గుజరాత్‌లో కుప్పకూలిన 100 ఏళ్ల కిందటి కేబుల్ బ్రిడ్జ్...

వీడియో క్యాప్షన్, గుజరాత్‌లో కుప్పకూలిన 100 ఏళ్ల కిందటి కేబుల్ బ్రిడ్జ్...

గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో పురాతనమైన కేబుల్ బ్రిడ్జి కూలిపోయిన విషాదంలో మృతుల సంఖ్య 140 దాటింది.

బ్రిటిష్ పాలనా కాలంలో నిర్మితమైన మోర్బీ హ్యాంగింగ్ బ్రిడ్జ్ (వేలాడే వంతెన).. గుజరాత్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి అని గుజరాత్ టూరిజం వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. మచ్చు నది మీద నిర్మించిన ఈ వంతెన ఒక 'కళాత్మక, సాంకేతిక అద్భుతం' అని జిల్లా కలెక్టరేట్ వెబ్‌సైట్‌లో అభివర్ణించారు.

పందొమ్మిదో శతాబ్దంలో యూరప్‌లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో దీనిని నిర్మించారని, ఈ వంతెన 1.25 మీటర్ల వెడల్పు, 233 మీటర్ల పొడవు ఉంటుందని వివరించారు.

మోర్బీని 1922 వరకూ పరిపాలించిన సర్ వాఘ్జీ ఠాకోర్ ఈ వంతెనను కట్టించినట్లు చెప్తారు. ఈ వేలాడే వంతెన, నదీ ముఖనగరం.. 'విక్టోరియా శకపు లండన్' నగరాన్ని జ్ఞప్తికి తెస్తాయని గుజరాత్ టూరిజం వెబ్‌సైట్ వర్ణిస్తోంది. స్థానికంగా ఈ వంతెనను 'జుల్తో పూల్' అని పిలుస్తారు.

అయితే.. వందేళ్లకు పైగా పురాతనమైన ఈ వేలాడే వంతెన శిథిలావస్థకు చేరటంతో ఈ ఏడాది మార్చిలో దీనిని మూసివేసినట్లు మోర్బి మునిసిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ ఝాలా పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.

ఈ వంతెనను అక్టోబర్ 26వ తేదీన తిరిగి తెరిచారు. కానీ నాలుగు రోజుల్లోనే ఆదివారం సాయంత్రం వంతెన కుప్పకూలింది. దీనిని చూడటానికి పెద్ద ఎత్తున వచ్చిన జనం.. వంతెన మీదకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వంతెన కూలడంతో వారంతా నదిలో పడిపోయారు. దీంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)