అమృత్‌సర్, పఠాన్‌కోట్, శ్రీనగర్‌లలో పేలుళ్లు.. జమ్మూ, పూంఛ్‌లో ఉద్రిక్తం

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకూ, అంతర్జాతీయ సరిహద్దుతో పాటు పాకిస్తాన్‌తో నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రదేశాల్లో డ్రోన్లు కనిపించాయని ఇండియన్ ఆర్మీ తెలిపింది.

సారాంశం

  • ఐపీఎల్ 2025 మిగిలిన మ్యాచ్‌లు ఒక వారం పాటు నిలిపివేస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది.
  • భారత సైనిక ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం నిర్వహించి, సన్నాహాలను సమీక్షించారు.
  • కొన్నిరోజులపాటు పౌరవిమానాలు తమ గగనతలాన్ని వినియోగించవద్దని పాకిస్తాన్ సూచించింది.
  • జమ్ముకశ్మీర్ లోని ఉధంపూర్, కశ్మీర్‌లోని పలు ప్రాంతాలు, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌పై పాక్ డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించిందని, వాటిని కూల్చివేశామని భారత అధికారులు పేర్కొన్నారు. పాకిస్తాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.
  • దేశంలో 24 విమానాశ్రయాలు మూసివేత. పౌర విమానసేవలు రద్దు
  • ఇండియా, పాకిస్తాన్ మధ్య ఘర్షణలు ఎటువంటి పరిష్కారాన్ని చూపవని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ చెప్పారు.
  • కొత్త పోప్‌గా రాబర్ట్ ప్రివోస్ట్ ఎన్నికయ్యారు.

లైవ్ కవరేజీ

శ్రీనివాస్ నిమ్మగడ్డ

  1. అమృత్‌సర్, పఠాన్‌కోట్, శ్రీనగర్‌లలో పేలుళ్లు.. జమ్మూ, పూంఛ్‌లో ఉద్రిక్తం

    భారత్, పంజాబ్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, పఠాన్‌కోట్‌లో పలు చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

    పంజాబ్‌లోని సరిహద్దు పట్టణాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

    పఠాన్‌కోట్‌లో అనేక పేలుళ్ల శబ్దాలు విన్నామని, ఆకాశంలో వెలుగులు చూశామని బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్ చెప్పారు. ప్రతిచోటా బ్లాకౌట్ ఉందన్నారు.

    అమృత్‌సర్‌లో ఒకదాని తర్వాత ఒకటి అనేక పేలుళ్లు వినిపించాయని, ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ సమీపంలో డ్రోన్లు కూడా కనిపించాయని ఉన్న బీబీసీ ప్రతినిధి రవీందర్ సింగ్ రాబిన్ తెలిపారు. కాల్పుల శబ్దాలు వినిపించాయని ఆయన చెప్పారు.

    "నిన్న, ఈరోజు పూంఛ్‌లో భారీ షెల్లింగ్ జరిగింది. ఇందులో ఒకరు మరణించారు, కొంతమంది గాయపడ్డారు. అయితే, సరిహద్దుకి కొంచెం దూరంలో సురాన్‌కోట్ ఉంది, ఇక్కడ షెల్లింగ్ ప్రభావం పెద్దగా లేదు" అని పూంఛ్ సమీపంలోని సురాన్‌కోట్‌లో ఉన్న బీబీసీ ప్రతినిధి రాఘవేంద్రరావు చెప్పారు.

    జమ్మూలో పేలుళ్లు సంభవించాయని స్థానిక ప్రజలు చెప్పినట్లు జమ్మూలో ఉన్న బీబీసీ ప్రతినిధి దివ్య చెప్పారు.

    జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నుంచి గుజరాత్‌లోని భుజ్ వరకూ, అంతర్జాతీయ సరిహద్దుతో పాటు పాకిస్తాన్‌తో నియంత్రణ రేఖ వెంబడి 26 ప్రదేశాల్లో డ్రోన్లు కనిపించాయని ఇండియన్ ఆర్మీ తెలిపింది.

    ''భారత సాయుధ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయి. ఇలాంటి గగతనతల దాడులన్నింటినీ ట్రాక్ చేస్తూ, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలతో నిర్వీర్యం చేస్తున్నాయి’’ అని పేర్కొంది.

