కాక్పిట్లో మహిళా పైలెట్ను కొట్టిన మగ పైలెట్

ఫొటో సోర్స్, Getty Images
జెట్ ఎయిర్వేస్ విమానంలో ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన గొడవ చివరకు వారి సస్పెన్షన్కు దారితీసింది.
లండన్ నుంచి ముంబయికి వస్తున్న జెట్ ఎయిర్వేస్ విమానంలోని మగ పైలెట్ కాక్పిట్లోని మహిళా పైలెట్పై చేయిచేసుకోవడమే వివాదానికి కారణమని తెలిసింది.
సోమవారం ఇరాన్-పాకిస్తాన్ మధ్య గగనతలంలో విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని విమాన సంస్థ అధికారుల్లో ఒకరు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు.
"9డబ్ల్యూ119 విమాన కాక్పిట్ సిబ్బంది మధ్య జనవరి 1న ఓ అంశంపై తలెత్తిన అభిప్రాయభేదం చిన్న గొడవకు దారితీసింది.
కానీ అది సామరస్యపూర్వకంగా పరిష్కారమైపోయింది. విమానంలో ఉన్న 324మంది ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా గమ్యాన్ని చేరారు" అని విమానసంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.
కానీ, కొన్ని అంశాలపై మగ పైలెట్కు మహిళా పైలెట్కు మధ్య తీవ్ర వాక్ యుద్ధం జరిగిందని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
వీరిద్దరూ గతంలో కూడా ఎన్నోసార్లు ప్రయాణం చేశారు. ఎన్నోసార్లు గొడవ పడ్డారు కూడా. కానీ ఈసారి మాత్రం చేయిచేసుకునేవరకూ వెళ్లింది. దీంతో ఆమె ఏడుస్తూ కేబిన్ నుంచి బయటకు వచ్చారు అని ఆ అధికారి తెలిపారు.
మిగిలిన సిబ్బంది ఆమెను ఓదార్చి, కాక్పిట్లోకి వెళ్లాలని కోరారు. కానీ ఆమె తిరస్కరించారు.
కొద్ది సేపటికి విమాన బాధ్యతలను సిబ్బందిలోని మరొకరికి అప్పగించి మగ పైలెట్ కూడా బయటకు వచ్చారు.
ఇలా రావడం నిబంధనలకు విరుద్ధం. ఆమెను కాక్పిట్లోకి తిరిగి రావాలని మగ పైలెట్ కూడా కోరారు అని ఆ అధికారి వివరించారు.
ఈ అంశాన్ని డీజీసీఏకు నివేదించినట్లు జెట్ ఎయిర్వేస్ సంస్థ తెలిపింది. విచారణ పూర్తయ్యేవరకు ఘటనకు బాధ్యులైన ఇద్దరు పైలెట్లను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది.
ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)








