే అవకాశాన్ని కోల్పోయేవి.

    ''అప్పు ఉండటం గొప్పా కాదు, తప్పూ కాదు. అది ఒకదేశం ఆర్ధిక వనరులను పొందగలిగే పరిస్థితులను బట్టి ఉంటుంది'' అని ఆర్థిక సేవలు అందించే ఫాల్కామ్ అసెట్ మేనేజర్‌ సంస్థలో ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీస్ డిప్యూటీ మేనేజర్ గా పని చేస్తున్న హ్యూగో ఒసోరియో బీబీసీతో అన్నారు.

    అధిక పొదుపు, స్వల్పలోటు, ఆర్థిక ఖాతాలు సవ్యంగా నిర్వహించే దేశాలకు 'జీరో డెట్'(సున్నారుణం) కలిగి ఉండటం అంత మంచిదేమీ కాదంటున్నారు ఆర్ధిక నిపుణులు.