  2. పాకిస్తాన్ 300 నుంచి 400 డ్రోన్లతో దాడి చేసింది, తిప్పికొట్టాం : భారత్

    కల్నల్ సోఫియా

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, భారత్‌పై పాకిస్తాన్ 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించిందని ఇండియన్ ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ తెలిపారు.

    భారత్‌పై పాకిస్తాన్ 300 నుంచి 400 డ్రోన్లను ప్రయోగించిందని ఇండియన్ ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషీ అన్నారు. భారత్‌పై జరిగిన దాడుల గురించి సమాచారం ఇవ్వడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం విలేఖరుల సమావేశం నిర్వహించింది.

    "గురువారం రాత్రి భారత సైనిక స్థావరాలను పాకిస్తాన్ సైన్యం లక్ష్యంగా చేసుకుంది" అని సోఫియా ఖురేషీ అన్నారు.

    అయితే, ఈ దాడులను పాకిస్తాన్ రక్షణ మంత్రి తోసిపుచ్చారు.

    "లేహ్ నుంచి సర్ క్రీక్ వరకు 36 ప్రాంతాల్లో 300-400 డ్రోన్లు చొరబాటుకు ప్రయత్నించాయి. భారత భద్రతా దళాలు ఈ డ్రోన్లలో చాలా వాటిని కూల్చివేశాయి" అని కల్నల్ సోఫియా అన్నారు.

    అయితే, దాడులు చేయలేదని చెప్పడం ద్వారా పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని కొత్తపుంతలు తొక్కిస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆరోపించారు. పాకిస్తాన్ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

    ‘’మతపరమైన స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని పాకిస్తాన్ చెబుతోంది కానీ, పూంఛ్‌లో ఓ గురుద్వారాపై వారు దాడి చేశారు. ఆ విషయాన్ని నిన్ననే చెప్పాం. ఈ దాడిలో కొంతమంది స్థానిక సిక్కులు మరణించారు. భారతే తన నగరాలపై దాడులు చేసుకుందనే అర్థంపర్ధంలేని వాదనలు పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే చేయగలదు. ఇలాంటివి వారు ఎన్నోచేశారని చరిత్ర చెబుతోంది’’ అన్నారు.

    వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ మాట్లాడుతూ.. ‘’పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయకుండానే, మే 7వ తేదీ రాత్రి 8.30 గంటలకు డ్రోన్, క్షిపణులను ప్రయోగించింది. పాకిస్తాన్ పౌరవిమానాలను రక్షణ కవచంగా వినియోగించుకుంటోంది. దీనికి ప్రతిగా భారత్ గగనతల దాడులకు దిగుతుందని తెలిసే ఇలా చేసింది’’ అన్నారు.

  3. ఇంధన నిల్వలున్నాయి, ఆందోళన వద్దు: ఇండియన్ ఆయిల్

    ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ (ఫైల్ ఫోటో)

    దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలున్నాయని, వాహనదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) శుక్రవారం ప్రకటించింది.

    భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బంకుల ముందు వాహనదారులు బారులుదీరడంతో ఐవోసీఎల్ ఈ ప్రకటన చేసింది.

    ‘పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ (ఎల్పీజీ) కొనుగోలుకు ఆందోళన పడకండి. మా ఔట్‌లెట్స్ వద్ద తగినంత స్టాక్ ఉంది. అనవసర రద్దీ వద్దు’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది.

  4. భారత్‌లో వార్తాసంస్థ ‘ది వైర్’ వెబ్‌సైట్ నిలిపివేత

    ది వైర్ వార్తాసంస్థ

    ఫొటో సోర్స్, @thewire_in/X

    ఫొటో క్యాప్షన్, 'ది వైర్' వెబ్‌సైట్ బ్లాక్ చేయడంపై ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

    భారత్‌లో, దేశవ్యాప్తంగా 'ది వైర్' వెబ్‌సైట్ నిలిచిపోయినట్లు ఆ సంస్థ శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రకటించింది.

    ‘’ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఏవేవో కారణాలు చెబుతున్నారు. కానీ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఇలా జరిగినట్లు మాకు తెలిసింది’’ అని ఆ పోస్ట్‌లో రాసింది.

    ఇది పత్రికా స్వేచ్ఛకు రాజ్యాంగ హామీ ఉల్లంఘనగా 'ది వైర్' పేర్కొంది.

    "ఈ కఠినమైన సెన్సార్‌షిప్‌ను మేం ఖండిస్తున్నాం" అని తెలిపింది.

  5. భారత సైనిక ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష

    రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సమావేశం

    ఫొటో సోర్స్, @SpokespersonMoD/X

    ఫొటో క్యాప్షన్, భారత సైనిక ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశం

    పాకిస్తాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో శుక్రవారం భారత సైనిక ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్షించారు.

    "ఈ రోజు న్యూదిల్లీలోని సౌత్ బ్లాక్‌లో పశ్చిమ సరిహద్దులో భద్రతా పరిస్థితి, భారత సాయుధ దళాల సంసిద్ధతను సమీక్షించేందుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది" అని రాశారు.

    ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి, చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ - ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.

  6. ఐపీఎల్ వారం రోజులపాటు వాయిదా

    ఐపీఎల్‌ను వాయిదా పడింది

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ఐపీఎల్‌లో‌ ఇంకా 12 లీగ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా జరగాల్సిన మిగిలిన మ్యాచ్‌లను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది.

    ధర్మశాలలో గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్, దిల్లీ కేపిటల్స్ మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేసినప్పటి నుంచి ఐపీఎల్ ప్రస్తుత సీజన్ కొనసాగింపులో అనిశ్చితి నెలకొంది.

    ఈ నేపథ్యంలో ఆటగాళ్లు, క్రీడాభిమానుల భద్రతను దృష్టిలో ఉంచుకొని కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది.

    ఐపీఎల్ లీగ్‌ దశలో ఇంకా 12 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్‌ల అనంతరం ఈనెల 25న కోల్‌కతాలో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్ ముగియాల్సి ఉంది.

  7. ‘పాకిస్తాన్ గగనతలాన్ని వినియోగించకండి’

    pakistan defence minister

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, కొన్నిరోజులపాటు పౌరవిమానాలు తమ గగనతలాన్ని వినియోగించవద్దని పాకిస్తాన్ సూచించింది.

    పౌర విమానయాన సంస్థలు పాకిస్తాన్ గగనతలాన్ని వినియోగించవద్దని పాకిస్తాన్ సూచించినట్టు, ఆ దేశ రక్షణ మంత్రి ఖావాజా ఆసీఫ్ బీబీసీతో చెప్పారు.

    క్షిపణులు, కొన్నిరకాలైన వైమానిక కాల్పుల వల్ల పౌరవిమానాలు దెబ్బతినే అవకాశం, పౌరులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున ఈ హెచ్చరిక జారీ చేసినట్టు ఖావాజా చెప్పారు.

    భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న దృష్ట్యా పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు కొన్ని రోజుల పాటు పాకిస్తాన్ గగనతలంలో తమ విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

    మే 10 వరకు పాకిస్తాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ప్రకటించింది.

    ఇదిలావుండగా, లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ ఈ వారం ప్రారంభంలో బీబీసీతో మాట్లాడుతూ, పాకిస్తాన్ గగనతలంలో తమ విమాన కార్యకలాపాలను "తదుపరి సూచనలు వచ్చే వరకు" నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

  8. ‘పశ్చిమ సరిహద్దు వ్యాప్తంగా పాకిస్తాన్ దాడులు’: జమ్మూకశ్మీర్‌లో రాత్రంతా ఏం జరిగింది?

    పాకిస్తాన్ సైన్యం పశ్చిమ సరిహద్దు వెంబడి దాడులు చేసిందని, వాటిని తిప్పికొట్టామని భారత్ చెప్పింది

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, గురువారం రాత్రి జమ్మూకశ్మీర్‌లోని చాలా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా లేదు.

    జమ్మూలోని ఉధంపూర్, కశ్మీర్‌లోని పలు ప్రాంతాలు, పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌పై పాక్ డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించిందని, వాటిని కూల్చివేశామని భారత అధికారులు పేర్కొన్నారు.

    అయితే తాము దాడులు చేయలేదని పాకిస్తాన్ పేర్కొంది.

    పాకిస్తాన్ 16 భారత రక్షణ స్థావరాలపై రాకెట్లు, క్షిపణులతో దాడి చేసిందని, వాటిని ఆధునిక పరికరాల సహాయంతో నిర్వీర్యం చేశామని గురువారం పొద్దుపోయిన తరువాత భారత సైనిక ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

    నియంత్రణ రేఖకు అతి సమీపంలో ఉన్న పూంఛ్ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ షెల్లింగ్ జరిగిందని, ఈ ఘటనలో లోహాల్ బేలాకు చెందిన ఒకవ్యక్తి చనిపోగా, ఒక మహిళ గాయపడిందని పూంఛ్ పోలీసు అధికారి ఒకరు బీబీసీకి తెలిపారు.

    నియంత్రణ రేఖకు సమీపంలోని బారాముల్లా, కుప్వారా, బందిపోరా ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. కుప్వారాలోని కొన్ని సెక్టార్లలో షెల్లింగ్ కారణంగా కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి.

    ఈ నేపథ్యంలో

    భారత సైన్యం జమ్మూ కశ్మీర్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీని కారణంగా జమ్మూకశ్మీర్‌లోని చాలా ప్రాంతాల్లో రాత్రివేళ విద్యుత్ నిలిచిపోయింది. ప్రజలు ఆందోళనకు గురయ్యారు.

    పూంఛ్‌లో రాత్రీ పగలు షెల్లింగ్ కొనసాగినా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదు. జమ్మూకశ్మీర్‌లో విద్యాసంస్థలన్నింటినీ రెండు రోజుల పాటు మూసివేసి పరీక్షలను వాయిదా వేశారు.

  9. పశ్చిమ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ దాడులు తిప్పికొట్టామన్న భారత్

    భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, పశ్చిమ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ చేసిన దాడులను తిప్పికొట్టినట్టు భారత్ చెప్పింది

    పాకిస్తాన్ సైన్యం పశ్చిమ సరిహద్దు వ్యాప్తంగా డ్రోన్లు, ఇతర ఆయుధాలతో పలుమార్లు దాడులు చేసినట్టు భారత సైన్యానికి చెందిన అడిషనల్ డైరక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ (ఏడీజీ పీఐ) ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు.

    ‘‘పాకిస్తాన్ సైన్యం పశ్చిమ సరిహద్దు అంతటా డ్రోన్లు, ఆయుధాలతో పలుమార్లు దాడులు చేసింది. మే 8,9 రాత్రులలో ఈ దాడులు చేసింది. జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ దళాలు పలుమార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించాయి’’ అని పేర్కంది.

    పాకిస్తాన్ డ్రోన్ల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, కాల్పులను కూడా గట్టిగా తిప్పికొట్టామని భారత సైన్యం తెలిపింది.

    గురువారం (మే 8వ తేదీ ) రాత్రి 11 గంటల సమయంలో ఉరీ సెక్టార్‌లో భారీ పేలుళ్లు జరిగాయని శ్రీనగర్‌లోని బీబీసీ కరస్పాండెంట్ మాజిద్ జహంగీర్ చెప్పారు. సరిహద్దులోని పౌరప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు.

  10. జమ్మూకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా

    జమ్మూలో పరిస్థితులను సమీక్షించేందుకు ఒమర్ అబ్దుల్లా బయల్దేరారు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, జమ్మూలో పరిస్థితులను సమీక్షించేందుకు బయల్దేరిన ఒమర్ అబ్దుల్లా

    జమ్మూలో పరిస్థితులను సమీక్షించేందుకు అక్కడకు బయల్దేరినట్టు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

    ‘‘జమ్మూనగరం, ఇతర ప్రాంతాలలో గతరాత్రి పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేయడానికి విఫలయత్నం చేసిన తరువాత పరిస్థితిని సమీక్షించడానికి ఇప్పుడు జమ్మూకు బయలుదేరాను’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.

    సైనిక స్థావరాలపై పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణి దాడి చేశాయని, వాటిని భగ్నం చేశామని భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ గురువారం (మే8న) పోస్ట్ చేసింది.

    పాకిస్తాన్ ద్రోన్ దాడిని పాక్ రక్షణ మంత్రి ఖండించారు.

    మే 8వ తేదీ రాత్రి 8:45 గంటలకు జమ్మూ నగరం నుంచి వైమానిక దాడుల సమాచారం రావడం ప్రారంభమైంది.

    జమ్మూకశ్మీర్‌లోని రజౌరీలో ఉన్న బీబీసీ కరస్పాండెంట్ దివ్య ఆర్య మాట్లాడుతూ మే 8న ఉదయం తాను జమ్మూలో ఉన్నానని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన గ్రామాలను సందర్శించానని చెప్పారు.

    ‘‘జమ్మూ నగరంలో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి, ఆ తర్వాత ఆ ప్రాంతమంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కేవలం వాట్సాప్ కాల్ సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉంది. స్థానికులు కొన్ని వీడియోలను పంపారు. ఇందులో బ్లాక్అవుట్ మధ్య ఆకాశంలో చిన్న దీపాల్లాంటివి కనిపించాయి. వీటిని స్థానికులు డ్రోన్లుగా భావించారు’’ అని దివ్య ఆర్య తెలిపారు.

  11. భారత మిసైల్స్‌ను పాకిస్తాన్ ఎందుకు అడ్డుకోలేకపోయింది?

    పూర్తి కథనం ఈ లింక్ లో చూడండి.

  12. భారత్-పాక్ ఉద్రిక్తతలు: ఇప్పటిదాకా ఏం జరిగింది?

    భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి

    జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడికి ప్రయత్నించిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

    జమ్మూ, ఉధంపుర్.. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ మిలటరీ స్థావరాలపై పాక్ దాడికి యత్నించిందని.. అయితే, ఎలాంటి నష్టం జరగలేదని 'ఎక్స్' వేదికగా తెలిపింది.

    పాక్ క్షిపణులను తాము ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

    మరోవైపు, కశ్మీర్‌పై ఎలాంటి దాడులు చేయలేదంటూ పాకిస్తాన్ ఖండించింది. ఈ మేరకు పాక్ రక్షణ మంత్రి బీబీసీకి చెప్పారు.

    పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  13. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు: దాడులు పరిష్కారం కావన్న అమెరికా

    భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలపై అమెరికా స్పందించింది

    ఫొటో సోర్స్, Getty Images

    భారత్- పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా స్పందిస్తూ.. ఇరు దేశాలు పరస్పర దాడులు మానుకోవాలని, దీనివల్ల ఎలాంటి పరిష్కారం లభించదని పేర్కొంది.

    అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ మీడియాతో మాట్లాడుతూ..

    హింస, సైనిక చర్య, యుద్ధం ఆగిపోవాలన్నదే అమెరికా సందేశమని బ్రూస్ అన్నారు. యుద్ధం వల్ల పరిష్కారం లభించదని పశ్చిమాసియాలో నిరూపితమైందన్నారు.

    తరతరాలుగా కొనసాగుతున్న హింస, సమస్యలను ఆపడానికి కొత్త ఆలోచనలు, దౌత్యం ఒక్కటే పరిష్కారమన్నారు.

    భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వంపై టామీ బ్రూస్ స్పందిస్తూ.. ‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధిత దేశాల నేతలు దౌత్యపరంగా లేదా ఏ స్థాయిలో మాట్లాడినా, ఆ సమాచారాన్ని పంచుకోం. ఇదే మా విధానం’’ అని తెలిపారు.

    భారత్- పాక్ మధ్య మధ్యవర్తిత్వాన్ని టామీ బ్రూస్ ధృవీకరించలేదు లేదా ఖండించలేదు.

    అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ఫోన్లో మాట్లాడారని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.

    ఉద్రిక్తతలను తగ్గించాలని, హింసను ఆపాలని రుబియో ఇరు దేశాల నాయకులను కోరారు.

    ప్రత్యక్ష చర్చలకు కూడా ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.

  14. భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత: 24 విమానాశ్రయాలు మూసివేత, ఎయిర్ మార్షల్స్ మోహరింపు

    airindia

    ఫొటో సోర్స్, Getty Images

    జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్‌లలో 24 విమానాశ్రయాలను మూసివేశారు. పౌర విమాన సేవలను నిలిపివేశారు.

    దేశంలోని అన్ని విమానయాన సంస్థలు, విమానాశ్రయాల్లో భద్రతా చర్యలను పెంచాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఆదేశించింది.

    అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులందరిని క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు.

    టెర్మినల్ భవనాలలోకి సందర్శకుల ప్రవేశాన్ని నిషేధించారు.

    ఎయిర్ మార్షల్స్‌ను మోహరింపచేస్తున్నట్టు బీసీఏఎస్ వెల్లడించింది.

    ఇకపై దేశీయ ప్రయాణికులు మూడు గంటల ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని, చెక్-ఇన్‌ను 75 నిమిషాల ముందే మూసివేస్తారని బీసీఏఎస్‌ను ఉటంకిస్తూ ఎయిరిండియా ఎక్స్ వేదికగా తెలిపింది.